శ్రీశైల క్షేత్రంలో ప్రత్యేక ఉత్సవంలా పాగాలంకరణ

Srisailam: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీశైల క్షేత్రం నందు పాగాలంకరణను ప్రత్యేక ఉత్సవంలా జరిపిస్తారు. ఈ పాగాలంకరణ సేవ చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుండి భక్తులు శ్రీశైలం క్షేత్రానికి తరలివచ్చారు. ఈ పాగాలంకరణ సేవ ఎంతో విశిష్టితను సంతరించుకుంది. అభిషేకం తరువాత శ్రీస్వామి అమ్మవార్లకు కళ్యాణమహోత్సవం జరిపిస్తారు. మన సనాతన ధర్మ సంప్రదాయంలో కళ్యాణం ఒక మహాద్భుత ఘట్టం.
దేవాలయాల్లో నిత్య కళ్యాణం చేస్తారు. కళ్యాణ సంప్రదాయంలో మొదట వరుడికి మంగళ స్నానాలు చేయిస్తారు. ఆ మంగళ స్నానమే స్వామివారికి చేసే మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. స్నానం తరువాత స్వామిని వారిని పెండ్లి కొడుకుగా అలంకరించుటలో భాగంగా తలకు పాగా చుట్టడం సంప్రదాయం. ఆ తలపాగా ఎలాగైతే వరుడికి చుడతామో అలాగే స్వామివారి ఆలయ విమాన శిఖరంపై ఉన్న త్రిశూలానికి పాగాను కట్టి ఆలయంపై ఉన్న నందుల కొమ్ములకు పాగాను చుడతారు. ఈ అలంకరణనే పాగాలంకరణ అని పిలుస్తారు.