Tamannaah: తమన్నాపై కన్నడిగుల ఆగ్రహం..!

Tamannaah: మైసూర్ శాండల్ సబ్బు బ్రాండ్ అంబాసిడర్గా తమన్నా భాటియా నియామకం కర్ణాటకలో వివాదాస్పదమైంది. కన్నడ సంఘాలు, బీజేపీ నేతలు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. స్థానిక నటీమణులను కాదని, తమన్నాను ఎంచుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపడుతున్నారు.
కర్ణాటక సంస్కృతికి ప్రతీకగా నిలిచిన మైసూర్ శాండల్ సబ్బు బ్రాండ్ తాజాగా వివాదంలో చిక్కుకుంది. 1916లో మైసూర్ మహారాజు కృష్ణరాజ వడయార్ స్థాపించిన ఈ బ్రాండ్ అంబాసిడర్గా నటి తమన్నా భాటియాను కర్ణాటక ప్రభుత్వం ఎంపిక చేయడం రాజకీయ దుమారం రేపింది. రూ.6.2 కోట్లతో రెండేళ్ల ఒప్పందంపై తమన్నాను నియమించగా, కన్నడ సంఘాలు, స్థానిక కార్యకర్తలు, బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కన్నడ నటీమణులను పక్కనపెట్టి, ముంబైలో జన్మించిన తమన్నాను ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నిస్తూ ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణ గౌడ్రు ఈ నిర్ణయాన్ని కన్నడిగుల మనోభావాలకు విరుద్ధమని విమర్శించారు. ఈ నిధులను విద్య, ఆరోగ్య రంగాలకు వినియోగించాలని విపక్షాలు సూచిస్తున్నాయి. అయితే, మంత్రి ఎంబీ పాటిల్ సమర్థిస్తూ, తమన్నా పాన్-ఇండియా ఇమేజ్, 28 మిలియన్ డిజిటల్ ఫాలోవర్స్ బ్రాండ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాయని, 2028 నాటికి రూ.5,000 కోట్ల ఆదాయం తమ లక్ష్యమని వెల్లడించారు.