Jupally Krishna Rao: శంషాబాద్ విమానాశ్రయంలో మంత్రి జూపల్లి పర్యటన

Jupally Krishna Rao: శంషాబాద్ విమానాశ్రయంలో అతిథుల స్వాగత ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చే అతిథులకు విమానాశ్రయంలో తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలకాలని జూపల్లి ఆదేశించారు.
మిస్ వరల్డ్ వేడుకలకు వచ్చే సుందరీమణులు, ప్రతినిధులు, ఇతర అతిథులకు స్వాగత ఏర్పాట్లను మంత్రి జూపల్లి స్వయంగా పర్యవేక్షించారు. జీఎంఆర్ ప్యాసెంజర్ ఎక్స్పీరియన్స్ , పర్యాటక శాఖ, కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్, సీఐఎస్ఎఫ్ అధికారులతో సమీక్షించారు. విమానాశ్రయాన్ని మరింత అందంగా ముస్తాబు చేయాలని, పూలు, మామిడి, అరటి తోరణాలతో సుందరంగా అలంకరించాలని సూచించారు.
ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ క్లియరెన్స్ను త్వరగా పూర్తి చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్వాగత బృందాల సంఖ్యను పెంచాలని చెప్పారు. అడుగడుగునా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని తెలిపారు. అదే సమయంలో ఎయిర్పోర్ట్కు వచ్చిన మిస్ ఇండియా నందిని గుప్తా, మిస్ మెక్సికో మార్లే లీల్ సర్వాంతేస్తో భేటీ అయ్యారు. తెలంగాణలోని వారసత్వ చారిత్రక కట్టడాలను సందర్శించాలని వారిని కోరారు.