Amarnath Yatra: భారీ భద్రత నడుమ అమర్నాథ్ యాత్ర

Amarnath Yatra: మంచు కొండల్లో కొలువై ఉన్న ఆ మహాశివుడి దర్శనం కోసం వేయి కళ్లతో భక్తజనం పరితపిస్తుంటారు. ఏటా 2 నెలలు మాత్రమే మంచు రూపంలో సహజ లింగాకారంలో దర్శనమిచ్చే ఆ పరమశివున్ని కళ్లారా దర్శించుకోవాలనుకుంటారు. హరహర మహాదేవ శంభోశంకర అంటూ అడుగులో అడుగు వేస్తూ కదులుతుంటారు. ప్రకృతి పెట్టే పరీక్షలను తట్టుకుంటారు. కొండలు, లోయలు, సెలయేళ్లు దాటుతారు.
ఇదంతా అమర్ నాథ్ యాత్రా స్పెషల్. ఇప్పుడు ఆ పరమశివుడి దర్శనం కోసం యాత్ర ప్రారంభమైంది. అయితే ఈ సారి యాత్ర భద్రతా దళాలకు పెను సవాల్ గా మారింది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పరిస్థితులు మారిపోయాయ్. పాకిస్థాన్ ఉగ్రవాదులు హిందూవులే లక్ష్యంగా దాడులు చేసే అవకాశం ఉండడంతో ఈ సారి భద్రత్రా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఇంతకీ భారత్ ప్రభుత్వం ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంది.? భక్తులు అక్కడి వెళ్లేందుకు ఎలాంటి రూల్స్ పాటించాలి..?
హిందువులు చేసే పవిత్రమైన తీర్ధయత్రాల్లో అమర్నాథ్ యాత్ర ఒకటి. తమ జీవితంలో ఒక్కసారైనా మంచు కొండల్లో కొలువైన శివయ్యను దర్శించుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. కష్ట తరమైన సరే అమర్ నాథ్ యాత్రకు వెళ్లేందుకు ఆసక్తిని చూపిస్తారు. ఈ అమర్నాథ్ గుహ జమ్మూ కాశ్మీర్లో సుమారు 38888 మీటర్ల్ ఎత్తులో ఉంది. ప్రతి సంవత్సరం శివ భక్తులు ఈ యాత్ర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ గుహలో సహజంగా మంచు శివలింగంగా ఏర్పడుతుంది. దీనిని హిందూ మతంలో శివుని చిహ్నంగా భావిస్తారు. శివలింగాన్ని పోలి ఉండే ఈ ఆకారం 15 రోజుల పాటు ప్రతిరోజూ కొద్దిగా పెరుగుతూనే ఉంటుంది.
అంటే 15 రోజుల్లో ఈ మంచు శివలింగం ఎత్తు 2 గజాల కంటే ఎక్కువ అవుతుంది. తర్వాత 16వ రోజు నుంచి శివలింగం పరిమాణం తగ్గుతూ వస్తుంది. అంటే చంద్రుడు క్షీణిస్తున్న కొద్దీ శివలింగం పరిమాణం కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. చంద్రుడు అదృశ్యమయ్యే కొద్దీ శివలింగం కూడా అదృశ్యమవుతుంది. ఈ గుహను 15వ శతాబ్దంలో ఒక ముస్లిం గొర్రెల కాపరి కనుగొన్నాడట.
అమర్ నాథుడి దర్శనం అంత ఈజీ కాదు. కొండలు, గుట్టలు, సెలయేళ్లు దాటాలి. ప్రకృతి పెట్టే పరీక్షలను తట్టుకోవాలి. విపరీతమైన చలి, మంచు తుఫాన్లను దాటాలి. సముద్ర మట్టానికంటే 3,880 మీటర్ల ఎత్తుకు ఎక్కాలి. ఇంత సాహసం చేస్తేగానీ.. మంచు రూపంలో కొలువై ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకోలేం. వీటికి తోడు ఇప్పుడు మరో సవాల్ కూడా దాటాలి. అదే ఉగ్రవాదుల ముప్పు. మొన్నటికి మొన్న పహల్గాంలో మారణహోమం సృష్టించారు. హిందువులనే టార్గెట్ చేసి ప్రాణం తీశారు. ఇప్పుడు అమర్ నాథ్ యాత్రకు వెళ్లే వారంతా హిందువులే కావడంతో వారిపై ఉగ్రదాడి చేసే అవకాశం ఉండడంతో…. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది కేంద్రం.
