News

Ranganath: హైడ్రాపై రంగనాథ్ యాక్షన్ ప్లాన్

Ranganath: భాగ్యనగరంలోని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భూములు, చెరువులు, పేదల ఇళ్ల స్థలాలు, పార్కులు, రహదారులను ఆక్రమించేవారిపై ఇకపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇసుక అక్రమ రవాణా, చెరువులు, బహిరంగ ప్రదేశాల్లో నిర్మాణ వ్యర్థాలు వేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నేరుగా జైలుకు పంపడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఈనెల 8న బుద్ధభవన్‌లోని హైడ్రా ప్రధాన కార్యాలయం పక్కనే ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనుంది.

ఆక్రమణల కూల్చివేతలో ఇప్పటికూ హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇకపై అక్రమదారులను జైలుకు పంపేందుకు కూడా వెనుకాడబోదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చిచెప్పారు. ప్రత్యేక పోలీస్ స్టేషన్ విధివిధానాలను వివరించారు. హైడ్రా ఇప్పటికే వందల ఎకరాల ప్రభుత్వ భూములను, అనేక చెరువులు, పార్కకులు, నాలాలను ఆక్రమణదారుల నుంచి రంగనాథ్ అన్నారు.

ఈ ఆక్రమణలకు సంబంధించిన 50 కి పైగా కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో విచారణ దశలో ఉన్నాయని ఆయన అన్నారు. హైడ్రా ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ ఏర్పాటుతో ఈ కేసులన్నీ తక్షణమే హైడ్రాకు బదిలీ అవుతాయన్నారు. కొత్తగా నమోదయ్యే ఆక్రమణల కేసులు కూడా ఇకపై వేగంగా పరిష్కరించనున్నట్లు రంగనాథ్ తెలిపారు.

ఈ ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు వెనుక హైడ్రా రెండు ముఖ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నట్టు రంగనాథ్ వివరించారు. మొదట ఆక్రమణ సమస్య మూలాల్లోకి వెళ్లి, ముఖ్యంగా చెరువుల ఆక్రమణలను పూర్తిగా నివారించడం. రెండవది, నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్న అధికారులు, సిబ్బంది, ఆక్రమణదారులను పక్కా ఆధారాలతో గుర్తించి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించడం, వారిని జైలుకు పంపడం.

ప్రస్తుతానికి ఈ ప్రత్యేక పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 12 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 60 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నట్టు రంగనాథ్ తెలిపారు. భవిష్యత్తులో ఫిర్యాదుల సంఖ్య పెరిగితే, ఈ పోలీస్ స్టేషన్ల సంఖ్యను కూడా పెంచే అవకాశం ఉందన్నారు. ఆర్థిక నేరాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సైబర్ నేరాల్లో సీసీఎస్ పోలీసులు ఎలా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తారో, అదే తరహాలో హైడ్రా పోలీసులు కూడా ఆక్రమణదారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తారని తెలిపారు. నేరానికి సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుని నిందితులను చట్ట ప్రకారం శిక్షిస్తారని కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

చెరువుల ఆక్రమణ అనేది సాధారణంగా నిర్మాణ వ్యర్థాలు డంపింగ్ చేయడంతో ప్రారంభమవుతుందని హైడ్రా కమిషనర్ తెలిపారు. సెల్లార్ తవ్వకాల్లో వచ్చే మట్టి, కూల్చిన భవనాల వ్యర్థాలు, ఇతర చెత్తతో చెరువులను పూడ్చి, వాటిపై అక్రమ నిర్మాణాలు చేపట్టి విక్రయించడం ఏళ్లుగా కొనసాగుతోందన్నారు. ఇప్పటివరకు అధికారులు ఫిర్యాదు చేస్తే స్థానిక పోలీసులు కేవలం వాహనాల డ్రైవర్లపై మాత్రమే నామమాత్రపు కేసులు నమోదు చేసేవారని కానీ, హైడ్రా ఇకపై ఈ సమస్య మూలాల్లోకి వెళ్తుందని పేర్కొన్నారు.

హైడ్రా ప్రత్యేక పోలీస్ స్టేషన్ అందుబాటులోకి వస్తే, అక్రమ నిర్మాణ సంస్థలు, చెరువులను పూడ్చే వాహనాల యజమానులు, ప్రధాన ఆక్రమణదారులను వేర్వేరు కఠినమైన చట్టాల కింద అరెస్టు చేసి జైలుకు పంపిస్తారు. ఈ చర్యలతో ప్రభుత్వ భూములు, జలవనరుల ఆక్రమణకు ఇకపై అడ్డు తొలగిపోతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button