అయోధ్యలో రామనవమి వేడుకలు

Ayodhya: అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునుంచే బాలరాముడికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం సూర్య భగవానుడు బాలరాముడి నుదిటిపై సూర్య తిలకం దిద్దారు. మరోవైపు నవమి సందర్భంగా అయోధ్య రామాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బాలరాముడి దర్శనానికి దేశం నలుమూలల నుంచి అయోధ్యకు తరలివచ్చారు.
లోక రక్షణ, రాక్షస సంహారం కోసం శ్రీ మహావిష్ణువు ఒక్కో యుగంలో ఒక్కో అవతారంలో జన్మించాడని చెబుతారు. అలా త్రేతాయుగంలో మహా విష్ణువు ఏడవ అవతారమే శ్రీరాముడు. శ్రీరాముడు నవమి తిథి రోజున సూర్యవంశంలో జన్మించాడు. సూర్యుడు తన పూర్తి ప్రభావంలో ఉన్న మధ్యయుగంలో అభిజిత్ ముహుర్తంలో రామయ్య జననం జరిగిందని చెబుతారు.
ఆనాడే సీతారాముల కళ్యాణం జరిగిందని,14 ఏళ్ల అరణ్యవాసం అనంరతం పట్టాభిషిక్తుడైన రోజు కూడా నవమి తిథిగా చెబుతారు. అందుకే ఏటా శ్రీరామనవమి రోజు ప్రపంచ వ్యాప్తంగా పండుగ, పర్వదినంగా జరుపుకుంటారు రామ భక్తులు. ఈ యేడు ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా అన్ని ఆలయాల్లో శ్రీ సీతారముల కల్యాణం నిర్వహిస్తున్నారు.
శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య శ్రీరామనవమి సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఉదయం తెల్లవారుజామునుంచే ఆలయంలోని బాలరామయ్యకు ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు నిర్వహించారు.. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు సూర్య తిలకం దిద్దుతారు.
ఈ సందర్భంగా సూర్య కిరణాలు దాదాపు నాలుగు నిమిషాల పాటు బాల రామయ్య నుదిటిపై పడనున్నాయి. ఈ అపూర్వ దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు చేరుకుంటున్నారు. మరోవైపు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ దృశ్యాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీంతో భక్తులందరూ తమ ఇళ్ల నుంచే ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశం దక్కనుంది.