Telangana: ఉగాదికి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

Telangana: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. డైలీ సీరియల్ను తలపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా.. ఇప్పటివరకు మంత్రివర్గ కాలేదు. ఇంతకూ క్యాబినెట్ ఎక్స్టెన్షన్ కాకపోవడానికి కారణమేంటి..? అసలు మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు ఉండబోతుంది..? ఉగాది లోపు మంత్రి పదవులు ఆశించే నేతలకు శుభవార్త వినిపిస్తుందా..? ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారు..? ఎన్ని మంత్రి పదవులను జాతీయ నాయకత్వం భర్తీ చేయాలనుకుంది..? అసలు పూర్తి మంత్రి వర్గాన్ని విస్తరిస్తుందా..? లేదా..?. ఇంతకీ మంత్రి పదవులు ఎవరెవరికి రానున్నాయి? ఎవరెవరికి పెండింగ్ లో ఉండనున్నాయి? మంత్రి పదవి ఆశించి రాని నేతలకు ఎలాంటి అవకాశాలు కల్పించనున్నారు? అసలు పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది..? తెలియాలంటే ఈ స్టోరి చూడాల్సిందే.
ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఉగాది లోపు ఏ క్షణమైన మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మార్పు నినాదంతో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టి ఏడాదిన్నరయింది. అదిగో ఇదిగో అంటూ కేబినెట్ విస్తరణ ఆశవహులను ఊరిస్తూనే ఉంది. ప్రస్తుతం సీఎం సహా 12 మంత్రులు వున్నారు. లెక్క ప్రకారం కేబినెట్లో మరో ఆరుగురికి చోటు వుంటుంది. అయితే.. 6 మంత్రి పదవుల కోసం ఆశావహులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. దీంతో మంత్రి వర్గ విస్తరణను ఆలస్యం చేయవద్దని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే.. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉన్నపలంగా ఢిల్లీకి పిలిపించుకుని.. మంత్రి వర్గ విస్తరణపై సీనియర్గా కసరత్తు చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం ఇవ్వాలి..? ఎవరెవరికి జాతీయ నాయకత్వం మంత్రి వర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది.?.. ఎవరికి ఇస్తే పార్టీకి ప్రభుత్వానికి లాభం జరుగుతుంది..? అనే కోణంలో ఆలోచన చేసినట్లు సమాచారం.
6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా ఆశవాహుల సంఖ్య మాత్రం డజన్ కు పైగానే ఉన్నారు. ఇదే అంశాన్ని రాష్ట్రంలోని ముఖ్య నేతలు ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను సంపూర్ణంగా భర్తీ చేస్తే ఎలా ఉంటుంది..? అనే అంశం పైన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే.. ఆశావహులు ఎక్కువ సంఖ్యలో ఉండడం, పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేస్తే.. ఉన్న 6 మంత్రి పదవుల్లో ఎవరికైనా మంత్రి పదవి ఆశించే నేతలకు మంత్రి పదవి దక్కకపోతే.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ పెద్దల దృష్టికి రాష్ట్ర నేతలు తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో సంపూర్ణ మంత్రివర్గ విస్తరణ చేస్తే లాభం కంటే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని నేతల మధ్య అభిప్రాయం వ్యక్తం అయినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిిస్తున్నాయి.
అందుకే ఉన్న 6 మంత్రి పదవుల్లో 2 మంత్రి పదవులను పెండింగ్ లో పెట్టాలని జాతీయ నాయకత్వం ఆలోచన చేసినట్లుగా సమాచారం. మొదటగా పార్టీ ఎవరికైతే హామీ ఇచ్చిందో వారికి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించి… 2 మంత్రి పదవులను ఖాళీగా పెడితే ఎవరైతే ఆశావాహులు ఉంటారో… వారికి మిగతా క్యాబినెట్ విస్తరణ జరిగినప్పుడు ఆ రెండు మంత్రి పదవులు మీకంటే మీకే వస్తుందని ఆశవాహులకు చెప్పవచ్చనే ఆలోచన చేసినట్లు తెలుస్తుంది. తద్వారా ఇప్పుడు మంత్రివర్గంలో చోటు కావాలనుకున్న నేతలకు చోటు కల్పించకున్నా కొన్ని రోజులు మాత్రం పార్టీలో అసంతృప్తి ఉండకుండా జాగ్రత్త పడాలని పార్టీ ఎత్తుగడగ కనిపిస్తుంది. ఆ లోపు నేతల్లో ఎవరికైనా అసంతృప్తి ఉన్న బుజ్జగించి ఇంకా వారికి పార్టీలో కానీ… ప్రభుత్వ పదవుల్లో కానీ స్థానాన్ని భర్తీ చేస్తే వాళ్ళ అసంతృప్తిని కూడా పోగొట్టొచ్చని తద్వారా నేతల్లో అసంతృప్తి లేకుండా కాస్త సమయం తీసుకున్న చేయవచ్చనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నారట… అందులో భాగంగానే నాలుగు మంత్రి పదవులు మాత్రమే ఈ దఫా భర్తీలని ఢిల్లీ పెద్దల ఆలోచనగా ఉందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి.
