తెలంగాణ

తెలంగాణలో బిగ్ బ్లాస్ట్.. ఈ-కార్ రేసింగ్‌ కేసు విచారణకు గ్రీన్ సిగ్నల్.. కేటీఆరే టార్గెట్..!?

KTR E-Formula Car Racing Case: త్వరలోనే తెలంగాణలో బాంబులు పేలనున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టుగానే.. అందులో ఓ బాంబు బ్లాస్ట్ అయ్యేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. చాలా రోజులుగా ఆరోపణలు వస్తున్న.. ఈ-కార్ రేసింగ్ కేసు విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో.. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీకి మార్గం సుగమమైనట్టయింది.

తెలంగాణలో పరిస్థితులు రసవత్తరంగా మారుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపైనే స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. విద్యుత్ కొనుగోలు వ్యవహారం, కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలు, ఇలా గత ప్రభుత్వంపై ఏఏ విషయాల్లో ఆరోపణలు వెల్లువెత్తాయో వాటన్నింటిపై విచారణలు జరుపుతోంది. కాగా.. త్వరలోనే బాంబులు పేలనున్నాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ప్రకటనతో.. మరిన్ని అవినీతి వ్యవహారాలు బయటపడనున్నాయన్న చర్చ మొదలైంది.

మంత్రి అన్నట్టుగానే.. తెలంగాణలో బిగ్ బ్లాస్ట్‌కు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. ఈ-ఫార్ములా రేసు కోసం విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదలాయించారన్న కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ-ఫార్ములా రేసు నిధుల విషయంలో జరిగిన అవకతవకలపై విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. మీడియా చిట్‌చాట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. న్యాయనిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపినట్టుగా పేర్కొన్నారు. సీఎస్‌ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని వెల్లడించారు. కేటీఆర్‌ను అరెస్టు చేస్తారా లేదా అన్నది తనకు తెలియదంటూ దాటేసే ప్రయత్నం చేశారు.

దీంతో.. రేపు (డిసెంబర్ 17న) ఏసీబీకి సీఎస్ శాంతి కుమారి లేఖ రాయనున్నారు. ఏసీబీకి వెంటనే లేఖ రాయాలని సీఎస్‌ను మంత్రి వర్గం కూడా ఆదేశించింది. ఈ-రేసింగ్ ఏజెన్సీ, నిర్వాహకులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

ఈ-ఫార్ములా రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారించేందుకు రేవంత్ సర్కారు గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మను అనుమతి కోరుతూ లేఖ రాయగా.. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి మంజూరు చేశారు. ఏసీబీ అధికారులు త్వరలోనే.. నోటీసులు జారీ చేయనున్నారు.

ఇక, 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఈ-ఫార్ములా కారు రేసు నిర్వహణకు సంబంధించిన రూ.55 కోట్ల చెల్లింపులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కేటీఆర్ విచారణకు సంబంధించి దాదాపు నెల రోజుల క్రితమే గవర్నర్‌ను నుంచి రాష్ట్ర సర్కారు అనుమతి కోరుతూ వస్తోంది. ఈ క్రమంలో న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఇందుకు గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేటీఆర్‌ను ఏసీబీ విచారించనుంది. ఇందులో కేటీఆర్‌తో పాటు అప్పుడు హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా ఉన్న కార్యదర్శి అరవింద్ కుమార్‌ పేరు కూడా వినిపిస్తోంది.

అయితే.. ఇప్పటికే ఈ కేసులో తన పేరు వినిపిస్తున్న నేపథ్యంలో.. కేటీఆర్ బహిరంగంగానే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తోందని.. తాను కూడా అరెస్టుకు సిద్ధమేనని.. యోగా మ్యాట్, షూస్ కొనుక్కుని రెడీగా ఉన్నానని.. తర్వాత వచ్చి రాష్ట్రంలో పాదయాత్ర చేసుకుంటానంటూ చమత్కరించారు. అంతేకాకుండా.. ఈ- రేసింగ్ వ్యవహారంలో తనపై ప్రభుత్వం కొత్తగా ఆరోపణలు చేసేదేముందని.. ఏం జరిగిందో తానే స్వయంగా చెప్తున్నా కదా అంటూ కేటీఆర్ వివరించటం గమనార్హం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button