ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇసుక దందా

ఆ జిల్లాలో ఇసుక లొల్లి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇరకాటంలో పెడుతోందట. తవ్వకాల్లో నేతలు పడుతున్న పోటీతో కొత్త తలనొప్పులు వస్తున్నాయట. ఎమ్మెల్యేల ప్రధాన అనుచరులుగా చెప్పుకునే కొందరు నేతలు.. మంజీరాలోని ఇసుకను అడ్డగోలుగా తవ్వేస్తున్నారట. తమ పేర్లు చెప్పి తవ్వకాలు చేస్తుంటే ఇదెక్కడి పంచాయతీ అంటూ తలలు పట్టుకుంటున్నారట ఆ ఎమ్మెల్యేలు. ఇంతకీ ఆ జిల్లా ఏది అక్కడ ఇసుక పంచాయితీ ఏంటి.. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో ఇసుక దందా జోరుగా నడుస్తోంది. హస్తం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు.. ఈ దందాను నడిపిస్తున్నారట. ఎమ్మెల్యేల కనుసన్నల్లో కొంత.. ఎమ్మెల్యేల పేర్లు చెప్పి మరికొంత దందా చేస్తున్నారట ఆ పార్టీలో ముఖ్య నేతలు. మంజీరా పరివాహక ప్రాంతంలోని క్వారీల్లో తవ్వకాలకు అనుమతులు నిలిపివేసినా దొంగచాటున పొరుగు రాష్ట్రాలకు, హైదరాబాద్కు పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారట. స్ధానిక అవసరాలు, ప్రగతి పనుల పేరిట తాత్కాలిక అనుమతులు తీసుకుని వందల లారీల్లో ఇసుక రవాణా చేస్తున్నారట.
జుక్కల్ నియోజకవర్గంలో క్వారీలు స్ధానిక ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతరావు ఫిర్యాదుతో గతంలో మూత పడగా.. ప్రస్తుతం ఆయన అనుచరులు దొంగచాటున ట్రాక్టర్లలో తరలించి రహస్య ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారట. రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వార తరలిస్తున్నారట. ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు ఈ అక్రమ దందా నడిపిస్తున్నారనే ప్రచారం జరుగుతోందట. బాన్సువాడలోనూ అక్రమ ఇసుక రవాణా స్దానిక ఎమ్మెల్యే పోచారంకు తలనొప్పిగా మారిందట. అభివృద్ది పనుల పేరుతో యువనేత ముఖ్య అనుచరులు బీర్కూర్ క్వారీలో రాత్రి వేళల్లో తవ్వకాలు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలిస్తున్నారట.
ఎమ్మెల్యే పేరు చెప్పి ఈ అక్రమ దందా నడిపిస్తున్నారట ఆయన అనుచరులు. ఇక బోధన్లోనూ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అనచురులు ఇసుక దందాలో రెచ్చిపోతున్నారట. మూడు పాయింట్లలో స్దానిక అవసరాల పేరిట తవ్వకాలు చేస్తున్నారట. విమర్శలు రావడంతో ప్రస్తుతం తవ్వకాలను నిలిపివేశారట. ఇసుక దందాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఎమ్మెల్యే ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని స్వయంగా ముఖ్యమంత్రి.. అధికారులను ఆదేశించారట. ఎమ్మెల్యేలు ఇసుక దందాల్లో తలదూర్చొద్దంటూ చెప్పారట. దీంతో బోధన్, బాన్సువాడ, జుక్కల్ ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు, ప్రభుత్వ అవసరాలకు మాత్రమే ఇసుక తవ్వకాలకు తాత్కాలిక అనుమతులు ఇవ్వాలని మౌఖిక ఆదేశాలిచ్చారట. ఆ ఆదేశాలను అలుసుగా తీసుకుని ద్వితీయ శ్రేణి నేతలు ఒక ట్రాక్టర్ అనుమతి తీసుకుని పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారనే ప్రచారం జరుగుతోందట. అనుమతి లేని ప్రాంతాల్లోనూ రాత్రి, పగలూ తేడా లేకుండా పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారనే విమర్శలు ఉన్నాయట.
ఎమ్మెల్యేల మౌఖిక ఆదేశాలు ఉండటంతో రెవెన్యూ, పోలీసు అధికారులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడం లేదట. పైగా ఇసుక వ్యాపారులతో చేతులు కలుపుతున్నారట. ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా వ్యవహారం ఎమ్మెల్యేలకు చుట్టుకోవడంతో ఆ దందా వద్దే వద్దూ అంటూ కొందరు ఇసుక తవ్వకాలు మూసేయిస్తుంటే మరికొందరు నిబంధనల ప్రకారం తవ్వుకోండి కానీ బద్నాం కాకుండా చూసుకోండని చెబుతున్నారట. స్ధానిక అవసరాల పేరిట జరిగే తవ్వకాలపై ప్రభుత్వం సైతం నిఘా పెట్టిందట. ఎమ్మెల్యేలు ముడుపులు తీసుకుని ఈ దందా నడిపిస్తున్నారా..! లేదంటే కార్యకర్తల ఒత్తిడితో ఒకే అంటున్నారా అన్న అంశాన్ని తేల్చే పనిలో పడ్డారట నిఘా అధికారులు.
మూడు నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలే ఇసుక వ్యాపారుల అవతారం ఎత్తి ఎమ్మెల్యేల కంట్లో నలుసుగా మారారట. ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఈ దందా నడుస్తుందా.. లేదా.. అన్నది తేల్చే పనిలో పడిందట ప్రభుత్వం. మరి ప్రభుత్వ నిఘాలో ఏం తేలుతుందనేది వేచి చూడాలి.