Mohan Babu: సుప్రీంకోర్టులో నటుడు మోహన్బాబుకు ఊరట

Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనకు ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది డిసెంబరు 10న జల్పల్లిలోని మోహన్బాబు ఇంటి ప్రాంగణంలో.. ఆయనను ప్రశ్నించిన జర్నలిస్ట్పై, చేతిలోని మైకు లాక్కొని అతడిపై దాడి చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మోహన్బాబు దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబరు 23న కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇక గాయపడిన జర్నలిస్టుని ఆస్పత్రికి వెళ్లి మోహన్బాబు పరామర్శించారని విచారణ సందర్భంగా మోహన్బాబు తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జర్నలిస్ట్కి అవసరమైన ఆర్థిక సాయం కూడా చేస్తామని ఇప్పటికే ప్రకటించినట్టు కోర్టుకు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ లేకుండా చేసి, ఇంటికి వచ్చిన వారిపై దాడి చేశారని.. విచారణకు కూడా వెళ్లలేదు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ విధంగా వ్యవహరించలేదని న్యాయవాది తెలిపారు.
ఇక గాయపడిన జర్నలిస్టు ఎలా ఉన్నారని మోహన్ బాబు తరపు న్యాయవాదిని ధర్మాసనం అడిగింది. జర్నలిస్ట్ తరఫు న్యాయవాది పరిస్థితిని వివరించారు. వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.