నేటితో ముగియనున్న మేడారం మహాజాతర

మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. చివరిరోజు కావడంతో మేడారం భక్తులతో జనసంద్రంగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. గద్దెలపై ఇద్దరు తల్లులు కొలువుదీరండతో భక్తులు దర్శనం కోసం క్యూ కడుతున్నారు. ఇక ఈ రోజే మేడారంలో అత్యంత కీలకమైన ముగింపు ఘట్టం జరగనుంది. వనం నుండి జనంలోకి వచ్చి వన దేవతలు తిరిగి వెళ్లనున్నారు. గురువారం గద్దెలపై కొలువైన అమ్మవార్లు భక్తుల పూజల అనంతరం నేడు చిలకలగుట్టలో వనప్రవేశం చేస్తారు. సాయత్రం ఆరు గంటల ప్రాంతంలో ముగింపు కార్యక్రమం జరుగుంది.
ఈ నేపథ్యంలో రద్దీ పెరగటంతో భక్తులు ఇబ్బందిపడుతున్నారు. మేడారం నుండి తాడ్వాయి వరకు 14 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 12 గంటల నుండి భక్తులు వేచి చూస్తున్నారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. భక్తుల తరలింపులో ఆర్టీసీ విఫలమైందని కొంతమంది భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాదిమంది భక్తులతో ఆర్టీసీ బస్ స్టాండ్ కిక్కిరిసిపోయింది. గంటల తరబడి ఎదురుచూసినా బస్సులు అందుబాటులో లేవని భక్తులు చెబుతున్నారు. అధికారులు సైతం అందుబాటులో లేకపోగా పోలీసులు, అధికారులకు సమన్వయ లోపం కారణంగా ఇబ్బందులు నెలకొంటున్నాయని చెబుతున్నారు.



