KTR: గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలు.. అర్థసత్యాలే

KTR: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోని గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో అన్నీ అబద్దాలు అర్థసత్యాలే ఉన్నాయని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం గాంధీభవన్ కార్యకర్త ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 శాతానికి మించి ఎక్కడా రైతు రుణమాఫీ చేయలేదన్నారు. రుణమాఫీ అయిపోయిందని గవర్నర్ నోటితో అబద్దాలు చెప్పించారని నిప్పులు చెరిగారు.
కేసీఆర్పై గుడ్డి కోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టడం లేదని అన్నారు. ఇటీవలే 20 శాతం కమీషన్ను నిరసిస్తూ కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ ఎదుట నిరసనకు దిగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పుల చేస్తే రేవంత్ సర్కార్ ఒక్క ఏడాదిలోనే రూ.లక్ష 13 వేల కోట్ల అప్పు చేసిందని అన్నారు.
రేవంత్ రెడ్డి వల్లే వరి ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్వన్ అయిందంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం బాధాకరమని ఫైర్ అయ్యారు. లక్షన్నర కోట్ల అప్పు చేసి ఒక్క పథకం కూడా ప్రారంభించని సీఎం రేవంత్ రెడ్డి ఒక్క హామీ అమలు చేయకుండా రూ.లక్ష 62 వేల కోట్లు అప్పులు చేసిన రేవంత్ సర్కార్ను గవర్నర్ మందలిస్తారని అనుకున్నామని అన్నారు. దావోస్లో రూ.లక్ష 72 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అబద్ధం చెప్పించారని కేటీఆర్ ఆరోపించారు.