గోవుల మృతిపై టీడీపీ Vs వైసీపీ

ఏపీలో రాజకీయాలంటే చాలా కష్టం ప్రతి అంశం రాజకీయ కోణంలో చూడటం ఈ రాష్ట్రంలోనే కనిపిస్తుంది. రెండు బలమైన ప్రాంతీయ పార్టీల పోరుగడ్డ అయిన రాష్ట్రంలో సున్నితమైన అంశాలపై రాజకీయాలు చోటుచేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ క్రమంలోనే కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత రాజకీయ రచ్చ చోటుచేసుకుంది. అధికార కూటమి, విపక్ష వైసీపీ నేతల మధ్య గోవుల మృతిపై గత కొన్ని రోజులుగా విమర్శలు, ప్రతి విమర్శలు చోటుచేసుకుంటున్నాయి.
నిన్నటిదాకా మాటలకు పరిమితమైన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఏకంగా బాహాబాహీకి దిగేంతగా పరిస్థితిని తీసుకువెళ్లాయి. గోవుల మరణాలపై చర్చ అంటూ టీడీపీ సవాల్ విసరగా… అందుకే సై అన్న వైసీపీ వివాదానికి మరింతగా ఆజ్యం పోసింది. ఇంతకీ గోశాలలో ఏం జరుగుతుంది..? అసలు ఈ యుద్ధంలో గెలిచేదెవరు..?
తిరుపతి ఎస్వీ గోశాల వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గోశాలలో గోవుల మృతిపై గత కొన్ని రోజులుగా విమర్శలు, ప్రతి విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయాలకు ఆస్కారం లేకుండా ఉండాల్సిన చోట.. నానాటికీ రాజకీయ రచ్చ పెచ్చు మీరుతుంది. 1956లో చంద్రగిరి నియోజకవర్గంలోని తుమ్మలగుంట వద్ద ఈ గోశాలను టీటీడీ ఏర్పాటు చేసింది. ప్రతి రోజు స్వామివారికి నిర్వహించే సుప్రభాతం సేవలో వెన్న, పాలు, ఇతర ప్రసాదాల్లో వినియోగించుకునే పాలను టీటీడీ ఈ గో సంరక్షణ శాలలో ఉత్పత్తి చేస్తుంది.
దేశంలో గల 14 రకాల గో జాతులలో ఏపీకి చెందిన పుంగనూరు, ఒంగోలు జాతులు, తమిళనాడుకు చెందిన ఉంబలాచారి, తాంగయ్యాన్, గుజరాత్ కు చెందిన గీర్, కాంక్రీజ్, పంజాబ్ కు చెందిన సాహీవాల్ జాతి, హర్యానాకు చెందిన హర్యాన్, థార్పార్కర్, కర్ణాటకకు చెందిన హాలికర్, కేరళకి చెందిన వేచూర్ క్యాట్ జాతులతో పాటు మరికొన్ని విశేష జాతులు ఉన్నాయి. వాటికి కావాల్సిన పోషకాలు మెండుగా ఉండేలా మేతను వేస్తారు.
కాగా.. తిరుపతి గోశాలలో గడచిన 3 నెలల్లోనే 100 మేర గోమాతలు మృత్యువాత పడ్డాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయ రచ్చకు తెర తీశారు. మూడు నెలల కాలంలో టీటీడీ గోశాలలో వందకు పైగా లేగ దూడలు, ఆవులు చనిపోయాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన విమర్శలను బలపరుస్తూ ఫోటోలు వీడియోలు సైతం విడుదల చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, టీటీడీ పాలకమండలి అధికారుల నిర్లక్ష్యం కారణంగా 100 గోవులకు పైగానే గోశాలలో గోవులు చనిపోయాయని భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం అని తాను అబద్దాలు చెప్పి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటన చేశారు.
