నేడు మాలెగావ్ బాంబు పేలుడు కేసు తీర్పు

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న 2008 మాలేగావ్ బాంబు పేలుడు కేసులో ఎట్టకేలకు తీర్పు వెలువడనుంది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. ఈ తీర్పు కోసం దేశ ప్రజలు, ముఖ్యంగా బాధితులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ కేసులో లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, బీజేపీ మాజీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్, రిటైర్డ్ మేజర్ రమేశ్ ఉపాధ్యాయ సహా మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నారు. వీరిపై అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్, పలు సెక్షన్లలో తీవ్రమైన నేరారోపణలు నమోదయ్యాయి. ప్రస్తుతం వీరంతా బెయిల్పై బయట ఉన్నారు. తీర్పు రోజున నిందితులందరూ కోర్టులో తప్పనిసరిగా హాజరు కావాలని, గైర్హాజరైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు ఇప్పటికే ఆదేశించింది.
ఈ ఏడాది ఏప్రిల్ 19న ప్రాసిక్యూషన్, డిఫెన్స్ నుంచి తుది వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. లక్షకు పైగా పేజీల సాక్ష్యాలు, డాక్యుమెంటేషన్ ఉన్నందున, తీర్పు రాసేందుకు అదనపు సమయం పట్టిందని కోర్టు పేర్కొంది.
2008 సెప్టెంబర్ 29న రంజాన్ నెలలో, నవరాత్రి పండుగ సందర్భంగా మహారాష్ట్రలోని మలేగావ్లో ఒక మసీదు సమీపంలో నిలిపి ఉంచిన మోటార్సైకిల్కు అమర్చిన బాంబు పేలింది. ఈ దారుణ ఘటనలో ఆరుగురు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ సున్నితమైన ప్రాంతంలో జరిగిన ఈ పేలుడు అప్పట్లో సామాజిక, రాజకీయ ఉద్రిక్తతలను తీవ్రంగా పెంచింది.
దశాబ్దకాలంగా సాగిన ఈ విచారణలో ప్రాసిక్యూషన్ మొత్తం 323 మంది సాక్షులను విచారించింది. అయితే, వీరిలో 34 మంది వాంగ్మూలం మార్చడం కేసులో ఒక ముఖ్యమైన మలుపు. మొదట్లో ఈ కేసును మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) దర్యాప్తు చేయగా, 2011లో ఇది ఎన్ఐఏకు బదిలీ అయింది. 2016లో ఎన్ఐఏ దాఖలు చేసిన చార్జ్షీట్లో ప్రగ్యా సింగ్ ఠాకూర్తో సహా కొందరు నిందితులకు సంబంధించి సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. అయినప్పటికీ, కోర్టు ఆమెపై విచారణ కొనసాగించాలని ఆదేశించింది.
దాదాపు 17ఏళ్ల తర్వాత వెలువడుతున్న ఈ తీర్పు దేశ భద్రత, న్యాయ వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మలేగావ్ నివాసులు, ముఖ్యంగా బాధిత కుటుంబాలు న్యాయం జరుగుతుందనే ఆశతో ఈ తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. భారతదేశ ఉగ్రవాద నిరోధక చరిత్రలో ఈ కేసు ఒక కీలక అధ్యాయంగా నిలిచిపోనుంది.