కోఠి కాల్పుల కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులంతా అరెస్ట్

కోఠి ఎస్బీఐ ఏటీఎం వద్ద గత నెలలో కాల్పులు జరిగిన కేసును టాస్క్ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఈ కాల్పులకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వారిని పోలీసులు విచారిస్తున్నారు.
జనవరి 31న కోఠి ఎస్బీఐలో నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రిన్షద్ అనే వ్యక్తి వచ్చాడు. అతడిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. అనంతరం అతడి వద్దనున్న రూ. 6 లక్షల నగదుతో పాటు బాధితుడి వాహనాన్నీ తీసుకుని పరారయ్యారు.
తాజాగా నిందుతులందరినీ టాస్క్ఫోర్స్ టీమ్ అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు నిందితుల నుంచి ఓ వెపన్ కూడా రికవరీ చేశారు. ఫిబ్రవరి 16న కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిని ఇప్పటికే టాస్క్ఫోర్స్ పోలీసులు హర్యానాలో చాకచక్యంగా పట్టుకున్నారు.
అతడు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ఉత్తరప్రదేశ్లో గాలించగా అతడిని ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. దీంతో కేసులో నిందితులంతా పట్టుబడినట్లైంది. ఈ మేరకు వారిని ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.