నిజానికి అమర్ నాథ్ యాత్రను విజయవంతం చేయడం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి.. ఇటు భద్రతా దళాలకు పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే ఆపరేషన్ సిందూర్ తో పీఓకేలో ఉగ్రస్థావరాలను మన మిసైల్స్ తో ధ్వంసం చేసింది. అయితే మళ్లీ టెర్రర్ క్యాంపులు రెడీ అవుతున్నాయ్ దీంతో ఈ ఉగ్రమూకలతో అమర్ నాథ్ యాత్రికులకు ముప్పు పొంచి ఉండడంతో బలగాలు పూర్తిస్థాయిలో అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే మాక్ డ్రిల్స్ నిర్వహించాయి. అటు ఎయిర్ ఫోర్స్ ఇటు గ్రౌండ్ ఫోర్స్ అంతా రెడీ అయింది. యాత్రికుల రూట్లలో ఒక్క పక్షి కూడా ఎగరడానికి వీల్లేకుండా చేసేశారు. చెప్పాలంటే ఈసారి అమర్ నాథ్ యాత్రలో ప్రతి అడుగు నిఘా నీడలోనే ఉండబోతోంది.
యాత్రికుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు భద్రతా దళాలు ఆపరేషన్ శివను ప్రారంభించాయి. పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో యాత్రికులకు రక్షణ కల్పించడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా సుమారు 50వేల మంది పారామిలటరీ సిబ్బంది, జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి యాత్ర మార్గాల్లో ప్రతిరోజూ రోడ్ ఓపెనింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తారు. మార్గమధ్యంలో పేలుడు పదార్థాలు, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్లు ఏవైనా ఉంటే గుర్తించి నిర్వీర్యం చేస్తారు.
ఇప్పటికే అమర్నాథ్ కు వెళ్లే మొదటి బ్యాచ్ యాత్ర ప్రారంభమైంది. భగవతినగర్లోని యాత్రి నివాస్ బేస్ క్యాంప్ నుంచి జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ ఏడాది తొలిసారిగా యాత్రికుల కన్వాయ్ కదలికల సమయంలో రక్షణగా జామర్లను కూడా మోహరించారు. ఇప్పటికే భద్రతా దళాలు నిర్దేశిత యాత్రా మార్గాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం అంతటా అదనపు బలగాలను కూడా మోహరించారు.
బహుళ అంచెల భద్రతా వ్యూహం, జామర్లు, మానవరహిత విమాన వాహనాలపై ఆంక్షలు వంటి సాంకేతిక చర్యలతో ప్రతి సంవత్సరం హిమాలయ పుణ్యక్షేత్రానికి తరలివచ్చే వేలాది మంది యాత్రికుల భద్రత మరింత పటిష్టమవుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రను దృష్టిలో పెట్టుకుని యాత్రికుల భద్రత కోసం కనీవిని ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. యాత్ర మార్గాలు, బేస్ క్యాంపులు, సున్నిత ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు.
బాడీ స్కానర్లు, సీసీటీవీ కెమెరాలు, 24/7 నిఘాతో కూడిన మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేశారు. నిఘా నీడ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అటు గ్రౌండ్, ఇటు గగనతలం అంతా శత్రుదుర్బేధ్యంగా మారింది. దాల్ సరస్సులో నీటి లోపల కూడా నిఘా పెంచేశారు. ఉగ్రవాదుల ఆటలు సాగకుండా పకడ్బందీ ప్రణాళిక అయితే రెడీ అయింది.
అమర్నాథ్ యాత్రలో పురుషులు, మహిళలు, సాధువులతో సహా వేలాది మంది భక్తులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. యాత్ర సురక్షితంగా కొనసాగడానికి అవసరమైన అన్ని చర్యలను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం పూర్తి చేసింది. 38 రోజుల పాటు జరిగే అమర్నాథ్ యాత్రలో భక్తులు పవిత్ర గుహ వద్ద శివలింగాన్ని దర్శించుకుంటారు. ఈ యాత్ర అధికారికంగా జూలై 3న ప్రారంభమై, 2025 ఆగస్టు 9న తేదీన ముగియనుంది. అమర్నాథ్ యాత్రలో మొదటి బ్యాచ్ పహల్గాం, బాల్తాల్ రెండు ప్రాంతాల నుంచి సాగుతుంది. ఈ ఏడాది సుమారు 5 లక్షలకు పైగా యాత్రికులు పాల్గొంటారని అధికారులు భావిస్తున్నారు.