వైసీపీ హయాంలో జగన్ కొలువులో పనిచేసిన మంత్రులందరిని కూటమి ప్రభుత్వం కటకటాల పాటు చేసింది. నోటి దురుసుతో మాట్లాడిన నేతలందరూ కేసులు పెట్టించుకుని పార్టీకి ముఖం చాటేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు ఎండ కడుతూ వస్తున్నారు. టీటీడీని టార్గెట్గా చేసుకుని గోవుల మరణాల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆరోపణలు మీద ఆరోపణలు చేసి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
ఏకంగా సీఎం చంద్రబాబు విషయంలో కల్పించుకుని వైసీపీ నేతలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చే పరిస్థితికి వచ్చింది. అయితే గత కొంతకాలంగా రాష్ట్రంలో వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లి మాట్లాడినా.. దాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టగలిగిన కూటమి నేతలు తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను మాత్రం సరైన రీతిలో సమాధానం ఇవ్వలేకపోతున్నారంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. తిరుపతిలో కూటమి నేతలు వ్యవహరించిన తీరు కూడా అంతంత మాత్రమేనని విమర్శలు వినిపిస్తున్నాయి.
చిలికి చిలికి గాలి వానగా మారిన గోశాల అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ అంశంపై టీటీడీ ఈవో శ్యామల రావు సైతం మీడియా సమావేశం ఏర్పాటు చేసి 2021-2024 మద్య కాలంలో టీటీడీ గోశాలలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ నైవేద్యాలను పవర్ పాయింట్ రూపంలో అందజేశారు. అప్పట్లో కుళ్లిపోయి పురుగుల పట్టిన ఆహారాన్ని గోవులకు అందించాయని ఈవో శ్యామలరావు వివరించారు. కాలం చెల్లిన మందులు పశువులకు వినియోగించినట్లు విజిలెన్స్ విచారణలో తేలిందని తెలిపారు. గత ప్రభుత్వ హయంలోనే విజిలెన్స్ ఎంక్వయిరీ వేసి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు . దీంతో ఈ అంశం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది.
చనిపోయిన ఆవులన్ని వైసీపీ హయాంలోనే చనిపోయాయంటూ విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఎన్డీయే కూటమి విమర్శలు చేసింది. 100 గోవులు చనిపోయాయని వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేశారని మూడు నెలల కాలంలో 43 గోవులు మాత్రమే చనిపోయాయని స్పష్టం చేసింది. ఫేక్ ఫొటోలతో టీటీడీ ప్రతిష్ట దెబ్బకు తీసే విధంగా వైసీపీ కుట్రలు చేస్తుందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇక భూమన పై కేసు నమోదు చేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి. గోశాల అంశంతో పాటుగా భూమన కరుణాకర్ రెడ్డి భానుప్రకాష్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తిరుపతి ఎయిర్పోర్ట్, గెస్ట్ హౌస్, శ్రీవారి ఆలయానికి పరిమతం అవుతున్నారని విమర్శించారు. దీంతో టెంపుల్ సిటీలో వేసవి తాపం కన్నా పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరుకుంది.
టీడీపీ సవాల్ ను వైసీపీ స్వీకరించడంతో తిరుపతిలో యుద్ధ వాతావరణం నెలకొంది. భూమనకు ఓ వైపు గోశాలకు వెళ్లొచ్చు అంటూ క్లీనర్ ఇస్తూనే వ్యక్తిగత సిబ్బందితో మాత్రమే గోశాలకు రావాలని పోలీసులు సూచించారు. కేవలం ఐదు మంది మాత్రమే వెళ్ళాలని పోలీసులు తెలిపారు. దీనికి అంగీకరించని భూమన ఇంటి వద్దనే ఉన్న రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి రోజా, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, తిరుపతి ఎంపీ గురు మూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంతో సహా నిరసన కార్యక్రమం చేపట్టారు.
అదే సమయంలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రాక కోసం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని, కలికిరి మురళీ మోహన్, తదితరులు ఎస్వీ గోశాల వద్దకు చేరుకుని భూమన రాక కోసం వేచి ఉన్నారు. గోశాలకు వచ్చి ఇక్కడ ఎలాంటి అక్రమాలు జరిగాయో రుజువు చేయాలని డిమాండ్ చేశారు. రుజువు చేసే పరిస్థితి లేదు కాబట్టే భూమన తోక ముడిచారని టీడీపీ ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ చేయడం రాజకీయ వ్యాఖ్యలు మరింత ముదిరాయి.
