Manchu Manoj: చంద్రగిరి పోలీస్ స్టేషన్కు మంచు మనోజ్

Manchu Manoj: నటుడు మంచు మనోజ్ తిరుపతి జిల్లాలోని చంద్రగిరి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో డీఎస్పీని కలిశారు. తిరుపతిలోని మోహన్బాబు యూనివర్సిటీకి తాను వెళ్లినప్పుడు చోటుచేసుకున్న పరిణామాల గురించి పోలీసులతో చర్చిస్తున్నట్లు సమాచారం.
అంతర్గత కలహాలతో మోహన్బాబు కుటుంబం కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తన కుటుంబ పెద్దలకు నివాళులు అర్పించేందుకు నిన్న సాయంత్రం మోహన్బాబు వర్సిటీ వద్దకు మనోజ్ దంపతులు చేరుకున్నారు. ఈ సమయంలో ఒకింత ఉద్రిక్తత చోటుచేసుకుంది. మనోజ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
అయితే తన తాత, నాయనమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలి? అంటూ ఆయన పోలీసులను ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్సిటీలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అనంతరం మనోజ్ దంపతులు బందోబస్తు మధ్య తన తాత, నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఈ క్రమంలో మనోజ్, విష్ణు బౌన్సర్ల మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితిని అదుపుచేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.