జాతియం

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు స్లొవేకియా వర్సిటీ గౌరవ డాక్టరేట్‌

Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు స్లొవేకియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. రాష్ట్రపతి ముర్ము స్లొవేకియాలో పర్యటిస్తున్నారు. పోర్చుగల్, స్లొవేకియాల్లో నాలుగు రోజుల పర్యటనలో ఆఖరు రోజైన గురువారం చారిత్రక నిట్ర నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా కాన్‌స్టంటైన్‌ ది ఫిలాసర్‌ వర్సిటీ ముర్ముకు గౌరవ డాక్టరేట్‌ అందజేసింది. యూనివర్సిటీ సైంటిఫిక్‌ కౌన్సిల్‌ ఈ పురస్కారాన్ని ఆమెకు అందజేసింది. ప్రజలకు ముర్ము అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా డాక్టరేట్‌తో గౌరవిస్తున్నట్లు తెలిపింది.

140 కోట్ల భారతీయుల తరఫున ఈ గౌరవాన్ని స్వీకరిస్తున్నట్లు ముర్ము తెలిపారు. గతంలో బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు ఫెర్నాండో హెన్రిక్‌ కార్డొసో 2002లో ఈ డాక్టరేట్‌ అందుకున్నారు. ప్రముఖ తత్వవేత్త సెయింట్‌ కాన్‌స్టంటైన్‌ సిరిల్‌ పేరుతో ఏర్పాటైన ఈ వర్సిటీలో ఐదు ఫ్యాకల్టీలకు గాను 400 మంది అంతర్జాతీయ విద్యార్థులు సహా 7 వేల మంది విద్యార్థులున్నారు.

స్లొవేకియాలోని అత్యంత ప్రాచీన నగరంగా నిట్రకు పేరుంది. అంతకు ముందు, రాష్ట్రపతి ముర్ము ప్రెసోవ్‌ నగరంలోని బబడ్లో పప్పెట్‌ థియేటర్‌లో ప్రదర్శించిన రామాయణం తోలు బొమ్మలాటను తిలకించారు. శ్రీకృష్ణుని భక్తురాలు, భారతీయ సంస్కృతిని అభిమానించే లెంకా ముకోవా అలియాస్‌ లేఖా స్రవంతి దేవిదాసి ఈ షోను రూపొందించారు. ఈ ప్రదర్శనకు 150 మంది స్లొవాక్‌ విద్యార్థులు హాజరయ్యారు. అనంతరం భారతీయ పంచతంత్ర, జాతక కథలు ఇతివృత్తంగా స్లొవాక్‌ చిన్నారులు వేసిన పెయింటింగ్స్‌ ఎగ్జిబిషన్‌ను రాష్ట్రపతి ముర్ము తిలకించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button