Mallikarjun Kharge: బీహార్ ఎన్నికల తర్వాత మోడీ అవినీతి పాలనకు ముగింపు పలుకుతాయి

Mallikarjun Kharge: బీహార్ రాజధాని పాట్నాలో సీడబ్ల్యూసీ భేటీ అయ్యింది. సదాకత్ ఆశ్రమంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో పాటు సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్ర సీఎంలు, రాష్ట్రాల అధ్యక్షులు హాజరయ్యారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశంలో మోడీ ప్రభుత్వ అవినీతి పాలన ముగింపుకు నాంది పలుకుతాయని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. బీజేపీ మతతత్వ రాజకీయాలపై బీహార్ ప్రజలు ఆసక్తి చూపడం లేదని, అభివృద్ధి, సంక్షేమం ఆధారంగా రాజకీయాలను కోరుకుంటున్నారని అన్నారు. బీహార్లో ఎన్డీఏ కూటమిలో లుకలుకలు మొదలయ్యాయని సీఎం నితీష్ కుమార్ను బీజేపీ ఒక భారంగా భావిస్తోందని ఆరోపించారు.
ఓట్ చోరీ విషయంలో ఎన్నికల కమిషన్ నిష్పాక్షికత, పారదర్శకతపై ఆందోళనలు తలెత్తుతున్నాయని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఓట్ చోరీపై రాహుల్ గాంధీ లేవనెత్తే విషయాలను పరిష్కరించకుండా అఫిడవిట్లు సమర్పించాలని ఈసీ ఒత్తిడి చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు.



