తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు తిరిగి చురుగ్గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంటున్నారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నేడు నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, నిర్మల్, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
రేపు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. జూన్ 16, 17 తేదీల్లో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. జూన్ 18న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు.
వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు. వర్షం హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకునేటప్పుడు, బయట కార్యకలాపాల్లో పాల్గొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.