వివేకా హత్య కేసులో సాక్షి రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న మృతదేహానికి రీపోస్ట్మార్టం నిర్వహించారు. పులివెందుల భాకరాపురం శ్మశానవాటికలో తిరుపతి, మంగళగిరి ఫోరెన్సిక్ నిపుణులు, వైద్యుల ఆధ్వర్యంలో 4 గంటలపాటు దీన్ని నిర్వహించారు. రంగన్న మృతిపై అనుమానాలున్నాయని ఆయన భార్య ఆరోపణలు చేశారు. దీంతో సందేహాల నివృత్తి కోసం మరోసారి పోస్ట్మార్టం చేశారు. మృతదేహంపై గాయాలు ఉన్నాయా లేదా అనే అంశాన్ని వారు పరిశీలించారు. ఈ క్రమంలోనే రంగన్న మృతదేహం నుంచిఫోరెన్సిక్ నిపుణులు పలు అవయవాలు సేకరించారు.
వాటిని భద్రపరిచి పరీక్షల కోసం తీసుకెళ్లారు. ప్రత్యక్ష సాక్షి వాచ్మన్ రంగన్న మూడు రోజుల కిందట అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తన తండ్రికి అందించిన చికిత్సపై అనుమానాలున్నాయంటూ మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీఎన్ఎస్ యాక్ట్ 194 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ మరణాల వెనుక వివేకా హత్య కేసు నిందితుల ప్రమేయం, కుట్ర ఉందన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.