వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదముద్ర

కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణకు లైన్ క్లియర్ అవ్వడంతో అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే.. దీనిపై కాంగ్రెస్, సమాజ్ వాదీ, తృణముల్ కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం సహా ముస్లిం పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. తమ సవరణలను తిరస్కరించారంటూ విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. జనవరి 28 నాటికి ముసాయిదా నివేదిక పంపణీ చేస్తామని, ఆ తర్వాత జనవరి 29న అధికారికంగా ఆమోదం తెలుపుతామని జేపీసీ ప్రకటించింది.
వక్ఫ్ సవరణ బిల్లుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పార్లమెంట్ ముందుకు రాబోతోంది. కమిటీలోని ఎన్డీయే సభ్యులు ప్రతిపాదించిన అన్ని సవరణలకు జేపీసీ ఆమోదం తెలిపింది. అయితే.. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన ప్రతీ మార్పును కమిటీ తిరస్కరించింది. బిల్లులో 14 నిబంధనలలో ఎన్డీయే సభ్యులు ప్రతిపాధించిన సవరణలు ఆమోదించినట్లు పార్లమెంటరీ ప్యానెల్ ఛైర్మన్ అయిన బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ తెలిపారు.
కాగా.. వక్ఫ్ సవరణ బిల్లుకు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన ప్యానెల్కు బీజేపీ ఎంపీ జగదాంబి పాల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆయన సమక్షంలో జేపీసీ కమిటీ సమావేశమైంది. విపక్ష ఎంపీలు సహా ఇతరులు మొత్తంగా 44 మార్పులు సూచించగా.. 14 సవరణలను కమిటీ ఆమోదించినట్లు ప్యానెల్ ఛైర్మన్ జగదాంబిక పాల్ వెల్లడించారు. ఈ సవరణలు చట్టాన్ని మరింత శక్తివంతంగా మారుస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక… వక్ఫ్ ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, జిల్లా కలెక్టర్లు కొందరిని అపాయింట్ చేయడానికి అధికారం ఇవ్వడంతో పాటు వక్ఫ్ ట్రిబ్యునల్లో సభ్యులను రెండు నుంచి మూడుకు పెంచడం వంటి సవరణలు ఉన్నాయి. ఈ రోజు క్లాజుల వారీగా జరిగి ఓటింగ్లో అధికార ప్రభుత్వానికి చెందిన 16 మంది ఎంపీలు సవరణకు అనుకూలంగా ఓటేయగా, 10 మంది ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. బిల్లులో మొత్తం 44 నిబంధనలను చర్చించగా, ప్రతిపక్షాలు చేసిన సవరణలు 10:16 మెజారిటీలో వీగిపోయాయి.
ప్రతిపక్ష ఎంపీలు జేపీసీని విమర్శిస్తున్నారు. జగదాంబికా పాల్ ప్రజాస్వామ్య ప్రక్రియను అణగదొక్కారని ఆరోపించారు. ఆయన నియంతృత్వ ధోరణితో వ్యవహరించాలని టీఎంసీ ఎంపీ కళ్యాన్ బెనర్జీ అన్నారు. అయితే, జగదాంబికా పాల్ ఈ ఆరోపణల్ని తిరస్కరించారు.
వక్ఫ్ బోర్డు నియంతృత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బిల్లు-2024ను ఆగస్టు 08న కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రవేశపెట్టారు. ముందుగా ఈ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ, విరణాత్మక పరిశీలన కోసం మరింత గడువు పెంచారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది.
సెంట్రల్, స్టేట్ వక్ఫ్ బోర్డుల్లో తప్పనిసరిగా మహిళలకు ప్రాతినిథ్యం కల్పించాలని కూడా ఈ బిల్లులో కేంద్రం పేర్కొంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణపై పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఈ బిల్లులో ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులు ఏదైనా భూమి లేదా ఆస్తిని తమదిగా ప్రకటించటం ద్వారా పలు వివాదాలు, అధికార దుర్వినియోగానికి కారణం అవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బిల్లు చట్టరూపం దాల్చితే.. వక్ఫ్ బోర్డులు ముందు లాగా ఏ ఆస్తిని స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించుకోలేవు.