తెలంగాణ

కాంట్రవర్సీకి కేరాఫ్‌గా కొండా కపుల్స్

వారిద్దరూ భార్యా భర్తలు. ఆపై రాజకీయ నేతలు. భార్య మంత్రి, భర్త మాజీ ఎమ్మెల్సీ. ఆ జిల్లాలో ఒకప్పుడు వారి హవా నడిచింది. అయితే ప్రస్తుతం మాత్రం పరిస్థితులు మారిపోయాయట. వారు ఏం మాట్లాడినా వివాదమే అవుతోందట. వారు చేస్తున్న కామెంట్స్.. సొంత పార్టీలోనే మంటలు రేపుతున్నాయట. ఇంతకూ కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారిన ఆ నేతలెవరు..? వారు చేస్తున్న వ్యాఖ్యలపై గొడవలెందుకు..? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..

కాంట్రవర్సీకి కేరాఫ్‌గా కొండా దంపతులు మారారట. వారు కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారా లేదా వారు మాట్లాడిందే కాంట్రవర్సీ అవుతుందా అనేది తెలియడం లేదట కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు. వారి మాటలతో ప్రభుత్వాన్ని, సొంత పార్టీని, నాయకులను చిక్కుల్లో పడేస్తున్నారట కొండా దంపతులు. కొండా దంపతుల నోటి దూలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజు రోజుకూ పార్టీపై ప్రజల్లో పట్టు కోల్పోతోందట.

తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా కావాలనే మాట్లాడుతున్నారా పొరపాటుగా మాట్లాడుతున్నారా పార్టీ శ్రేణులకు అర్థం కావడం లేదట. సొంత పార్టీపై, నాయకులపైన ప్రజల్లో విశ్వాసం కోల్పోయేలాగా వీరి వ్యవహార శైలి ఉంటోందట. కొండా దంపతుల వ్యవహార శైలి కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదృష్టం కలిసొచ్చో, సమీకరణాల పుణ్యమో కానీ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖకు మంత్రి పదవి వచ్చింది. రాష్ట్ర మంత్రిగా ఆచితూచి మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులను కలుపుకొని ముందుకు వెళ్లి పార్టీకి బలం చేకూర్చాల్సి ఉండగా నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో ప్రజల్లో చులకన అవుతున్నారు.

తొందరపాటో, నోటి దూలనో తెలియదు కానీ మొన్నటి వరకు కొండా సురేఖ మాటలతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడింది. ఒక దశలో కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు కొండా సురేఖ భర్త కొండా మురళి పార్టీ నాయకులపైన చేసిన అనుచిత వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి.

గతంలో కొండా సురేఖ.. కేటీఆర్‌ని టార్గెట్ చేయబోయి అక్కినేని నాగార్జున కుటుంబం గురించి మాట్లాడి రాష్ట్రవ్యాప్తంగా అప్రతిష్ట మూటకట్టుకుంది. అది మరువక ముందే మంత్రులు లంచాలు తీసుకుంటారని బహిరంగంగానే మాట్లాడి కాంగ్రెస్ పార్టీని, మంత్రులందరినీ ఇరుకున పడేసింది. ఇప్పుడు సురేఖ భర్త కొండా మురళి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆగ్రహానికి గురయ్యారు. దీంతో కొండా సురేఖ, కొండా మురళిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌కి ఫిర్యాదు చేశారు. అధిష్టానానికి మేము కావాలా కొండా ఫ్యామిలీ కావాలా తేల్చుకోండని అల్టిమేటం జారీ చేశారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయేలాగా కొండా దంపతుల వ్యవహార శైలి ఉందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తుకుంటున్నారట. చింత చచ్చినా పులుపు చావదన్న చందాన ఒకప్పటి రాజకీయాలు నేడు లేకపోయినప్పటికీ ఇంకా గతంలో వ్యవహరించిన లాగానే దురుసుగా, లెక్కలేకుండా ఆవేశ నిర్ణయాలతో రోజురోజుకీ ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా కొండా దంపతులు వ్యవహరిస్తున్నారట. హైకమాండ్ అనేది ఒకటి ఉంది. కొంత క్రమశిక్షణతో నడుచుకోవాలనే ఆలోచన వీరికి లేనట్లుంది. వరుసగా పార్టీలు మారుతూ ఇక్కడ నచ్చకపోతే అక్కడ అన్నట్లుగా వీరి వ్యవహార శైలి ఉందని నాయకులు వాపోతున్నారు.

కొండా అభిమానుల వెర్షన్ మాత్రం మరోలా ఉంది. కొండా సురేఖను వేధింపులకు గురి చేస్తున్నారని మంత్రి, ఒక మహిళ అని కూడా చూడకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తనను టార్గెట్ చేస్తున్నారని వాపోతున్నారు. అది భరించలేకనే కొండా సురేఖ, కొండా మురళీ ఆవేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని సమర్థించుకుంటున్నారు.

మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రాష్ట్రవ్యాప్తంగా రచ్చకెక్కింది. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్లలో వాళ్లే విమర్శించుకుంటూ ప్రజల్లో చులకన అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రతిపక్షాలను, ఆనాటి ప్రభుత్వ పెద్దలను టార్గెట్ చేయాల్సిన వాళ్లు ఇదే పద్దతి కొనసాగిస్తే రానున్న స్థానిక ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.

మంత్రిగా ఉమ్మడి జిల్లాలోని అందరు నేతలను కలుపుకుపోవాల్సిన బాధ్యత కొండా సురేఖపై ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. మిగతా నాయకులు కూడా కలసి పని చేయాల్సిన అవసరముందంటున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం వీరి మధ్య సయోధ్య కుదిర్చి తిరిగి ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న వైభవాన్ని పునరుద్ధరించాలంటున్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు దిశగా నడిచేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అభిమానులు కోరుతున్నారు.

మొత్తానికి కొండా దంపతుల వ్యవహార శైలి అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి నష్టం చేకూరుస్తోందని కాంగ్రెస్ శ్రేణులు వాపోతున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం కొండా దంపతుల వివాదానికి ఏ విధంగా ఫుల్‌స్టాప్ పెడుతుందో వేచి చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button