జాతియం

మహా కుంభమేళాలో తొక్కిసలాట.. 20 మంది మృతి.. 60మందికిపైగా తీవ్ర గాయాలు

Maha Kumbh Mela: మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఘటనలో 20 మంది మృతి చెందినట్లు సమాచారం. దాదాపు 60 మందికిపైగా గాయపడ్డారు. ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం సెక్టార్-2 ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది.

మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. ఇక మౌని అమావాస్యను పురస్కరించుకుని పుణ్యస్నానాలు ఆచరించేందుకు రాత్రి నుంచే ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మరోవైపు తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అఖాడా పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అమృత స్నానాల కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు అఖాడా పరిషత్ కమిటీ ప్రకటించింది.

ఇక కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్‌ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఘటనపై ఆరా తీశారు. మరోవైపు.. సీఎం యోగి భక్తులకు విజ్ఞప్తి చేశారు. త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్దకు రాకుండా సమీపంలోని ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించాలని సూచించారు.

ఆదేశాలు, సూచనలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని భక్తులను కోరారు. ఎలాంటి వదంతులను నమ్మొద్దు అని యూపీ సీఎంఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. కుంభమేళాకు భక్తులు పోటెత్తడంతో అటుగా వెళ్లే జాతీయ రహదారిపై భారీ రద్దీ నెలకొంది. దాదాపు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button