తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం జిల్లా స్పెషల్

తెలంగాణ రాజకీయాల్లో ఆ జిల్లా ఎంతో ప్రత్యేకం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. అన్ని పదవులు ఆ జిల్లావే.. రాష్ట్రమంతా అక్కడే ఉందని.. పదేపదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఆ జిల్లా పేరు వినగానే కేటాయించిన పదవులు ఆయనకి గుర్తొస్తున్నాయట. ముఖ్యమైన మంత్రి పదవులన్నీ ఆ జిల్లాకే ఇచ్చారట. మరి ఆ జిల్లాలో అదే స్థాయిలో అభివృద్ధి జరుగుతుందా..? సీఎం చెప్తున్నట్లు నిజంగానే పదవులన్నీ జిల్లాలోనే ఉంటే.. పదవులు ఇవ్వండి మహాప్రభువో అంటూ ఎందుకు నేతలు గగ్గోలు పెడుతూ పోటీ పడుతున్నారు..? ఇంతకీ ఆ జిల్లా ఏది..? ఎవరా మంత్రులు..? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..
తెలంగాణ రాజకీయాల్లోనే ఖమ్మం జిల్లా రాజకీయం ప్రత్యేకమైనది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఆయువు పట్టుగా ఉందనడంలో సందేహం లేదు. అయితే స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ఖమ్మం జిల్లాలో 2014 నుంచి వరుసగా మొన్నటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ జిల్లాలో ప్రతి సారి బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటే దక్కుతూ వచ్చింది.
బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ఖమ్మం గుమ్మంలో కోట్లాది రూపాయలు గుమ్మరించినా జిల్లా ప్రజలు మాత్రం మద్దతు ఇవ్వలేదనేది జగమెరిగిన సత్యం. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలకు మాత్రం ఖమ్మం జిల్లా ప్రజలు ప్రతి ఎన్నికల్లో పట్టం కడుతూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో హస్తం పార్టీకి జై కొట్టారు ఖమ్మం జిల్లా ప్రజలు.
కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ లాంటి ఖమ్మం జిల్లాకు ప్రస్తుతం కీలక ఫోర్ట్ఫోలియోలను అధిష్టానం కట్టబెట్టింది. ఉపముఖ్యమంత్రి పదవితో పాటు ఆర్థిక, రెవెన్యూ, హౌసింగ్, వ్యవసాయ శాఖలను ఖమ్మం జిల్లా మంత్రులకు ఇచ్చారు. ఖమ్మం జిల్లా నేతలను కాదనే పరిస్థితిలో కాంగ్రెస్ అధినాయకత్వం లేదట.
అందుకే ముఖ్యమంత్రి కూడా ఖమ్మంకు ఉన్న ప్రాధాన్యతను తరచూ గుర్తు చేస్తూనే ఉంటున్నారట. ఇటీవల నేలకొండపల్లిలోని ఓ రైతుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ కీలకమైన మంత్రి పదవులన్నీ మీ జిల్లాకే ఇచ్చామని చెప్పుకొచ్చారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం ఇటీవల జిల్లాకు వచ్చిన సందర్భంగా పార్టీకి ఆయువుపట్టు లాంటి జిల్లా కాబట్టే కీలకమైన మంత్రి పదవులు దక్కాయని చెప్పుకొచ్చారు. అయితే.. ముఖ్యమైన పోర్ట్ఫోలియోలు కట్టబెట్టినా కీలక మంత్రుల ప్రాతినిధ్యం ఉన్నా ఖమ్మం జిల్లాలో అదే స్థాయిలో అభివృద్ధి జరుగుతుందా అంటే జనం పెదవి విరుస్తున్నారట.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖమ్మం జిల్లా అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన సీతారామ ప్రాజెక్టు ప్రస్తుతం నత్తనడకన సాగుతోందట. ఈ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ సమస్యగా మారిందట. సీతారామ ప్రాజెక్టు వైరా రిజర్వాయర్ వరకు 100 కోట్లతో కాలువలు నిర్మించినా నీళ్లు వచ్చేది అనుమానమేనట. అంతేకాదు సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి పెండింగ్లో పడిందట. అటు భద్రాద్రి ఆలయానికి గోదారి ముంపు తప్పేలా చర్యలు లేవట.
ఇటు కొత్తగూడానికి విమానాశ్రయం అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అంటున్నా ఆ ప్రతిపాదన ముందుకు సాగడం లేదట. సింగరేణి బొగ్గు తవ్వకాల్లో కొత్త గనులకు ఇంకా అనుమతులు రావడం లేదట. దీంతో కార్మికులు డీలా పడుతున్నారట. భద్రాచలం రామాలయం యాదాద్రిలా అభివృద్ధి చెందుతుందని అంతా ఆశపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్లక్ష్యానికి గురైన భద్రాచల పుణ్యక్షేత్రానికి కాంగ్రెస్ హయాంలో మంచి జరుగుతుందని అందరూ భావించారు. అయితే ఇప్పటికీ భద్రాచలం రామాలయం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉందట.
ముగ్గురు మంత్రులున్నా ఖమ్మం జిల్లాలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదనే భావనలో ప్రజలు ఉన్నారట. ఖమ్మం జిల్లాకు పదవుల్లో పెద్దపీట వేశామంటుంది కాంగ్రెస్ అధిష్టానం. మరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కార్యకర్తలు మాత్రం తమకు పదవులు ఎప్పుడని అడుగుతున్నారట. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మూడు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వెన్నుదన్నుగా నిలిచారు కార్యకర్తలు.
అయితే అధికారం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా కార్యకర్తలు మాత్రం పదవులు లేక కొట్టుమిట్టాడుతున్నారట. కొందరు సీనియర్లు సైతం అసంతృప్తిగానే ఉన్నారట. ప్రభుత్వంలో చక్రం తిప్పే ముగ్గురు మంత్రులు ఉన్నా వారి చేతుల్లో కీలక శాఖలు ఉన్నా.. జిల్లాను చూస్తే భయమేస్తోందట. అటు జిల్లాలో అభివృద్ధి జరగడం లేదట ఇటు కాంగ్రెస్ కార్యకర్తలకు ఆశించిన పదవులు రావడం లేదట.
మొత్తానికి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిస్థితి తయారైందట. ఓ వైపు అభివృద్ధి జరగడం లేదని ప్రజలు అంటుంటే పార్టీ కోసం కష్టపడ్డ తమకు పదవులు రావడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నారు. మరి ఇప్పటికైనా మంత్రులు ఖమ్మం జిల్లాపై ఫోకస్ పెడతారా జిల్లా ప్రజల అభీష్టం నెరవేరుతుందా.. లేదా.. వేచి చూడాలి.