Sudarshan Reddy: సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో దక్కని చోటు

తెలంగాణ కాంగ్రెస్లో ఆయన ఓ సీనియర్ లీడర్. పైగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేరున్న నాయకుడు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేనప్పుడు సైతం పీసీసీ కోశాధికారిగా ఉండి అన్నీ తానై వ్యవహరించారు. తీరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి అందని ద్రాక్షగానే మారింది. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో కూడా ఆయన పేరు లేకపోవడంతో ఆ నియోజకవర్గంలోని ఆయన అనుచరులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్దమయ్యారు ఇంతకీ ఎవరా నేత…? వాచ్ దిస్ స్టోరీ
తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఈ సారి కూడా ఇందూర్ హస్తం నేతలకు నిరాశే ఎదురైంది. ముఖ్యంగా ఆ పార్టీ జిల్లా ముఖ్య నేతకు అవకాశం దక్కక పోవడంతో నిజామాబాద్ జిల్లాలోని ఆయన వర్గీయులు అసంతృప్తికి గురవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్న మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెలే సుదర్శన్ రెడ్డికి ఈ సారి క్యాబినెట్లో బెర్త్ పక్కా అని భావించారు.
వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవగానే మొదటి విడతలోనే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. సామాజిక సమీకరణాల కోణంలో మొదటి విడతలో అవకాశం దక్కలేదు. ఇక రెండో విడతలో కచ్చితంగా ఆయన పేరు ఉంటుందని జిల్లా కాంగ్రెస్ నేతలు ఫిక్స్ అయ్యారు. ఈసారి కూడా అవకాశం దక్కకపోవడంతో క్యాడర్ నిరుత్సాహ పడుతోంది.
సుదర్శన్ రెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు. సీనియర్ నేతగా పేరున్న ఆయనకు అటు అధిష్టానంతో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయి. వివాదరహితుడిగా పేరున్న పెద్దాయనకు ఈసారి కూడా మంత్రి పదవి దక్కక పోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నుంచి సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ సీనియర్ నాయకులుగా ఉన్నారు. అయితే గత అసెంబ్లి ఎన్నికలలో షబ్బీర్ అలీ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. దీంతో బోధన్ ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్ రెడ్డికి మొదటి విడతలోనే మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు.
గతంలో వైఎస్, రోశయ్య హయంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. జిల్లాలో సీనియర్ నాయకుడు కావడంతో పదవి వస్తుందని అంతా ఆశించారు. అయితే మొదటి విడతలో ఆయనకు పదవి రాలేదు. దీంతో రెండో విడతలో మంత్రి పదవి ఖాయం అనే వార్తలు వచ్చాయి. ఆయనే స్వయంగా తన అనుచరులకు ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఒక దశలో ‘హోంమంత్రి పదవి” అని కూడా లీకులిచ్చారు. చివరకు ఆయనకు రెండో విడతలో కూడా మంత్రి పదవి ఊరించి ఉసూరుమనిపించింది.
పీసీసీ చీఫ్తో పాటు రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ సుదర్శన్ రెడ్డి ఇంటికెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ అసంతృప్తి మాత్రం చల్లారలేదు. నిజామాబాద్ జిల్లా, ముఖ్యంగా ఆయన నియోజకవర్గం నేతలు మాత్రం అధిష్టాన నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వరించే వరకు పార్టీకి దూరంగా ఉంటామంటూ 30 మందికి పైగా సీనియర్ నేతలు మహేష్ కుమార్ గౌడ్కు రాజీనామా లేఖలు అందజేశారు.
అలాగే రానున్న స్దానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తామంటూ అల్టిమేటం జారీ చేశారు. బోధన్ కార్యకర్తల తీరు అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. మరోవైపు మళ్లీ విస్తరణకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉండటంతో అప్పటి వరకు ఏదైనా క్యాబినెట్ ర్యాంక్తో కూడిన పదవి ఇవ్వాలని అధిష్టానం అఫర్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలకు అవకాశం దక్కకపోవడంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి హస్తం శ్రేణుల అసంతృప్తి జ్వాలల్ని అధిష్టానం ఏ విధంగా చల్లారుస్తుందో వేచి చూడాలి.