RR Vs GT:రాజస్థాన్ దెబ్బకు గుజరాత్ అబ్బా.. ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల వైభవ్

RR Vs GT: ఏమ్ ఆట.. ఏమ్ బాదుడు..! కొడితే సిక్సే కొట్టాలన్నట్టు.. బౌలర్లపై పగబట్టినట్టు ఊచకోత కోసేశాడు 14ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఇంత తేలిగ్గా సిక్స్ బాదేయచ్చా.. సెంచరీ చేయడం అంత సులువా అన్నట్లుగా ఈ చిన్నోడు చెలరేగుతుంటే చూడటానికి రెండు కళ్లూ సరిపోలేదు. సవాయ్ మాన్సింగ్ స్టేడియాన్ని సునామీలా చుట్టేసిన రాజస్థాన్ ఓపెనర్ సూర్యవంశీ.. గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
అలా ఫ్లిక్స్ చేస్తే బంతి వెళ్లి అభిమానుల్లో పడింది ముందుకొచ్చి కాస్త బంతిని టచ్ చేస్తే రివ్వున ఎగిరి స్టాండ్స్లో కనబడింది. ఒకటా-రెండా ఇలాంటి షాట్లు అతడి ఆటే హైలైట్స్ చూసినట్లుగా అనిపించింది. అతడి పవర్, టైమింగ్, దృక్పథం అద్భుతం. తానాడిన తొలి మ్యాచ్లోనే మెరిసినప్పటికీ
14 ఏళ్లకే 1.1కోట్ల రూపాయలతో ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న సూర్యవంశీ మెరుపుల వెనుక ఎంతో కఠోర శ్రమ ఉంది. మనీశ్ ఓజా కోచింగ్లో ఎదిగిన బిహార్ కుర్రాడు.. రోజుకు 600 బంతులను ఎదుర్కొని సాధన చేశాడు.
అంతర్జాతీయ స్థాయిలో పోటీ, అత్యంత తీవ్రత ఉండే IPL మ్యాచ్లో మేటి బౌలర్ల బౌలింగ్ను ఊచకోత కోసి ఔరా అనిపించాడు వైభవ్ సూర్యవంశీ. ఇతనికి పద్నాలుగేళ్లంటే నమ్మం అనుకుంటూ ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేలా బ్యాటుతో పెను విధ్వంసం సృష్టించాడు. మామూలుగా బాదలేదు ఈ రాజస్థాన్ రాయల్స్ చిన్నోడు.
బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ సిక్స్లు, ఫోర్ల మోతతో హైలైట్స్ను తలపిస్తూ.. కేవలం 35బంతుల్లోనే శతకం బాదేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. ఫలితంగా 210 పరుగుల లక్ష్యాన్ని కూడా అలవోకగా చేధించి.. గుజరాత్ను చిత్తు చిత్తుగా ఓడించింది రాజస్థాన్.