IIM Calcutta: కోల్కతా బాయ్స్ హాస్టల్లో విద్యార్థినిపై రేప్

IIM Calcutta: రాక్షసులు ఎలా ఉంటారో తెలుసా..? ఎందుకు తెలీదూ.. కోర పళ్లు పెట్టుకుని.. పేద్ద జులపాలు తగిలించుకొని అత్యంత క్రూరంగా కనిపిస్తుంటారు… వారే కదా. అయితే.. అది పురాణాల్లో కనిపించే.. మనం చదివిన రాక్షసులు. కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో రాక్షసులు ఎలా ఉంటారో తెలుస్తా.. అమ్మాయిలను వేధించడం, ఏడిపించడం వారికి ఎర వేసి.. వారిని మత్తులో ముంచుతూ.. శారీరక సుఖాలకు వినియోగించుకోవడం చేస్తుంటారు.
ఈ మధ్య కాలంలో ఓ మహిళ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలకు నిదర్శనాలు ఇవే. ఇంతకీ పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది..? మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా మమతా ఎందుకు సీరియస్ యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు..? మహిళలపై దారుణాల్లోనూ దీదీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారా?
ఆడా-మగా మధ్య అనురాగంతో, సామాజిక ఆమోదంతో జరగాల్సిన ప్రక్రియ కాస్తా.. మానభంగాల పేరిట.. మానవ సమాజానికే తలవంపులు తెస్తోంది. రోజుకు ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయో.. ఎంతమంది మహిళల వ్యక్తిగత మర్యాదలు గాల్లో కలిసిపోతున్నాయో తల్చుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. ఇందులో నాలుగైదేళ్ల పసిపాపల నుంచి మహిళల వరకు ఉండడం మానవత్వానికే మచ్చలాగా మారుతోంది. పవిత్రమైన పిలుపును కూడా కొందరు రాక్షసులు కలుషితం చేసి వావి వరుసలు లేని దుష్ట సంప్రదాయానికి తెర తీస్తున్నారంటే ఈ లోకం ఎటు పోతోందన్న అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు సామాజికవేత్తలు. తాజాగా అలాంటి ఘటనలే పశ్చిమబెంగాల్ నిత్యం జరుగుతుండడం కలకలం రేపుతోంది.
ఇండియాలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన కోల్కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు యువతిపై అత్యాచారం చేశాడు. ఐఐఎమ్ బాయ్స్ హాస్టల్లో ఈ దారుణానికి ఒడిగట్టాడు.
బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో దారుణం వెలుగులోకి వచ్చింది. బాధిత యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు ఓ యువతి కోల్కతా ఐఐఎమ్లో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. యువతికి సెకండ్ ఇయర్ చదివే యువకుడితో సోషల్ మీడియా ద్వారా పరిచయం అయింది. ఇద్దరూ తరచుగా చాటింగ్, ఫోన్లు చేసుకునేవారు.
అయితే.. గత కొంత కాలంనుంచి ఆ యువతికి తోటి విద్యార్థినితో గొడవలు జరుగుతున్నాయి. యువతి సెకండ్ ఇయర్ యువకుడికి ఫోన్ చేసింది. విషయం చెప్పి ఏం చేయాలో సలహా అడిగింది. ఈ విషయం గురించి చర్చిద్దాం.. మా హాస్టల్కు వచ్చేయ్ అని అన్నాడు. అమె అతడ్ని గుడ్డిగా నమ్మింది. మరో స్నేహితురాలిని వెంట బెట్టుకుని అక్కడికి వెళ్లింది. ఒంటరిగా మాట్లాడదాం అని చెప్పి ఆ యువకుడు ఆమెను తన గదిలోకి తీసుకెళ్లాడు. లోపలికి వెళ్లిన తర్వాత తినడానికి తిండి, తాగడానికి కూల్ డ్రింక్స్ ఇచ్చాడు. అతడు పెట్టిన ఆహారం తినగానే ఆమె స్ప్రహ కోల్పోయింది. తర్వాత అతడు ఆమెపై అత్యాచారం చేశాడు.
ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. యువతి అతడి బెదిరింపులకు భయపడలేదు. అక్కడినుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదే రోజు రాత్రి ఐఐఎమ్ హాస్టల్లో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారిస్తున్నారు.
బాధిత యువతికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరవైందంటూ తృణమూల్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.
కాగా, 2024 ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీకార్ ఆసుపత్రిలో సెమినార్ రూమ్లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కాగా ఆర్జీకార్ దవాఖాన డాక్టర్లు, వైద్య విద్యార్థులు సుదీర్ఘకాలం ఆందోళనలు నిర్వహించారు.
ఘటన అనంతరం ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సంజయ్ను ఆగస్టు 10న కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోల్కతాలోని సీల్దా కోర్టు సంజయ్ రాయ్ని దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు దోషికి జీవితఖైదు విధించింది.
ఈ ఘటన మరవకముందే గత నెల చివర్లో ఓ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. కస్బా పరిసరాల్లో కాలేజ్ క్యాంపస్ లోనే విద్యార్థినిపై కొందరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినందుకు ఆగ్రహానికి గురైన మనోజిత్ తనను బలవంతంగా సెక్యూరిటీ గార్డు గదిలోకి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
వదలేయమని కాళ్లు పట్టుకున్న కనికరించలేదు బయటకు విషయం చెబితే తీసిన వీడియో లీక్ చేస్తామని హెచ్చరించారు. కోల్కతాలోని ఒక లా కాలేజీ లోపల ఒక విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చిన దాదాపు పక్షం రోజుల తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడంతో కోల్కతా అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఇలా వరుస ఘటనలతో రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.