Sonia Gandhi: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలపై భారత్ మౌనం తగదు

Sonia Gandhi: ఇవాళ ప్రపంచ యుద్ధ భిన్నరూపాల్లో కనిపిస్తోంది. ఒకవైపు క్షిపణుల దాడులు, మరోవైపు సైబర్ దాడులు, రాజకీయ మౌనాలు, మానవతా సంక్షోభాలు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ శాంతికి ప్రమాదకర సంకేతాలివ్వగా, భారత్ మౌనం చర్చనీయాంశమైంది.
ఇలాంటి సమయంలో, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ భారత ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇది కేవలం మాట్లాడకపోవడం కాదు, భారత దేశ దౌత్య, నైతిక విలువలు సంక్షోభంలో కూరుకుపోయాయన్నారు. ది హిందూ పత్రికలో ఆమె రాసిన వ్యాసం, ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలపై భారత రాజ్యాంగ బద్ధమైన బాధ్యతను, చారిత్రక నిబద్ధతను గుర్తు చేస్తూ, ఇండియా స్పందించాలని కోరారు.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధంపై ఇండియా మౌనం వహించడం దౌత్యపరమైన వైఫల్యమన్నారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. భారతదేశం నైతిక, వ్యూహాత్మక సంప్రదాయాల నుండి తనను తాను తప్పుకుంటుందా అని ఆమె ప్రశ్నించారు. ది హిందూ పత్రికకు రాసిన వ్యాసంలో సోనియా గాంధీ, జూన్ 13న ఇరాన్ భూభాగంపై ఇజ్రాయెల్ దాడిని చట్టవిరుద్ధం, సార్వభౌమాధికార ఉల్లంఘనగా మండిపడ్డారు. డ్రోన్లు, క్షిపణుల దాడులతో పశ్చిమాసియా ఆగమాగమవుతోందన్నారు.
బాంబు దాడులను, హత్యలను కాంగ్రెస్ ఖండించింది. ఇది ప్రపంచాన్ని ప్రమాదంలో పడేస్తోందని సోనియా చెప్పారు. గాజాలో క్రూరమైన చర్యలతో ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది కాకా, ఇప్పుడు ఇరాన్ను ధ్వంసం చేస్తారా అంటూ ఆమె మండిపడ్డారు. ఇరాన్ ఆస్తులు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ దాడి హేయమన్నారు.
2025లో ఇప్పటికే ఐదు రౌండ్ల అణు చర్చలు జరిగిన ఫలితం లభించలేదు. అమెరికా-ఇరాన్ మధ్య జూన్ చివరిలో ఆరో రౌండ్ జరగాలని భావిస్తున్నారు. 1995లో ప్రధాన మంత్రి యిట్జాక్ రాబిన్ హత్యతో ముగిసిన ద్వేష జ్వాలలను రేకెత్తించడానికి నెతన్యాహు ప్రయత్నిస్తున్నారా అంటూ కాంగ్రెస్ ఆక్షేపించింది. ఇజ్రాయెల్ – పాలస్తీనియన్ల మధ్య అత్యంత ఆశాజనకమైన శాంతి ధ్వంసమైందని సోనియా పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కూడా విమర్శలు గుప్పించారు. గతంలో ట్రంప్ యుద్ధాలు, సైనిక చర్యలను వద్దనేవారని ఇప్పుడు ఇజ్రాయెల్ను ఎలా అనుమతిస్తారని ఆమె ప్రశ్నించారు. 2003లో ఇరాక్ వద్ద సామూహిక విధ్వంసక ఆయుధాలు ఉన్నాయని ఆరోపించి ప్రపంచాన్ని అమెరికా చీట్ చేసిందన్న వర్షన్ ను ఆమె ఆర్టికల్లో రాశారు.
భారతదేశానికి ఇరాన్- ఇజ్రాయెల్ రెండింటితో దీర్ఘకాలిక సంబంధాలున్నాయి. భారతదేశం ఇటీవలి దశాబ్దాలలో ఇజ్రాయెల్తో రక్షణ, వాణిజ్యం, నిఘా సహకారాన్ని విస్తరించినప్పటికీ, ఇరాన్తో లోతైన చారిత్రక, నాగరిక వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తోంది. ఇరాన్ భారతదేశానికి దీర్ఘకాల మిత్రదేశం. లోతైన నాగరిక సంబంధాలతో మనకు కట్టుబడి ఉంది.
