MLC Kavitha: అది కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్

MLC Kavitha: ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ప్రజానాయకుడు కేసీఆర్కు రాజకీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని మరోసారి తేటతెల్లమైందని విమర్శించారు.
కాళేశ్వరం ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించిన బృహత్ ప్రాజెక్టు అని తెలంగాణ ప్రజల తరతరాల దాహార్తిని తీర్చడానికి, తెలంగాణ పొలాల్లోకి గోదావరి నీళ్లను గళగళా తరలించడానికి కట్టిన ప్రాజెక్టు అని కొనియాడారు.
తాను కలలు గన్న తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టే కాళేశ్వరం మని అన్నారు. రాజకీయ కక్షతో, కుట్రతో ఇచ్చిన ఈ నోటీసులు, వేసిన కమిషన్లు కాలక్రమంలో తప్పకుండా న్యాయాన్ని గెలిపిస్తాయని తెలిపారు. నిజాలన్నీ బయటకు వస్తాయని, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా తెలిపారు.