తెలంగాణలో మోగనున్న పంచాయతీ ఎన్నికల నగారా

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబందించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రభుత్వానికి తమ సంసిద్ధతను తెలియజేసినట్లు సమాచారం. ఈ నెల 23న జరగనున్న కేబినెట్ భేటీలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఒకే రోజు రిజర్వేషన్లు ఖరారు చేసి, వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్రక్రియ మొత్తం ఆగస్టు 15 లోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుంది. అధికారులు ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు చేయాల్సిన అంతర్గత పనులతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా, వార్డుల వారీగా ఓటరు జాబితాలను సిద్ధం చేయడంలో ఎన్నికల అధికారులు నిమగ్నమయ్యారు.
అదే సమయంలో, బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పనిచేస్తున్నారు. ఈ రెండు విభాగాల మధ్య సమన్వయం కోసం సీఎంఓ అధికారులు చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఈ పనులు పూర్తి కావడానికి వారం నుంచి పది రోజుల సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ ఏడాది జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా ఓటరు జాబితా ప్రకారం స్థానిక ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇప్పటికే సెంట్రల్ ఈసీ నుంచి కొత్త ఎలక్టోరల్ రోల్ను తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది నవంబర్లో ఈసీ విడుదల చేసిన జాబితా ప్రకారం వార్డుల వారీగా ఓటరు జాబితాను ఖరారు చేసినప్పటికీ, ఎలాంటి న్యాయ వివాదాలు తలెత్తకుండా జనవరి 1న విడుదలైన తాజా ఓటర్ జాబితాను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త జాబితా ఆధారంగా వార్డుల వారీగా ఓటరు జాబితాలను తయారు చేసే ప్రక్రియ నాలుగైదు రోజుల్లో పూర్తవుతుందని సమాచారం.
ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళ్లడానికి ముందే రైతు భరోసా పథకం అమలు ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ పథకం ద్వారా ఎకరాకు 6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. జూన్ 16న ప్రారంభమైన ఈ ప్రక్రియను తొమ్మిది రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జూన్ 25లోపు అర్హులైన రైతులందరికీ భరోసా అందించిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది.
రైతు భరోసా పథకం అమలుతో క్షేత్ర స్థాయిలో ప్రభుత్వంపై ఉన్న నెగిటివ్ టాక్ తగ్గి, సానుకూల వాతావరణం ఏర్పడుతుందని ప్రభుత్వానికి నిఘా వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. ఈ సానుకూల దృక్పథాన్ని ఉపయోగించుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సిద్ధపడుతుండటంతో బీసీ రిజర్వేషన్ల సంగతి ఏంటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టిన రేవంత్ సర్కార్ కేంద్ర ప్రభుత్వం ఆమెదం కోసం ప్రతిపాదనలను పంపింది.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్ల ను బీసీలకు ప్రతిపాధించినందున అది స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వర్తిస్తుందా.? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేస్తున్నట్లు ప్రకటిస్తే పంచాయతీ ఎన్నికలకు ఆశావహులు సన్నద్ధం కావాల్సి ఉంటుంది. అయితే బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలనే డిమాండ్ సైతం వినిపిస్తోంది.
ఎన్నికల నిర్వహణ వ్యూహంలో భాగంగా, ముందుగా రిజర్వేషన్లను ఖరారు చేస్తూ జీవోలు విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ జీవోలు విడుదలైన వెంటనే, గంటల వ్యవధిలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇదే తరహాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని ఆ అధికారి గుర్తు చేశారు. ఈసారి కూడా అదే విధానాన్ని అనుసరించి, ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేసి, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు, అవి ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
స్థానిక ఎన్నికల విషయంలో ఎస్ఈసీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. సిబ్బంది శిక్షణ, ఎన్నికల నిర్వహణ విషయంలో పక్కా ప్రణాళికలను సిద్ధం చేసే పనిలో పడింది. స్థానిక సంస్థల ఎన్నికలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షలు కూడా చేస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు షెడ్యూల్ రాకముందే ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టే పనిలో పడ్డాయి.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఈసారి పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. క్షేత్రస్థాయిలో ఉన్న నేతలు కూడా పార్టీ గెలుపు కోసం కృషి చేసే దిశగా అడుగులు వేసే పనిలో ఉన్నారు. హస్తం జెండా ఎగరవేయటమే లక్ష్యంగా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పావులు కదిపేస్తున్నారు.
షెడ్యూల్ వచ్చే నాటికే గ్రౌండ్ క్లియర్ గా ఉండాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. ఇక అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోని స్థానిక పోరులో సత్తా చాటాలని బీఆర్ఎస్ తో పాటు బీజేపీ చూస్తున్నాయి.
రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని ఆశావాహులు పావులు కదిపేస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారుపై స్పష్టత రాగానే… మరింత దూసుకెళ్లాలని భావిస్తున్నారు. చాలా రోజులుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. గెలుపు కోసం అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈసీ నుంచి ప్రకటన వెలువడితే… పల్లెల్లో పొలిటికల్ హీట్ మరింత పెరగనుంది.
ప్రభుత్వం ఆగస్టు 15లోపు ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్ర దినోత్సవానికి ముందే స్థానిక సంస్థలకు కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
ఎన్నికలకు అవసరమైన అన్ని సన్నాహాలను వేగవంతం చేస్తూ, ఎలాంటి న్యాయపరమైన అవాంతరాలు లేకుండా సకాలంలో ఎన్నికలు పూర్తి చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైనట్లే కనిపిస్తోంది. దీనికి సంబందించి త్వరలోనే షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది.