Tamil Civilization: తమిళ నాగరికత పై రాజకీయమా..?

Tamil Civilization: చరిత్రను మార్చలేము.. తుడిచిపెట్టలేము దీనికి ఈ తవ్వకాలే ఓ నిదర్శనం. లేదంటే ఒకే స్థలంలో అనేక నాగరికతల గుర్తులను గుర్తించడం అనేది మాములు విషయం కాదు. ఎన్నో తరాలుగా విడతల వారీగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో ప్రతిసారి మట్టిపొరల్లో కప్పుకుపోయిన చరిత్ర బయటపడుతూనే ఉంది. పురాతన నాగరికత ఆనవాళ్లు, చరిత్ర ఏ సంస్కృతికైనా గర్వకారణమే. కానీ అలాంటి నాగరికతపై రాజకీయం రగులుతోంది. ఒకరిపై మరొకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ఇంతకీ చరిత్రపై సవాళ్లు విసురుతున్నదెవరు.? ఎక్కడ జరుగుతోందీ నాటకీయ రాజకీయం..?
పురాతన నాగరికత ఆనవాళ్లు, చరిత్ర ఏ సంస్కృతికైనా గర్వకారణమే. అందులోనూ తమ భాషను, సంస్కృతిని విపరీతంగా ప్రేమించే తమిళుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడులో ఇటీవల కాలంలో పురావస్తు శాఖ అధికారులు జరిపిన తవ్వకాల్లో చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు అనేకం బయటపడ్డాయి.
చరిత్రలో తెలిపిన వివరాల ప్రకారం జరిపిన తవ్వకాల్లో వాటి అవశేషాలను గుర్తించిన ఆర్కియాలజీ అధికారులు వాటిపై ఇంకా పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి పురాతన నిర్మాణాలకు సంబంధించిన సమాచారంతో తవ్వకాలు జరిపితే మరోసారి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి.
అలా వారు వెలుగులోకి తెచ్చిన కీళడి నాగరికత, అది కొనసాగిన కాలం విషయంలో ఆ రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఎడతెగని వివాదం నెలకొంది. కీళడి తవ్వకాలలో లభించిన ప్రాచీన వస్తువులు, నగర శిథిలాలను బట్టి అక్కడి తమిళుల నాగరికత కాలం 2,800 సంవత్సరాలకు మునుపటిదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా అది 2,300 ఏళ్ల మునుపటిదేనని కేంద్రం అంటోంది. అంతేకాదు కీళడి నాగరికతకు సంబంధించి భారత పురాతత్వ శాఖ రూపొందించిన నివేదికను పక్కన పెట్టింది.
దీనిపై తమిళ రాజకీయపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలానికి, వారు చెప్పే సిద్ధాంతాలను తోసిరాజనేలా కీళడి నాగరికత ఉండటంతోనే వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నాయి. ఇప్పుడీ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడులోని మదురై ప్రాచీన నగరం. తమిళ సాహిత్యానికి, సంస్కృతికి పుట్టినిల్లు. ఆ నగరం చుట్టూ తమిళ శిలా శాసనాలు, కుడ్య శాసనాలు, తిరుప్పరంకుండ్రం, అళగన్కుళం శాసనాలు వంటివెన్నో లభించాయి. ఈ క్రమంలో మదురై చేరువగా తమిళ ప్రాచీన నాగరికత ఆనవాళ్లు ఉండవచ్చన్న ఆలోచనతో ఆ రాష్ట్ర పురావస్తు శాఖ 2014లో తవ్వకాలు చేపట్టింది.
అక్కడి వైగై నది తీరాన ప్రాచీన కట్టడాలు, నీటి కాలువలు, చేనేత పరిశ్రమకు సంబంధించిన ఆనవాళ్లు, కుండలు, పెంకులు, ఆభరణాలు వంటివెన్నో బయటపడ్డాయి. దీనిపై తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది. కీళడిలో నగర నాగరికత 2,800 సంవత్సరాలకు పూర్వమే ఆవిర్భవించిందని తెలిపింది.
మరోవైపు కీళడిలో ఏఎస్ఐకి చెందిన అమర్నాథ్ రామకృష్ణన్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం కూడా తవ్వకాలు జరిపి 2,800 సంవత్సరాలకు పూర్వం ఈ నాగరికత ఆవిర్భవించిందని, క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో అంటే 2,500 సంవత్సరాలకు ముందు విస్తరించిందని తెలిపింది. రామకృష్ణన్ బృందం 2,800 సంవత్సరాలకు పూర్వమే ఈ నాగరికత ఆవిర్భవించిందని పేర్కొన్నా అది విస్తరించిన కాలాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవడం వివాదానికి దారితీసింది.
అమర్నాథ్ రామకృష్ణన్ నివేదిక, కీళడిలో లభ్యమైన వస్తువులను బట్టి చూస్తే తమిళుల నాగరికత కాలం 2,300 సంవత్సరాల క్రితం నాటిది మాత్రమేనని అవగతమవుతోందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నాగరికత కాలాన్ని 500 సంవత్సరాలు తగ్గించాలని సూచించింది. అయితే కీళడి వద్ద తవ్వకాలు, పురాతన ఆధారాల గుర్తింపు అంతా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చేపట్టామని, ఆ వస్తువులన్నీ ఏ కాలానికి చెందినవో పరిశోధకులు నిర్ధారించారని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది.
కీళడి పురావస్తు పరిశోధనలపై ఏఎస్ఐ, రాష్ట్ర పురావస్తు శాఖ సమర్పించిన నివేదికలను అధికారికంగా బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. పురావస్తు తవ్వకాల్లో లభించే పెంకులు, బంగారం, వెండి, ఇనుము వంటి వస్తువులు ఎన్నేళ్ల క్రితం నాటివో క్షణాల్లో తేల్చి చెప్పగల స్కానింగ్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి ఈ వస్తువుల కాలాన్ని తమిళనాడులోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా స్కానింగ్ చేసి నిర్ధారించారు.
పూర్వం రాజులు వేయించిన శాసనాలు, వారు వాడిన రాగి ఫలకాలు తమిళనాడులో వెలికివచ్చాయి. తిరువణ్ణామలై జిల్లా జమునామరదూర్ తాలూకా వీరప్పనూరులో విజయనగరరాజు వేంకటపతిరాయ కాలం నాటి రాగి ఫలకాలు ఇటీవల లభ్యమయ్యాయి. 16వ శతాబ్దానికి చెందిన ఈ ఫలకాలు సంస్కృతం, నందినగరి లిపిలో రాయించినవిగా పురావస్తు శాఖాధికారులు గుర్తించారు.
గొబ్బూరు ఔబాల భూపాల మనవడు, యతిరాజ కుమారుడు అబ్బరాజు అభ్యర్థన మేరకు ఆరవీడు వంశానికి చెందిన వేంకటపతిరాయుడు పడవీడు మహారాజ్యంలో పేరి తిమిరనాడు పరిసరాల్లోని ఒండ్రువంతంగలి అనే గ్రామాన్ని సీతారామపురగా పేరు మార్చి పలువురు బ్రాహ్మణులకు బహుమానంగా ఇచ్చినట్లు ఈ రాగి ఫలకాల్లో ఉంది.
కీళడి నాగరికత కాలాన్ని 500 సంవత్సరాలు తగ్గించాలన్న కేంద్రం సూచనపై తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ మండిపడుతున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే సహా ప్రధాన పార్టీల నేతలంతా కేంద్రం తీరును తప్పుపడుతున్నారు. కీళడి నగర నాగరికతను సింధు నాగరికతతో పోల్చటాన్ని కేంద్రంలోని పాలకులు ఏ మాత్రం సహించలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు.
