KTR: రాష్ట్రంలో ప్రజాపాలన పరాకాష్టకు చేరింది

KTR: తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పరాకాష్టకు చేరిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. విషాదంలోనూ మంత్రులు వినోదం పొందుతున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. హెలికాప్టర్ యాత్రలు చేస్తూ చేపకూర విందులతో ఎంజాయ్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ మంత్రులపై విమర్శల వర్షం కురిపించారు.
విద్యార్థులకు కనీసం తిండి పెట్టలేని దుస్థితిలో రేవంత్ ప్రజా ప్రభుత్వం ఉందన్నారు. అన్నం వండలేదు గుడిలో తినండి అని విద్యార్థులకు ఆదేశాలు ఇవ్వడం దారుణమన్నారు. నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలం కొండనాగుల ఎస్టీ బాలుర హాస్టల్లో శివరాత్రి పండుగ రోజు 380 మందికి గాను 200 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే మధ్యాహ్న భోజనం గుదిబండ శివాలయంలో చేసే అన్నదానానికి వెళ్ళి తినాలని అన్నారు.
రాత్రి భోజనం కోసం గంగమ్మ దేవాలయంలో అన్నదానానికి వెళ్లాలని హాస్టల్ సిబ్బంది వంట చేయడం మానేశారని కేటీఆర్ తెలిపారు. భోజనం కోసం అంత దూరం నడిచి వెళ్ళే ఓపిక లేక విద్యార్థులు పస్తులు ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. పండగపూట విద్యార్థులను పస్తులుంచడమే ప్రజాపాలనా అని కేటీఆర్ ప్రశ్నించారు.