జమ్మూ, కాశ్మీర్తో సహా కీలక సమయాల్లో మద్దతు ఇచ్చింది. 1994లో, కాశ్మీర్ సమస్యపై UN కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్లో భారతదేశాన్ని విమర్శించే తీర్మానాన్ని నిరోధించడంలో ఇరాన్ సహాయపడింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, గతంలోని ఇంపీరియల్ స్టేట్ ఆఫ్ ఇరాన్తో పోల్చుకున్నప్పుడు మంచి సంబంధాలు కొనసాగిస్తోంది.
1965 – 1971 యుద్ధాలలో పాకిస్తాన్ వైపు మొగ్గు చూపినా, భారతదేశ ఆర్థిక ప్రయోజనాలకు బాసటగా నిలిచిందన్నారు సోనియా గాంధీ. 2018లో అమెరికా ఏకపక్షంగా ఉపసంహరించుకున్న తర్వాత 2015 జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కుప్పకూలడం, సంవత్సరాల తరబడి కొనసాగిన ఇండియా-ఇరాన్ దౌత్యాన్ని దెబ్బతీసిందని ఆమె గుర్తు చేశారు.
ఆ నిర్ణయం భారతదేశ ఆర్థిక ప్రయోజనాలను, ముఖ్యంగా చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ చుట్టూ తీవ్రంగా ప్రభావితం చేసిందని సోనియా గుర్తు చేశారు. ఇజ్రాయెల్ సైనిక చర్య కారణంగా 55 వేల మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కుటుంబాలకు కుటుంబాలు తుడిచిపెట్టుకుపోయాయి. గాజా కరువు అంచున ఉంది. ప్రజలు లెక్కలేనన్ని కష్టాలు అనుభవిస్తున్నారని ఆమె రాశారు.
ఇప్పుడు ఇండియా స్పందించే తీరు ఆధారంగా మనకు అంతర్జాతీయంగా గుర్తుంపు లభిస్తోందని సోనియా చెప్పారు. భారత్ దౌత్య పాత్రను పునర్నిర్విచించాలని సూచించారు. భారత ప్రభుత్వానికి సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు. స్పష్టంగా మాట్లాడటం, బాధ్యతాయుతంగా వ్యవహరించడం కారణంగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, చర్చలు మాత్రమే శరణ్యమని ఆమె కేంద్రానికి స్పష్టం చేశారు.
మానవతా విపత్తును ఎదుర్కొంటున్నప్పుడు, నరేంద్ర మోడీ ప్రభుత్వం శాంతియుత రెండు-రాష్ట్రాల పరిష్కారానికి భారతదేశం దీర్ఘకాలిక ప్రయోజనాల పరిరక్షణకు పాటుపడాలన్నారు. ఇజ్రాయెల్తో పక్కపక్కనే నివసించే సార్వభౌమ, స్వతంత్ర పాలస్తీనా ఉండాలన్నారు.
గాజాలో జరిగిన విధ్వంసం, ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్న విధ్వంసంపై ఇండియా మౌనం దాల్చడంమన నైతిక, దౌత్య సంప్రదాయాలను కలవరపెడుతున్నాయన్నారు సోనియా గాంధీ. ఇండియా కేవలం మాట్లాడకపోవడం కాదని, విలువల లొంగుబాటును సూచిస్తోందన్నారు. ఇండియా ఇప్పటికైనా స్పష్టంగా మాట్లాడాలన్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, చర్చలకు ఉన్న దౌత్య మార్గాన్ని ఉపయోగించాలన్నారు. ఇండియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంలోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్, సీనియర్ ఇరాన్ దౌత్యవేత్త మొహమ్మద్ జావద్ హొస్సేనీ, ఇజ్రాయెల్ సైనిక దురాక్రమణగా అభివర్ణించాలని ఇండియాను కోరిన కొన్ని గంటల తర్వాత సోనియా గాంధీ ప్రకటన వచ్చింది.