Putin-Modi: నేడు పుతిన్–మోదీ సమావేశం.. కీలక అంశాలపై చర్చలు

Putin-Modi: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాలో పర్యటిస్తున్నారు. పుతిన్ తో ప్రధాని మోడీ ఇవాళ భేటీ కానున్నారు. భారత్- రష్యా 23వ శిఖరాగ్ర సమావేశానికి నేతలు హాజరుకానున్నారు. 25కు పైగా ఒప్పందాలపై భారత్ – రష్యా సంతకాలు చేయనున్నాయి. అంతకన్నా ముందు రాజ్ ఘాట్ ను సందర్శించనున్నారు. నిన్న పుతిన్ కు ప్రధాని మోడీ విందు ఇచ్చారు.
భారత్-రష్యా దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే రష్యా పార్లమెంట్లోని లోయర్ హౌస్ RELOS ఒప్పందాన్ని ఆమోదించింది. ఇరు దేశాల సైనిక బలగాలు, నౌకలు, విమానాల మధ్య లాజిస్టిక్ మద్దతు, ట్రూప్స్ ఎక్స్చేంజ్ సులభతరమవుతాయి.
ప్రధాని మోడీతో పుతిన్ ఇవాళ జరిగే చర్చల్లో S-400 మిస్సైల్ సిస్టమ్ల అదనపు డెలివరీలు, Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్ల కొనుగోళ్లు, S-500 అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ వంటి అంశాలు చర్చనీయాంశాల్లో ఉన్నాయి. 2018లో 5.4 బిలియన్ డాలర్ల విలువైన S-400 ఒప్పందంలో ఇప్పటివరకు మూడు స్క్వాడ్రన్లు డెలివరీ అయ్యాయి. మిగిలిన రెండు స్క్వాడ్రన్ల డెలివరీని వేగవంతం చేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది.
దేశ రాజధాని చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేశారు. వీవీఐపీ పర్యటనను దృష్టిలో ఉంచుకుని నగరమంతా హై-అలర్ట్లో ఉంచారు. స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ బృందాలు, ఉగ్రవాద నిరోధక విభాగాలు, స్నిపర్లు, త్వరిత-ప్రతిచర్య బృందాలతో కూడిన బహుళ-స్థాయి భద్రతా గ్రిడ్ ఏర్పాటు చేశారు. 5 వేల మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు.



