జమ్ముకార్మీర్లో కొనసాగుతున్న ఆపరేషన్ ఛత్రు

Operation Chhatru: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్తాన్ గడగడలాడింది. వైమానిక స్థావరాలు ధ్వంసమైపోయాయి. ఉగ్ర శిబిరాలు నామరూపాల్లేకుండా పోయాయి. టాప్ టెర్రరిస్టులూ హతమయ్యారు. ఇంత విధ్వంసం జరిగిన తర్వాత మరే దేశం మళ్లీ ఉగ్రకుట్రలు చేయదు. కానీ పాకిస్తాన్ అలా కాదు.. దాని బుద్ధీ అసలు మారదు. పీవోకే కేంద్రంగా మరోసారి అదే చేస్తుంది. మళ్లీ ఉగ్రశిబిరాలను తిరిగి నిర్మిస్తుంది. ఉగ్రవాదులను కాశ్మీర్లోకి దించుతోంది. పాక్ అక్రమిత కశ్మీర్లో గత కొన్ని నెలలుగా ఉగ్ర శిక్ష ఇస్తోంది. ఈ పరిణామాలు మరోసారి సరిహద్దుల్లో టెర్రర్ పుట్టిస్తున్నాయి. ఇంతకూ, పీవోకే కేరాఫ్గా అసలేం జరుగుతోంది..? పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో మోదీ ఛత్రు ఎం చేయబోతుంది.. ?
ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో జమ్ము కశ్మీర్లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదుల మారణ హోమం భారత ప్రజల కళ్లముందు నుంచి ఇంకా కరిగిపోలేదు. పహల్గాంలో పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడితో దేశం ఉలిక్కిపడింది. 26 మందిని ముష్కరులు పొట్టన పెట్టుకున్నారు. దీనిపై విచారణ జరిపిన భారత్ పాకిస్తాన్ హస్తం ఉన్నట్లు గుర్తించింది. దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రస్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసింది. వంద మందికిపైగా ఉగ్రవాదులను చంపేసింది. పాకిస్థాన్ లోని ఉగ్ర స్తావరాలు, ఉగ్రవాదులు లక్ష్యంగా జరిపిన దాడి నుంచి ఇంకా పాక్ కోలుకోనుకూడా లేదు.
అయినా కుక్కతోక ఎప్పుడూ వంకరే అన్న చందంగా పాకిస్తాన్ తీరుకూడా మారడం లేదు. పైగా తాము విజయం దక్కించుకున్నామని చెబుతున్న తీరు ప్రపంచదేశాలను కూడా నివ్వెర పోయేలా చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అనూహ్యంగా మరోసారి అదే కుట్రకు పాక్ పాల్పడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మళ్లీ ఉగ్రనాగులను దింపుతోంది. దట్టమైన అడవుల్లో ఉగ్ర శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న భారత్ సైనికులు ఉగ్రవాదులే లక్ష్యంగా బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆపరేషన్ ఛత్రు చేపట్టి పుట్టలో దాగి ఉన్న ఉగ్రనాగులను పరుగులు పెట్టిస్తున్నారు. దొరికిన వారిని దొరికినట్లు ఏరిపారేస్తున్నారు. దీంతో సైనికులు, ఉగ్రవాదులకు మధ్య భారీగా కాల్పులు జరుగుతున్నాయి. దీంతో మళ్లీ బోర్డర్లో టెన్షన్ వాతావరణ మొదలైంది.
జమ్మూకాశ్మీర్లో భద్రతా బలగాలకు, టెర్రరిస్టులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఆగటం లేదు. జమ్మూకాశ్మీర్లో శాంతిభద్రతలకు విఘాతం కల్పించడానికి, దేశంలో హింసకు, చొరబాట్లకు ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో, భద్రతా బలగాలు నిఘాను పెంచాయి. వాస్తవాధీన రేఖ వెంబడి పహారా ముమ్మరం చేసి, అనుమానిత ప్రాంతాల్లో నిత్యం తనిఖీలు చేస్తూ ఉగ్రవాదుల ఏరివేత చేపట్టారు. తాజాగా.. కిష్తివాడ్లోని ఛత్రు ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు కొన్ని నెలలుగా నక్కి ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం అందుకున్న వెంటనే భారత సైన్యంలోని వైట్ నైట్ కార్ప్స్, కశ్మీర్ పోలీసుల సంయుక్త బృందాలు సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించారు.
ఉగ్రవాదులను గుర్తించిన భద్రతా దళాలు వారిని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇంకా అక్కడ ఆపరేషన్ ఛత్రు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సమయంలోనే వారు దొంగచాటుగా జమ్ము కశ్మీర్లోకి ప్రవేశించారని అక్కడే నక్కారని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ముగ్గురు ఉన్నారని భావిస్తున్నా వీరి సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుందన్న అంచనా ఉంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. వారిని సాధ్యమైనంత వరకు సజీవంగా పట్టుకునేలా ప్రయత్నిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
అంతేకాదు.. జమ్ము కాశ్మీర్ షోపియాన్ జిల్లాలోని ముంజ్ మార్గం ప్రాంతంలో ఎన్కౌంటర్లో ముగ్గురు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో వారికి తారసపడిన ముగ్గురు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎన్కౌంటర్ చోటుచేసుకోగా ముగ్గురు మృతి చెందారు.
