Revanth Reddy: తెలంగాణ సమాజానికి మహిళలే పునాది

Revanth Reddy: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. తాము అధికార పగ్గాలు చేపట్టే సమయానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర గందరగోళంలో ఉందని, గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన అనేక కీలక వ్యవస్థలను ప్రస్తుతం చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యామని తెలిపారు.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మహిళలే మూలస్తంభాలని సీఎం అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. . వారికి ఇప్పటికే 21 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను అందించాం. పాఠశాలల నిర్వహణ బాధ్యతలను కూడా మహిళా సంఘాలకే అప్పగించామన్నారు. త్వరలోనే క్యూఆర్ కోడ్ కార్డు ద్వారా మహిళలకు ఉచితంగా వైద్యపరీక్షలు చేయించే పథకాన్ని కూడా తీసుకురాబోతున్నామని రేవంత్ రెడ్డి వివరించారు.
రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. మేం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోపే 2 లక్షల లోపు రైతుల రుణాలను మాఫీ చేశామన్నారు. ఈ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాల్లో 26 వేల కోట్లు జమ చేశాం. సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్కు 500 బోనస్ అందిస్తున్నామన్నారు.