ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుపై సంచలన ఆరోపణలు

Sri Krishna Devarayalu: ప్రజాప్రతినిధులు పక్కా కమర్షియల్గా మారుతున్నారా..! ఆ ఎంపీ దగ్గర పైసలతోనే పనులు జరుగుతాయా..! ఒక్కో పనికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారా..! సిఫార్సు లెటర్ కావాలంటే లక్ష సమర్పించుకోవాల్సిందేనా..! పీఆర్వోనే డీల్ సెట్ చేస్తున్నాడా..! అవినీతి దందా వెనుక ఏం జరుగుతోంది..! ఇంతకూ ఆ ఎంపీ ఎవరు..! ఆయనపై వస్తున్న ఆరోపణలేంటి..! సొంత పార్టీలోనూ ఆ ఎంపీపై విమర్శలు రావడానికి కారణమేంటి..!
పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుపై సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం సిఫార్సు లేఖల పేరుతో భారీగా వసూళ్లు జరుగుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో 44 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కోసం గత డిసెంబర్ 31న నోటిఫికేషన్ జారీ అయింది. మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పినా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన పీఆర్వో వేణు ద్వారా వసూళ్ల దందా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 44 పోస్టుల కోసం 100కు పైగా సిఫార్సు లేఖలు వచ్చాయి. ఇందులో 25 నుంచి 30 లేఖలు నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చినవే. ఒక్కో లేఖకు లక్ష రూపాయలు నుండి 2 లక్షలు వరకు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వసూళ్లలో ఎంపీ పీఆర్వో వేణు కీలక పాత్ర పోషిస్తున్నాడని సొంత పార్టీ నేతల నుండే పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సిఫార్సు లేఖ కావాలంటే నేరుగా తన పీఆర్వో వేణును సంప్రదించాలని సూచిస్తారట. వేణు బహిరంగంగానే అభ్యర్థులను ఎంత ఇవ్వగలరని అడిగి లక్షల్లో వసూలు చేస్తున్నాడని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఈ వసూళ్లతో పెద్ద ఎత్తున కూడా కూడబెట్టారని తెలుస్తోంది. ఎంపీ పీఆర్వో వేణు.. కేవలం 10 నెలల్లో బాపట్ల జిల్లా నరసయ్యపాలెంలో కోటి రూపాయలతో భవనం నిర్మించాడట. కేవలం అవినీతి ఆరోపణలే కాదు.. ఎంపీ లావు తీరుపై సొంత పార్టీలోనూ అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయట.
ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఒంటెత్తు పోకడలతో తెలుగుదేశం పార్టీలోనూ అసంతృప్తి పెరుగుతోందట. ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు ఆయన తీరుపై గుర్రుగా ఉన్నారట. పైకి హుందాతనం చూపిస్తూ లోపల అవినీతి, గ్రూపు రాజకీయాలతో పల్నాడులో పార్టీని నాశనం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయట. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గత ప్రభుత్వంలో అభివృద్ధి చేశామని ఏకంగా ఒక బుక్కు తయారు చేసి మళ్లీ ఎన్నికల్లో గెలిచారు లావు. కుల మత రాజకీయాలకు ఎక్కడ చోటు లేకుండా పారదర్శకంగా పాలన అందిస్తామని నమ్మబలికారు. అయితే పాత పంథాలోనే రాజకీయాలు కొనసాగిస్తున్నాడట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన లావు శ్రీకృష్ణదేవరాయలకు నరసరావుపేట సీటు కట్టబెట్టింది సైకిల్ పార్టీ. విద్యావంతుడు, నిజాయితీపరుడైన రత్తయ్య కుమారుడు కావడంతో లావుకు పెద్దపీట వేశారు చంద్రబాబు. సీనియర్ నాయకులు, పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న నాయకులను పక్కనపెట్టి ఏకంగా పార్టీ ఫిరాయించిన నాయకుడికి టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా అవకాశం కల్పించారు. అయితే ఉన్నతమైన పదవి చేపట్టి హుందాగా వ్యవహరించాల్సిన నాయకుడు ప్రస్తుతం సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
నిరుద్యోగుల ఆశలతో ఆడుకుంటూ సిఫార్సు లేఖల పేరుతో వసూళ్లు చేస్తూ లక్షల రూపాయలు దోచుకుంటున్నాడని ఎంపీ లావుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యవహారం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చెప్పే పారదర్శకతకు సవాల్గా నిలుస్తోంది. మెడికల్ అండ్ హెల్త్ రీజినల్ డైరెక్టర్ సుచిత్ర మెరిట్ ఆధారంగానే స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన మాటలు ఎంతవరకు నిజమవుతాయనే ప్రశ్న తలెత్తుతోంది.
మొత్తానికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుపై ఇంటా, బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి లావు వసూళ్ల దందా ఆరోపణలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.