మహిళలు, పిల్లలు, నిరాయుధులైన పోలీసులు, వలస కార్మికులతో సహా అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దారుణాలకు పాల్పడుతున్న వారిని మట్టు పెడుతున్న భద్రతా బలగాలు ఈ క్రమంలోనే ముగ్గురు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులను హతమార్చారు. కాశ్మీర్ లోయలో శాంతిని నెలకొల్పడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను ఉగ్రవాదులు అడ్డుకోలేరని కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ అన్నారు. కాశ్మీర్లోని 3 ప్రాంతాలలో ప్రత్యేకంగా పాకిస్థాన్ ప్రేరేపిత ఇతర దేశాల ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మా కౌంటర్ టెర్రరిజం కార్యకలాపాలు ఏకకాలంలో కొనసాగుతాయని వెల్లడించారు.
ఇక షోపియాన్ జిల్లాలో ఎన్కౌంటర్లో మృతి చెందిన మృతులలో ఇద్దరిని అధికారులు గుర్తించారు. ఉగ్రవాదులలో ఒకడిని షోపియాన్ కు చెందిన లతీఫ్ లోనేగా గుర్తించగా, మరొకటి అనంత నాగ్ కు చెందిన ఉమర్ నజీర్ గా గుర్తించారు. లతీఫ్ లోనే కు కాశ్మీరీ పండిట్ పురానా కృష్ణ భట్ హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లుగా తెలిపారు. ఇక ఉమర్ నజీర్ కు నేపాల్ కు చెందిన తిల్ బహదూర్ ధాపా హత్య కేసు నిందితుడని జమ్మూకాశ్మీర్ పోలీసులు ప్రకటించారు.
నిందితుల వద్ద నుండి ఏకే 47 తుపాకీ తో పాటు రెండు పిస్టల్ లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. పరిణామాలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఎలాంటి పరిస్థితి నైనా తట్టుకుంటామని ప్రకటించాయి. ఒక్కరి ప్రాణానికి కూడా ముప్పు వాటిల్లకుండా బలగాలు క్షేత్రస్థాయిలో మోహరించాయని చెప్పాయి. మరోవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ సింగ్ కూడా ఈ పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
కాగా ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గామ్లో 26 మంది పర్యాటకుల ప్రాణాలు పోయిన ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య మొదలైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన భారత సైన్యం మే 7న పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి ప్రవేశించి ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. దీనిని జీర్ణించుకోలేని పాకిస్థాన్ భారత్ సరిహద్దు నగరాలు, పౌర నివాసాలే లక్ష్యంగా దాడులకు యత్నించింది.
నాలుగు రోజులు ఇరు సైన్యాల మధ్య కొనసాగిన ఘర్షణలు మే 10న కాల్పుల విరమణ ఒప్పందంతో తగ్గుముఖం పట్టాయి. ఇదిలా ఉండగా సరిహద్దుల్లో మరోసారి ఉగ్రమూకలను కశ్మీర్లోకి ఎగదోసేందుకు పాకిస్థాన్ కుట్రలు చేస్తున్నట్టు సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదాన్ని తన విధానంగా మార్చుకున్న పాకిస్థాన్ బుద్ది మారదనడానికి ఇదో ఉదాహరణ. భారత్ ఎన్ని హెచ్చరికలు చేసినా పాక్ వైఖరి మార్చుకోనంటోంది.
లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు భారత సరిహద్దుకు సమీపంలో చొరబాటుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పహల్గామ్ దాడి కూడా లష్కరే, రెసిడెంట్ ఫ్రంట్ హస్తం ఉంది. పాకిస్థాన్ సైన్యం, లష్కరే తొయిబా ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వద్ద చేరినట్టు తెలుస్తోంది. అలాగే పాక్ సైనికాధికారులతో లష్కరే తొయిబా కమాండర్లు పాక్-ఆధిపత్య కశ్మీర్లో సమావేశమయ్యారని, ఆ తరువాత వారు నియంత్రణ రేఖ వద్దకు వెళ్లారని సమాచారం.
పాకిస్థాన్ ఆర్మీ సరిహద్దుల్లో భూగర్భ సొరంగాలను ద్వారా భారత్లోకి లష్కర్ తొయిబా ఉగ్రవాదులను పంపే ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్థాన్ సొరంగాలను ఉపయోగించుకుని అడవుల్లో, గిరిజన ప్రాంతాల్లో దాడులకు ఉగ్రవాదులు ప్రయత్నించినట్టు గతంలో నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఏప్రిల్లో ఓ జాతీయ మీడియా నివేదిక కూడా భూగర్భ సొరంగాలను చొరబాటుకు ఉపయోగించేుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పీవోకేలో మరోసారి ఉగ్రవాదులు రావడంతో బీఎస్ఎఫ్, భారత సైన్యం తమ నిఘాను పెంచాయి.
పాకిస్థాన్లోని ఉగ్రమూకలు భారతదేశంలో తరుచూ దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఘటన ఆందోళనకు గురిచేస్తోంది. ఆపరేషన్ సిందూర్తో జైషఏ మహమ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థల శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో పాకిస్థాన్ ఉగ్రమూకలను ప్రేరేపించి భారత్పై దాడులకు కుట్రలు చేస్తోన్నట్టు తెలుస్తోంది.



