భారత్లో భారీ ఉగ్ర కుట్రకు రెండేళ్లుగా ప్లాన్: డా.షాహిన్

దేశ రాజధానిలో జరిగిన కారు పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో భారత భద్రతా సంస్థలు పెద్ద మొత్తంలో సమాచారం బయటకు తీయగలిగాయి. ఫరీదాబాద్కు చెందిన మెడికల్ లెక్చరర్ డాక్టర్ షాహీన్ షాహిద్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ తరఫున పనిచేసినట్లు అధికారులు గుర్తించారు. ఆమె దేశంలో మహిళా ఉగ్రవాద విభాగాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
జైష్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేరుగా షాహీన్కు ఆదేశాలు ఇచ్చినట్లు తేలింది. సోషల్ మీడియా రహస్య ఛానెల్ల ద్వారా ఆమె జైష్-ఎ-మొహమ్మద్ నేతలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించినట్లు అధికారులు చెబుతున్నారు. సాదియా పాకిస్తాన్లో జైష్-ఎ-మొహమ్మద్ మహిళా విభాగానికి నాయకత్వం వహిస్తున్నట్లు తెలిసింది.
డాక్టర్ షాహీన్ను నవంబర్ 11న అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆమె సహచరులు డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై, డాక్టర్ ఉమర్ ఉ నబీల్ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో వీరి పాత్ర బయటపడడంతో దర్యాప్తు వేగం పెరిగింది.నవంబర్ 8న ముజమ్మిల్ను అరెస్ట్ చేసినప్పుడు అతని వద్ద AK-47 తుపాకీ, పేలుడు పదార్థాలు లభించాయి. విచారణలో అతడు షాహీన్తో తన సంబంధం, జైష్-ఎ-మొహమ్మద్ మహిళా విభాగ కార్యకలాపాల వివరాలు వెల్లడించడంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు.
1979లో లక్నోలో జన్మించిన షాహీన్, ప్రయాగ్రాజ్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేసింది. కాన్పూర్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన ఆమె, 2013లో ఉద్యోగాన్ని వదిలి వెళ్లిపోయింది. భర్త డాక్టర్ జాఫర్ సయీద్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత, ఉగ్రవాద నిధుల కేసులో నిందితుడైన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనైతో సంబంధాన్ని కొనసాగించింది. ఆపై హర్యానాలోని అల్-ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలు ఏర్పరుచుకుని జైష్-ఎ-మొహమ్మద్ నెట్వర్క్ కార్యకలాపాలను అక్కడి నుంచి కొనసాగించింది.
భారత భద్రతా సంస్థలు షాహీన్, ముజమ్మిల్ నెట్వర్క్లను మరింత లోతుగా విచారిస్తున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా జైష్-ఎ-మొహమ్మద్ మహిళా విభాగానికి చెందిన వ్యక్తులు ఉండవచ్చని అనుమానిస్తున్నారు.



