Rajnath Singh: భారత్లో ఏ ఉగ్రదాడి జరిగినా పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదు

Rajnath Singh: భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశంలో ఏ ఉగ్రదాడి జరిగినా పాకిస్థాన్ అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జమ్మూకశ్మీర్లోని ఉదంపుర్లో ఆయన యోగాసనాలు వేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని తెలిపారు.
పాక్ ఇలాగే ఉగ్రవాదానికి మద్దతిస్తూ ఉంటే అందుకు ఆ దేశం అత్యంత దారుణమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏ చర్య తీసుకోవడానికైనా పూర్తిగా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
2016లోని సర్జికల్ స్ట్రైక్, 2019లోని వైమానిక దాడులకు కొనసాగింపే ఆపరేషన్ సిందూర్ అని ఆయన పేర్కొన్నారు. తమ థౌజండ్ కట్ పాలసీ పనిచేయదని ఆపరేషన్ సిందూర్తో పాక్కు అర్థమైందన్నారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.
అందులో భాగంగా పాక్లోని ఉగ్రస్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేసి వాటిని ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. భారత్ దాడులకు వణికిపోయిన పాక్ చివరకు కాళ్లబేరానికి వచ్చింది. ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయాలనే లక్ష్యం నెరవేరడంతో కాల్పుల విరమణకు భారత్ సైతం అంగీకరించింది.