కాబట్టి అధికారులు యాత్రికుల సౌకర్యార్థం వారు వెళ్లే మార్గాల్లో వైద్య సౌకర్యాలు, ఆహారం, వసతితోపాటు వారి భద్రతా దృష్ట్యా సీసీటీవీ, డ్రోన్ నిఘాతో పాటు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో స్థానిక బలగాలతో పాటు కేంద్ర మిలిటరీ దళాలను మోహరించారు. పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాద దాడి తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా పహల్గాంతోపాటు బల్తాల్ మార్గాలను నో-ఫ్లై జోన్గా ప్రకటించారు. జమ్ము నుంచి బాల్తాల్, పహల్గాంలోని బేస్ క్యాంపులకు యాత్రికుల కోసం ప్రభుత్వం ఉచిత బస్సు సర్వీస్లోతోపాటు ఇతర లాజిస్టికల్ ఏర్పాట్లు చేశారు.
అమర్నాథ్ యాత్రకు వెళ్లాలంటే రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఒకటి బాల్టాల్ రూట్. మరొకటి పహల్గామ్ మార్గం. ఈ రెండు రూట్లకు బేస్ క్యాంపులు జమ్మూ కాశ్మీర్లో ఉంటాయి. యాత్రికులు సాధారణంగా జమ్మూ నుంచి బయల్దేరి ఈ బేస్ క్యాంప్ లకు చేరుకుంటారు. అసలు సవాల్ ఏంటంటే.. మొన్నటికి మొన్న పహల్గాం బైసరన్ గ్రౌండ్ లో టెర్రర్ ఎటాక్ జరిగింది.
ఇప్పుడు వేలాది మంది భక్తులు ఈ పహల్గామ్ బేస్ క్యాంప్ ను దాటుకునే వెళ్లారు. ఉగ్రమూకలు ఎక్కడ పొంచి ఉంటాయో తెలియదు. పైగా పీఓకేలో కొత్త టెర్రర్ క్యాంపులు పుట్టుకొస్తున్నట్లు రిపోర్టులు బయటికొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో యాత్రికులకు సెక్యూరిటీ కల్పించడం భద్రతా దళాలకు పెను సవాల్ గా మారింది. అందుకే ఈసారి అమర్ నాథ్ యాత్ర చుట్టూ పెద్ద చర్చే నడుస్తోంది.
పహల్గామ్ బేస్ క్యాంప్ కు యాత్రికులు వచ్చాక అక్కడి నుంచి అమర్నాథ్ గుహకు 36 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఈ మార్గం ఎక్కువ దూరం ఉంటుంది. అయితే ఈజీగా వెళ్లొచ్చు. ఈ రూట్ లో యాత్రికులు చందన్వారీ నుంచి శేష్నాగ్, పంచతరణి వంటి స్టాప్ల మీదుగా గుహకు చేరుకుంటారు. ఈ ట్రెక్కు సాధారణంగా 2 నుంచి 3 రోజులు పడుతుంది.
అదే బాల్టాల్ బేస్ క్యాంప్ శ్రీనగర్ కు నార్ లో సోన్ మార్గ్ సమీపంలో ఉంటుంది. అక్కడి నుంచి అమర్నాథ్ గుహకు 14 కిలోమీటర్లే ఉంటుంది. అయితే ఈ రూట్ కొంచెం కష్టమైంది. కొండ ఎక్కడం టఫ్ గా ఉంటుంది. ట్రెక్కింగ్ కు ఒక రోజు టైం పడుతుంది. సో యాత్రికులు ఈ రెండు బేస్ క్యాంపుల్లో ఏదో ఒక క్యాంప్ నుంచి వెళ్తుంటారు.
మరోవైపు… పహల్గాంలో టెర్రర్ ఎటాక్ తర్వాత కశ్మీర్ అంటేనే టూరిస్టులు భయపడుతున్నారు. ఎందుకొచ్చిన రిస్క్ అనుకుంటున్నారు. భద్రత పెంచాక చూద్దాంలే అని టూర్లు వాయిదాలు వేసుకున్నారు. సమ్మర్ టూరిజం చాలా వరకు లాస్ అయింది జమ్మూకశ్మీర్. అటు చూస్తే పహల్గామ్ అటాక్ కు పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులు ఇంకా పరారీలోనే ఉన్నారు. వీరెక్కడున్నారో ఎవరికీ తెలియదు. అండర్ గ్రౌండ్ లో ఉన్న వీరు.. అమర్ నాథ్ యాత్రను టార్గెట్ చేసుకుంటారా అన్న అనుమానాలున్నాయి. అందుకే భద్రతా దళాలు పూర్తి అలర్ట్ అయ్యాయి. యాత్రికులు వేసే ప్రతి అడుగు నిఘా నీడలోనే ఉండబోతోంది.
