Donald Trump: ట్రంప్పై అమెరికాలో వ్యతిరేకత.. కోర్టులో దావాలు వేసిన 22 రాష్ట్రాలు

Donald Trump: పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే ట్రంప్కు వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. ఆయన నిర్ణయాలపై అమెరికాలోని పలు రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. ఇదేం నిర్ణయాలు అంటూ.. కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి. బర్త్ రైట్ సిటిజన్ షిప్ రద్దు.. అమెరికాను కుదిపేస్తున్నాయి.
బర్త్ రైట్ అంశంలో ట్రంప్ నిర్ణయంపై అమెరికాలో దుమారం రేగుతోంది. అధ్యక్షుడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. 22 రాష్ట్రాలు న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయి. బర్త్ రైట్ సిటిజన్ షిప్ రద్దు చేస్తూ.. ఆదేశాలు జారీ చేసిన 24 గంటల్లోనే.. దానిని సవాల్ చేస్తూ కోర్టులో దావాలు వేశాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తున్నాయి. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ట్రంప్ తన పరిధిని దాటారని మండిపడుతున్నాయి. న్యూయార్క్, కాలిఫోర్నియా సహా మొత్తం 22 రాష్ట్రాలు.. ట్రంప్ నిర్ణయంపై మండిపడుతున్నాయి.
దేశంలో జన్మించే పిల్లలకు ఆటోమెటిక్గా సంక్రమించే.. పౌరసత్వ హక్కును కాలరాస్తున్నారని ఫైర్ అవుతున్నారు నేతలు. అధ్యక్షుడు సంతకం చేసిన ఆర్డర్ను అమలు చేయడానికి అనుమతిస్తే.. ఏటా ఏటా అమెరికాలో జన్మించే.. పిల్లల హక్కును నిరాకరించినట్లు అవుతుందంటున్నారు. రాజ్యాంగపరమైన హక్కులను తొలగించే అధికారం.. ప్రెసిడెంట్కు ఉండదని చెబుతున్నారు.
కాగా.. జన్మత: లభించే ఈ పౌరసత్వ హక్కును మార్చడం అంత సులభం కాదని.. అమెరికా రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందన్నారు. అయితే.. ఇప్పటికే 22 రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న కారణంగా రాజ్యాంగ సవరణ చేయడం కష్టమని అభిప్రాయపడ్డారు.
అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే.. ట్రంప్ కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని.. ట్రంప్ రద్దు చేశారు. దాదాపు వందేళ్లుగా అమల్లో ఉన్న విధానానికి ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఫుల్స్టాప్ పెట్టారు. అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ప్రభుత్వం గుర్తించదని ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికా చట్టాల ప్రకారం.. ఆ దేశ పౌరులకు పుట్టిన వారికి మాత్రమే కాకుండా.. అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికీ అక్కడి పౌరసత్వం లభిస్తుంది. అమెరికా గడ్డపై పుట్టినవారంతా ఈ దేశ పౌరులే అనే ఉద్దేశంతో 1868లో 14వ రాజ్యాంగ సవరణ చేసింది. దీని ద్వారా.. శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. అయితే.. తాజాగా ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులతో దీనికి బ్రేక్ పడింది.