సంగ సాహిత్యంలో వివరించిన జీవన విధానం కీళడి ఆవిష్కరణలతో శాస్త్రీయంగా నిర్ధారణ అయిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. కీళడి పురావస్తు తవ్వకాలపై బ్రిటన్లోని లివర్పూల్ జాన్ మూర్స్ విశ్వవిద్యాలయం తాజాగా నిర్వహించిన పరిశోధనలు కూడా తమిళుల సంస్కృతి ప్రాచీనతను గుర్తించాయని తెలిపారు. కేంద్రం ఏ మాత్రం జాప్యం చేయకుండా కీళడి తవ్వకాల నివేదికను ఆమోదించాలని డిమాండ్ చేశారు.
కీళడిలో లభించిన పుర్రెలను పరిశీలించిన జాన్మూర్స్ విశ్వవిద్యాలయం త్రీడీ సాంకేతిక పరిజ్ఞానంతో 2,500 ఏళ్లకు పూర్వంనాటి ప్రజల ముఖకవళికలను పునర్నిర్మించటం పట్ల తాము గర్వపడుతున్నామని చెప్పారు. 5,300 ఏళ్లకు ముందే తమిళనాట ఇనుప, ఇతర లోహపు వస్తువులను ఉపయోగించేవారని పురావస్తు తవ్వకాల్లో వెల్లడైందని, దక్షిణ భారతం అప్పట్లోనే ఇనుప లోహాన్ని వాడేవారని నిర్ధారణ అయిందని స్పష్టం చేస్తున్నారు.
కీళడిలో మరింత విస్తృతంగా పరిశోధనలు జరపాలని సిఫార్సు చేశానని అమర్నాథ్ రామకృష్ణన్ తెలిపారు. వైగై వంటి చిన్న నది సమీపాన పెద్ద నాగరికతల ఆనవాళ్లు లభించడమేంటన్న విమర్శలు సరికాదని చెప్పారు. సింధు నాగరికత కూడా ఆ నదికే పరిమితం కాకుండా 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని ఇక్కడ వైగై నది నాగరికత కూడా చాలా విస్తరించి ఉండవచ్చని తెలిపారు. కీళడికి చేరువగా ఉన్న మరికొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు జరిపితే ఆధారాలు బయటపడతాయని తెలిపారు.
సింధు, హరప్పానాగరికతలకు సంబంధించి బయటపడిన పురాతన వస్తువులను పోల్చదగిన సాహిత్యం అంటూ ఏదీ లేదు. అయితే తమిళ సంగ సాహిత్యంలో వర్ణించిన నగరాలు, నివాసగృహాలు, ఆభరణాలు, పనిముట్ల వంటివి కీళడి తవ్వకాల్లో బయటపడ్డాయని తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది. అమర్నాథ్ రామకృష్ణన్ రెండు విడతలుగా కీళడి వద్ద పురావస్తు తవ్వకాలను సమర్థవంతంగా నిర్వహించారని.. కానీ కేంద్రం ఆయనను మరో చోటికి బదిలీ చేసిందని గుర్తు చేస్తోంది.
తర్వాత వచ్చిన అధికారి.. తమిళ ప్రాచీన నగరాల నాగరికతకు సంబంధించి ఎలాంటి వస్తువులు లభ్యం కాలేదని ప్రకటించి చేతులు దులుపుకొన్నారన్న విమర్శలు ఉన్నాయ్. దీనితో రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి పురావస్తు తవ్వకాలను కొనసాగించిందని తవ్వకాల్లో లభించిన పురాతన వస్తువులతో మ్యూజియం కూడా ఏర్పాటు చేశామని తెలిపింది.
కీళడి నాగరికతపై ఎడతెగని వివాదం నెలకొనడంతో నాగరికత అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. పురాతన నాగరికత ఆనవాళ్లు, చరిత్ర ఏ సంస్కృతికైనా గర్వకారణమేనని దీనిపై వివాదాలు ఎందుకుని నిపుణులు అంటున్నారు.