అయితే… పహల్గాం దాడికి ముందు అమర్ నాథ్ యాత్ర కోసం రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య 2 లక్షల 35 వేలు. ఏప్రిల్ 22న ఎప్పుడైతే దాడి జరిగిందో.. ఆ తర్వాత కేవలం 85 వేల మంది మాత్రమే యాత్రకు వస్తున్నామని కన్ఫామ్ చేసుకున్నారు. ఉగ్రవాద దాడితో ఒక్కసారిగా సంఖ్య తగ్గిపోయింది. రిస్క్ ఎందుకని చాలా మంది ముందుకు రాలేకపోయారు. ఈసారి అమర్నాథ్ యాత్ర టైం కూడా తగ్గించారు. గతేడాది వరకు ఈ యాత్ర 2 నెలలు సాగేది. కానీ ఈసారి 38 రోజులకు కుదించారు. పహల్గాం అటాక్ ఎఫెక్ట్ మెయిన్ రీజన్. సో నష్టం జరిగింది.
అదే సమయంలో అమర్ నాథ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కనివినీ ఊహించని విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మాక్ డ్రిల్స్ కంప్లీట్ చేశాయి భద్రతా దళాలు. జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవేపై సమ్రోలి, టోల్డి నల్లా వద్ద సైన్యం, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, జేకేఎస్డీఆర్ఎఫ్ కలిసి కొండచరియలు విరిగిపడే సందర్భాల్లో ఏం చేయాలో అలర్ట్ గా ఉండేలా మాక్ డ్రిల్స్ నిర్వహించాయి. ఈ డ్రిల్స్లో గాయపడిన వారిని రక్షించడం, వైద్య సహాయం అందించడం, హాస్పిటల్ తరలించడం వంటివి ప్రాక్టీస్ చేశారు.
ఇక సెక్యూరిటీ విషయంలో డ్రోన్లు, హైటెక్ సర్వైలెన్స్ ఉండబోతోంది. యాత్ర రూట్లలో డ్రోన్లు, HD సీసీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్, జీపీఎస్ ట్రాకింగ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ను వాడుతున్నారు. ఉధంపూర్ వంటి సెన్సిటివ్ ఏరియాల్లో కె-9 డాగ్ స్క్వాడ్లతో పెట్రోలింగ్ను పెంచారు. యాత్రికుల భద్రత కోసం ఈ-ఐడీలు ప్రవేశపెట్టారు. RFID ట్యాగ్ లతో ఉంటాయి. అంటే చిన్న చిప్ లతో కూడి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ ఇస్తారన్న మాట. దీంతో వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. యాత్రికుల ట్రాకింగ్ ను క్షణక్షణం అబ్జర్వ్ చేస్తారన్న మాట.
వీటికి తోడు ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఐటీబీపీ, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ వంటి కేంద్ర సాయుధ బలగాలతో పాటు 581 కంపెనీలు భద్రత కోసం మోహరిస్తున్నారు. జమ్మూ పఠాన్కోట్ హైవేపై బీఎస్ఎఫ్ గస్తీని పెంచింది. అటు జమ్మూలో పలు చెక్పోస్ట్లను ఏర్పాటు చేసి, రోజూ తనిఖీలు చేస్తున్నారు. యాత్రికులను కాన్వాయ్లలో సేఫ్ గా వెళ్లాలంటున్నారు. వాతావరణం బాగా లేకపోతే యాత్రికుల కోసం వాటర్ప్రూఫ్ వెయిటింగ్ రూమ్లను ఏర్పాటు చేశారు.
13 ఏళ్లలోపు పిల్లలు, 70 ఏళ్లు పైబడిన వృద్ధులను అనుమతించట్లేదు. మరోవైపు శ్రీనగర్ లో చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్ దాల్ లేక్. ఇక్కడ టూరిస్టులు చాలా మంది వస్తుంటారు. ఇక్కడ కూడా సెక్యూరిటీ టైట్ చేశారు. సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో స్పెషల్ గా ఆపరేషన్ దాల్ ను ప్రారంభించారు. ఇందులో సీఆర్పీఎఫ్ స్పెషల్ వాటర్ వింగ్ పర్యాటకుల సేఫ్టీ పర్యవేక్షిస్తుంది. నీటి అడుగున కూడా స్కానింగ్ చేయడం, చుట్టూ సెక్యూరిటీ పెంచడం ఈ ఆపరేషన్ లో భాగం.
