Patancheru: పారిశ్రామికవాడలో భారీ పేలుడు.. ఆరుగురు కార్మికులు మృతి

Patancheru: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవదహనం అయ్యారు. ప్రమాదం లో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇప్పటికీ పరిశ్రమలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పేలుడు ధాటికి ఓ భవనం కుప్పకూలగా మరో భవనానికి బీటలు వారాయి. మరోవైపు సహాయక సిబ్బంది శిథిలాలను తొలగిస్తుంది.
ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. ఘాటైన వాసనతో స్థానిక ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో చుట్టుపక్కలవారిని అధికారులు హుటాహుటీన ఖాళీ చేయిస్తున్నారు. ఇక ఘటనాస్థలానికి ఎవరూ రావొద్దని అధికారుల ప్రజలకు హెచ్చరించారు.
మరోవైపు ఘటనా స్థలానికి సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్, ఎస్పీ, డీఐజీ, ఐజీ, స్థానిక ఎమ్మెల్యే చేరుకున్నారు. ప్రస్తుత పరిస్థితిని దగ్గరుండి పరిశీలిస్తున్నారు. సహాయకచర్యల్లో కూడా పాల్గొన్నారు. ఇక కాసేపట్లో ఘటనా స్థలానికి బీఆర్ఎస్ సీనియర నేత, మాజీ మంత్రి హరీష్ రావు కూడా చేరుకోనున్నారు.