Telangana: నీళ్లు… నిధులు… నియామకాలు… తెలంగాణ ఉద్యమ పొలికేకలివి

తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాకరేపుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర విమర్శలు ప్రతివిమర్శలు జరుగుతున్నాయి. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్, కేసీఆర్ అంతా కూడా ప్రజా ధనాన్ని దోచుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ పేరును బద్నాం చేయాలనే కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలు చేస్తోందని, కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీకి అయిన డ్యామేజీని కాంగ్రెస్ రిపేయిర్ చేసుండొచ్చని కూడా బీఆర్ఎస్ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా ఇన్నాళ్లూ మాటలతోనే సమాధానాలు చెప్తూ వచ్చిన బీఆర్ఎస్.. తాజాగా పోరుబాట పట్టాలని ఫిక్స్ అయింది. ఈ ఆరేళ్లతో ప్రాజెక్టు సాధించిన ఘనత వివరించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది.
నీళ్లు… నిధులు… నియామకాలు… తెలంగాణ ఉద్యమ పొలికేకలివి. దశాబ్దాల అస్తిత్వ ఉద్యమంలో తొలి పోరు నీళ్ల కోసమే. ఆ జల… ఆశయమే ఇప్పుడు… అనేక జలాశయాలుగా అవతరించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్పై కాంగ్రెస్ ఆరోపణలకువ్యతిరేకంగా జంగ్ సైరన్ మోగిస్తోంది గులాబీదళం. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. జూన్ 21న రాష్ట్రంలో ఉన్న బ్యారేజీలు, రిజర్వాయర్ల దగ్గర నిరసన చేయనున్నారు. మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ఇప్పటికే కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రేవంత్ సర్కార్ ఆరోపణలను తిప్పికొట్టారు. రిపేర్లు చేయిస్తే సరిపోయేదానికి కావాలనే కాంగ్రెస్ రాద్దాంతం చేస్తోందని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడింది.
కాళేశ్వరం అంటే… 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్ల, 21 పంపుహౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలో మీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలో మీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిప్టు, 240 టీఎంసీల వినియోగం అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందుకు సంబంధించిన వివరాలను సైతం నేతలకు పంపించారు. కాళేశ్వరంతో 37లక్షల ఎకరాల ఆయకట్టును స్థీరీకరించమనే వివరాలను ప్రజలను వివరించనున్నారు.
2014లో కోటి 31లక్షల 34 వేల ఎకరాలకు నీరందింస్తే, కాళేశ్వరంతో 2023 నాటికి 2 కోట్ల 20లక్షల ఎకరాలకు నీరందించిన విషయాన్ని విస్తృత ప్రచారం చేయనున్నారు. ధాన్యం ఉత్పత్తిలోనూ 2014లో 68లక్షల టన్నుల నుంచి 2023లో 2కోట్ల 70లక్షల టన్నుల దిగుబడి సాధించామని, అన్నిరకాల పంటల దిగుబడిలోనూ 2013-14లో ఒక కోటి 7లక్షల 49 వేల టన్నులు, 2022–23లో 4కోట్ల 65లక్షల 24వేల 336 టన్నుల దిగుబడి సాధించామని, నాలుగు రేట్లు పెరుగుదల సాధించిన విషయాన్ని వివరించేందుకు సిద్ధమవుతున్నారు.
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, బ్యారేజీలో పిల్లర్ల కుంగుబాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అని విమర్శలకు పదును పెట్టింది. దానిపై వేసిన పీసీ ఘోష్ కమిషన్ సైతం విచారణ చేపట్టింది. అయితే, గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుతో సాధించిన ఘనతను బద్నాం చేయాలనే ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రిజర్వాయర్, బ్యారేజీల వద్ద పార్టీ ఎమ్మెల్యేలు, మాజీలు వెళ్లి అక్కడ పరిశీలించడంతో పాటు వాటి ఘనతను వివరించనున్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు సైతం గంధమల్ల గానీ, బస్వాపూర్ గానీ లేకుంటే, మల్లన్నసాగర్ ఇలా ఏదో ఒక దగ్గరకు వెళ్లి పరిశీలించి ప్రజలకు బీఆర్ఎస్ చేసిన మంచి పనులు వివరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై పలు మార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు
స్పాట్ విజువల్స్
కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు పిన్ టు పిన్ కౌంటర్ ఇచ్చింది గులాబీదళం. ప్రాజెక్టు తెలంగాణకు జీవధార లాంటిదన్నారు బీఆర్ఎస్ నేతలు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదన్నారు. 2 పిల్లర్లు కుంగితే ప్రాజెక్ట్ మొత్తం కుంగినట్టు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ బృందం వెళ్లనుంది. దీంతో ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు ప్రాజెక్టు సందర్శనకు వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలితే కాంగ్రెస్ రాద్దాంతం చేస్తుందని, మరమ్మతులు చేయకుండా ప్రాజెక్టును ఎండబెడుతూ యాసంగిలో రైతు పొలాలను ఎండబెట్టి కన్నీళ్లు మిగుల్చిందని బీఆర్ఎస్ మండిపడుతున్నది. ఇదే విషయాన్ని మరోమారు ప్రజలకు వివరించాలని అందుకు జూన్ 21న ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
మేడిగడ్డ ప్రాజెక్ట్లో రెండు పిల్లర్లకు జరిగిన కుంగుబాటును చూపుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా నిరుపయోగం అయిందంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. వీటికి వ్యతిరేకంగానే బీఆర్ఎస్ నేతలు, స్థానిక రైతులు, ప్రజలతో కలిసి ప్రాజెక్ట్ల దగ్గర నిరసన చేయాలని పార్టీ నిర్ణయించింది. అదే సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్ పర్యటనలో ఉన్నారు. దీంతో ఆ నిరసనలకు హరీష్ రావు నేతృత్వం వహిస్తారు.