వీరికి తోడు క్విక్ యాక్షన్ టీమ్ కమాండోలను రంగంలోకి దింపుతున్నారు. ఈ QAT టీమ్ లు CRPFకు చెందిన ప్రత్యేక బృందం. ఈ కమాండోలు ఉగ్రవాద దాడులు, హై రిస్క్ ఆపరేషన్లు, అత్యవసర పరిస్థితులను ఫేస్ చేయడానికి ఏర్పాటైంది. ఈ QAT టీమ్స్ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో గెరిల్లా ఆపరేషన్ లను ఎదుర్కోవడానికి స్పెషల్ గ్ ట్రైనప్ అయ్యారు. సో అమర్ నాథ్ యాత్రికుల భద్రతను కేంద్రం ఎంత ప్రయారిటీ తీసుకుందో ఈ చర్యలు చూస్తే అర్థమవుతుంది.
ఇంకోవైపు పీఓకేలో ఉగ్రవాద శిబిరాలు మళ్లీ పుట్టుకొస్తున్నట్లు రిపోర్ట్ లు వస్తున్నాయి. మే 7న భారత ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో పాకిస్థాన్ అలాగే పీఓకేలోని 9 టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేశారు. ఈ దాడులు ఏప్రిల్ 22 పహల్గాం అటాక్ కు ప్రతీకారంగా జరిగాయి. జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థలకు చెందిన శిబిరాలను టార్గెట్ చేశారు. ఆ టెర్రర్ క్యాంప్స్ ధ్వంసమైనప్పటికీ పాకిస్థాన్ ఇప్పుడు కొత్త ఉగ్రవాద శిబిరాలను, లాంచ్ ప్యాడ్లను పీఓకేలో యాక్టివేట్ చేసినట్లు గుర్తించారు. మళ్లీ అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు మొదలైనట్లు అనుమానిస్తున్నారు. అక్కడ IED తయారు చేయడం, ఆయుధాల శిక్షణ లాంటివి నేర్పుతున్నారు.
పాకిస్థాన్ సైన్యం, ISI ఈ టెర్రర్ క్యాంప్స్ ను రీబిల్డ్ చేయడంలో కీలకంగా ఉన్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. పాకిస్థాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తోందని, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోకి చొరబడేందుకు లాంచ్ ప్యాడ్లను రెడీ చేస్తున్నట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ క్యాంపులు LoC సమీపంలో ఉన్నాయి.
రాజౌరి, పూంచ్, సాంబా కతువా సెక్టార్లలో ఉగ్రవాదుల చొరబాటుకు ఛాన్స్ ఉందంటున్నాయి. అయితే చొరబాట్లను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. జమ్మూ నుంచి అమర్ నాథ్ కు బయల్దేరే యాత్రికులు ఒంటరిగా వెళ్లకుండా, భద్రతా కాన్వాయ్ల సపోర్ట్ తో మాత్రమే వెళ్లాలని సూచిస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు భద్రతా దళాలు జారీ చేసే సూచనలు పాటించాలని కోరుతున్నారు.
అసలు విషయం ఏంటంటే.. పహల్గాంలో అటాక్ కు పాల్పడిన చెందిన ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు ఇంకా పరారీలో ఉన్నారు. వారి జాడ దొరకలేదు. వారు ఎక్కడ నక్కి ఉన్నారో తెలియడం లేదు. అలాగే… అమర్నాథ్ యాత్రపై దాడి చేసే బాధ్యతను రఫీక్ నాయ్ ,మహ్మద్ అమీన్ బట్ అలియాస్ అబూ ఖుబైబ్లకు అప్పగించబడినట్లు తెలుస్తోంది. వీరు స్థానికులు కావడంతో వీరికి చొరబాటు మార్గాలన్నీ తెలుసు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. రాజౌరీ – ఫూంచ్, పిర్ పంజాల్, చీనాబ్ వ్యాలీ తదితర ప్రాంతాల్లో ఉగ్రదాడికి అవకాశముందని అనుమానిస్తున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. దాడులకు పాల్పడుతారని భావిస్తున్న ఇద్దరు యువకుల గురించి గాలిస్తున్నారు. వారి ఇళ్లు, కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా దళాలైతే కూంబింగ్ పెంచాయి. మరోవైపు ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అంటున్నారు.