అర్ధరాత్రి నుంచే తనను, తమ నేతలను హౌస్ అరెస్టు చేశారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. యాబై మందికి పైగా పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టారని, తిరుపతి ఎస్వీ గోశాలలోని నిజాలు నిగ్గుతేల్చాలని బయలుదేరితే పోలీసులతో అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎస్పీతో కూడా ప్రభుత్వం అబద్దం చెప్పిందని భూమన పేర్కొన్నారు. తమని గోశాల వద్దకు పంపలేదని, అందుకే రోడ్డుపై బైఠాయించామని భూమన చెప్పారు.
ఇక భూమన కరుణాకర్ రెడ్డిని ఇంటివద్దనే పోలీసులు కట్టడి చేశాయని పోలీసుల తీరుపై భూమన అభినయ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల కళ్లుగప్పి గోశాల వద్దకు చేరుకుని తనను లోపలకు పంపాలని డిమాండ్ చేశారు. అనుమతిస్తాం అంటారు ఇంటి వద్ద పోలీసులతో కూటమి నేతలు అడ్డుకుంటారని పోలీసులపై మండిపడ్డారు. భూమన అభినయ్ రెడ్డిని అరెస్ట్ చేసి తిరుపతి ఎంపీ గురుమూర్తిని మాత్రమే గోశాలలో అనుమతించారు. కూటమి ఎమ్మెల్యేలతో కొంత సేపు వక్వాదానికి దిగిన ఎంపీ గురుమూర్తి గోశాల నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఈ క్రమంలోనే టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేశారని.. భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎస్వీయూ పోలీస్ స్టేషన్లో టీటీడీ పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. గోశాలలో ఆవుల మృతిపై అసత్య ఆరోపణలు చేశారని కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ యాక్ట్ 353(1), 299, 74 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది.
మరణిస్తున్న గోవుల వ్యవహారాన్ని సున్నితంగా పరిష్కరించాల్సిన టిటిడి.. ఒక విధంగా పాలకమండలి, అధికారుల మధ్య సమన్వయ లోపంతో యధావిధిగానే ప్రతిపక్షాలకు ఆయుధాలను ఇచ్చినట్లు వ్యవహరించింది. గోవుల సహజ మరణాలపై ముందుగా ఒక ప్రణాళిక వాస్తవ సమాచారాన్ని ముందు ఉంచుకోకుండా ముఖ్యమంత్రి అసలు ఒక్క ఆవు కూడా చనిపోలేదనడం టీటీడీ చైర్మన్ 24 ఆవులు చనిపోయాయి అనడం, ఈవో శ్యామలరావు ఏకంగా 42 ఆవులు చనిపోయాయని చెప్పడం, భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన విధంగా వంద గోవులు మూడు మాసాల్లో మరణించాయని ఆరోపించడం టీటీడీ పాలకమండలి వ్యవహారశైలికి అద్దం పడుతుంది. ఒక విధంగా టీటీడీ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది.
రాజకీయాలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా ఉండాల్సిన చోట ఇలా నానాటికీ రాజకీయ రచ్చ పెచ్చు మీరుతున్న వైనం భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ప్రధానంగా గోశాలలో గోవుల మృతిపై టీడీపీ వర్సెస్ వైసీపీగా సీన్ మారింది. గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఆవులు మృతి చెందాయని వైసీపీ నేత భూమన కరుణారెడ్డి ప్రధాన ఆరోపణ. కాదు.. కాదు.. వయస్సు పెరగడంతోనే ఆవులు మృతి చెందాయంటోంది టీడీపీ. ఈ నేపథ్యంలోనే గోశాల ఆవుల మృతిపై టీడీపీ- వైసీపీ సవాళ్లు చేసుకుంది. మరి ఈ యుద్ధంలో గెలిచేదెవరో వేచి చూడాలి.