తెలంగాణ

Saleshwaram Jathara: నల్లమల అడవుల్లో సలేశ్వరం జాతర

Saleshwaram Jathara: నల్లమల అడవి… భక్తుల నినాదాలతోప్రతిధ్వనిస్తుంది. వస్తున్నాం లింగమయ్యా అంటూ అడవిలో అడుగుపెడతారు భక్తులు వెళ్తున్నాం లింగమయ్యా అంటూ తిరిగి బయలుదేరతారు. మూడు రోజులపాటు ఆధ్యాత్మిక తేజంతో మెరిసిపోనుందీ సలేశ్వరం. అడవి మార్గంలో లింగమయ్య దర్శనానికి కిలోమీటర్ల నడక, కొండలు, లోయలు, వాగులు, రప్పలు అన్నీ దాటి వచ్చి భక్తిని చాటుకుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాదు పొరుగు రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు అడవి తలుపుతడుతున్నారు.

సలేశ్వరం జాతర తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని నల్లమల్ల అడవుల్లో ప్రతి సంవత్సరం నిర్వహించబడే ప్రముఖ ఆధ్యాత్మిక ఉత్సవం. ఈ జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై లింగమయ్య స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఈ జాతరను దక్షిణ అమర్నాథ్ యాత్రగా కూడా పిలుస్తారు. దాదాపు 30 సంవత్సరాలుగా ఈ యాత్ర కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి సందర్భంగా మూడు రోజులపాటు ఈ జాతర జరుగుతుంది.

సలేశ్వరం జలపాతం 200 అడుగుల ఎత్తు నుండి ప్రవహిస్తూ లింగమయ్య స్వామి శివలింగం పాదాల వద్ద కలుస్తుంది. ఇది ఈ ప్రదేశానికి ప్రత్యేక ఆకర్షణ ఈ జాతరలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఓం నమశ్శివాయ మంత్రోచ్ఛారణలతో ఈ ప్రాంతం మారుమ్రోగుతుంది.

సలేశ్వరం ఆలయం చరిత్ర పరంగా కూడా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ జాతర సమయంలో భక్తులు సలేశ్వరం జలపాత్రలో స్నానం చేసి లింగమయ్య స్వామిని దర్శించుకుంటారు. అదనంగా ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యంతో కూడిన నల్లమల్ల అడవుల్లో ఉన్నందున సాహస యాత్రికులకు కూడా ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ జాతరలో పాల్గొనే భక్తులకు సలేశ్వరం జలపాతం మరియు లింగమయ్య స్వామి ఆలయం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ప్రతి సంవత్సరం ఈ జాతరను అనుభవించడానికి లక్షలాది భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.

నల్లమల అటవీ పరిధిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కో ఏరియాలో.. మూడు రోజులపాటు సలేశ్వరం ఉత్సవాలు జరుగుతాయి. ఇవాళ్టి నుండి పులుల నివాసంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే వాహనాలకు అనుమతి లభిస్తుంది. భద్రతా పరంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడవి లోయల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా వాహనాల మళ్లింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.

ఈ జాతర భద్రతపరంగా కూడా సవాలే. కానీ అన్ని విభాగాల సమన్వయంతో ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడా మినహాయింపుల్లేకుండా ముందుగానే కసరత్తు మొదలుపెట్టింది. చెంచు తెగల ఆరాధ్యదైవమైన సలేశ్వరం లింగమయ్య దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి అంశాన్ని సమీక్షిస్తూ చర్యలు చేపట్టారు. ఈసారి సలేశ్వరం జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది.

గతంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రత్యేక దృష్టి సారించారు. నోడల్ అధికారిగా అచ్చంపేట ఆర్డీఓ మాధవిని నియమించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా RWS ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకులు, చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. 5 వేల లీటర్ల సామర్థ్యంతో తాగునీటి ట్యాంకులు, ఫర్హాబాద్, రాంపూర్, మోకాళ్లకుర్వు, అప్పాయిపల్లి, గిరిజగుండాల వద్ద అందుబాటులోకి తీసుకొచ్చారు.

అడవిలో అడుగుపెట్టిన ప్రతీ భక్తుడి ఆత్మీయ అవసరాల్ని గమనించిన ప్రభుత్వ యంత్రాంగం వైద్యం, శానిటేషన్, అంబులెన్స్, ఫైర్ సర్వీసులు అన్నింటినీ సమపాళ్లలో సమీకరించింది. అంతేకాదు ఆధ్యాత్మికతతో పాటు సేవా భావనను కలిపి దాతలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చారు. వైద్య సదుపాయాల కోసం పీహెచ్సీ వైద్యాధికారులు, ఆర్డీటీ సంస్థలు, వనవాసి కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.

పారిశుద్ధ్య బాధ్యతను అప్పాయిపల్లి పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి అప్పగించారు. రాంపూర్ చెంచుపెంట వద్ద మట్టి చల్లడం ద్వారా రోడ్డుల మరమ్మతులు చేపట్టారు. ఫైర్ ఇంజిన్‌లు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. చలివేంద్రాలు, ఉచిత అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేశారు. అల్పాహారం నుండి రాత్రి భోజనం వరకు అన్నదానం అందుబాటులో ఉండేలా చేశారు.

కేవలం భక్తుల రాకపోకలకే కాదు జాతర ఆధ్యాత్మికతను నిలబెట్టేందుకు ఈ ఏర్పాట్లు కీలకం కానున్నాయి. ఫర్హాబాద్ చెకోపోస్టు నుండి సలేశ్వరం వరకు అడవి మార్గంలో 24 గంటల పర్యవేక్షణకు కెమెరాలు ఏర్పాటు చేశారు. సీఐలు, ఎస్ఐల పర్యవేక్షణలో బందోబస్తు కొనసాగుతోంది. రాంపూర్ చెంచు పెంట నుండి మోకాళ్లకుర్వు, అప్పాయిపల్లి మార్గం వరకు దాతల సహకారంతో ఉచిత పండ్ల పంపిణీ, మజ్జిగ, రాగి అంబలి వంటి సౌకర్యాలు కూడా అందిస్తున్నారు.

చెంచు గిరిజనుల హృదయానికి దగ్గరైన లింగమయ్య ఆలయం ప్రతి సంవత్సరం జాతరలో మనిషి నుండి ప్రకృతి వరకూ ఏకతాటిపై నడిచే పర్వదినాన్ని చూపిస్తోంది. నల్లమల అడవి మరోసారి భక్తిశ్రద్ధలకు వేదిక కానుంది. శాంతి, భద్రత, భక్తి పరవశం అన్నీ కలిసి ఈ సలేశ్వరం జాతరను ఓ అపూర్వ ఆధ్యాత్మిక ప్రయాణంగా తీర్చిదిద్దుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button