నేడు మరో అల్పపీడనం.. రేపు వాయుగుండంగా బలపడే అవకాశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన జారీ చేసింది. బంగాళాఖాతంలో వాయవ్య దిశగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం మరింత బలపడి రేపు బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
ఈ వాయుగుండం ఈనెల 3 ఉదయానికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని అధికారులు వివరించారు.సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.