అయితే క్యాబినెట్ విస్తరణలో మొదట ప్రాధాన్యతగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, వివేక్ వెంకటస్వామి లకు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఎన్నికల ముందు బిజెపి నుండి కాంగ్రెస్ లో చేరారు. వీరు పార్టీలో చేరితే మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చే పార్టీలోకి తీసుకున్నామని పార్టీ పెద్దలు రాష్ట్ర ముఖ్య నేతలకు చెప్పినట్లు సమాచారం అందులో భాగంగానే రాజగోపాల్ రెడ్డి, వివేక్ లకు మంత్రివర్గంలో స్థానం కల్పించనునట్లు హస్తం వర్గాల్లో చర్చ జరగుతుంది. ఇక సుదర్శన్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరమీదకి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇప్పటివరకు మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు సుదర్శన్ రెడ్డి సీనియర్ నేతగా ఉన్నారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు కాబట్టి ఆయన సేవలను గుర్తించి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలను కోరినట్లు తెలుస్తుంది.కాబట్టి సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు చర్చ జరుగుతుంది.
అదేవిధంగా తెలంగాణలో బీసీ సామాజిక వర్గంలో ముదిరాజ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది ఆ సామాజిక వర్గం నుండి మంత్రి పదవి ఇవ్వాలని ఢిల్లీ పెద్దల దృష్టికి ముఖ్యమంత్రితో సహా మిగతా నేతలు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది అందులో భాగంగానే శ్రీహరి ముదిరాజ్ కు మంత్రివర్గంలో చోటు దగ్గర ఉన్నట్లు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.
ఇక మంత్రి పదవి ఆశించి మంత్రివర్గంలో చోటు దక్కని వారికి ఏం చేయాలనే అంశం పైన కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే చీఫ్ విప్ పదవి ఇవ్వాలని నిర్ణయించారట అదేవిధంగా లంబాడా సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటుదక్కపోతే డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టాలని నిర్ణయానికి వచ్చారట.
అయితే ప్రేమ్ సాగర్ రావు, మైనంపల్లి రోహిత్ రావు, మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, విజయశాంతి, బాలు నాయక్, అమీర్ అలీ ఖాన్ వంటి నేతలు మంత్రి పదవుల పైన ఆశలు పెట్టుకున్నారు. అయితే 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి అని వీరిలో ఎంత మంది నేతలకు ఆశ పెడతారు మంత్రి పదవులకు బదులుగా ప్రత్యామ్నాయంగా వేరే పదవులు ఎంతమందికి ఇస్తారు అనేది పార్టీలో ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది..
అల్రెడీ నల్లగొండ జిల్లా నుంచి కేబినెట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫిర్బీ తనకు చాన్స్ పక్కా అనే ధీమాతో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరోవైపు వివేక్ వెంకటస్వామి, పెద్దల సభ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతికి అవకాశం వుండొచ్చనే ప్రచారం తెరపైకి రానే వచ్చింది. ప్రొఫెసర్ కోదండరామ్ పేరు కూడా పరిశీలనలో ఉందనే ప్రచారం జరిగింది. ఇక మంత్రి పదవి లేకపోవడం వల్లే రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతుందంటూ తనకు కేబినెట్లో చోటివ్వాలని చెప్పకనే చెప్పారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి .
తనకు చాన్స్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానంటూ అలకాస్త్రం కూడా ప్రయోగించారు. ఇక మైనార్టీ కోటా నుంచి కూడా కాంపిటేషన్ ఎక్కువగానే ఉంది. ఇక సామాజిక సమీకరణాల ప్రకారం ఎస్టీ లంబాడకోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ తన ఆవాజ్ విన్పించడం సహా సీనియర్ నేత జానారెడ్డి అండందండలతో గట్టిగా ప్రయత్నాలు చేశారనేది టాక్..
మొత్తానికి క్యాబినెట్ విస్తరణతో కాంగ్రెస్ లో అసంతృప్తి పరులు బయటకు వస్తారా..? లేక ప్రత్యామ్నాయ పదవులతో సర్దుకుంటారా..? ఇంకా మంత్రివర్గ విస్తరణ ఉంది మీకే ఛాన్స్ ఉంది అంటే ఎంతమంది వింటారు..? టఫ్ కాంపిటేషన్ నేపథ్యంలో రాజపూజ్యం-అవమానాలు అసంతృఫ్తులు ఏ రేంజ్లో ఉంటాయోననే దానిపై కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది.