క్రీడలు

బ్యాటింగ్‌పై రిపోర్టర్ ప్రశ్న.. బుమ్రా సమాధానం సూపర్! గూగుల్‌లో సెర్చ్ చేయాల్సిందే

Jasprit Bumrah Batting: గబ్బా టెస్టు మూడో రోజు ఆట తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా.. ఓ రిపోర్టర్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. గబ్బాలో బ్యాటింగ్ పరిస్థితుల గురించి సదరు రిపోర్టర్ బుమ్రాను ప్రశ్నించాడు. ఇది విన్న బుమ్రా.. నా బ్యాటింగ్‌ గురించి నన్ను అడగడం కాదు.. గూగుల్‌ని అడగండి తెలుస్తుంది.. అని కామెంట్‌ చేశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బుమ్రా ఈ సమాధానం చెప్పడం వెనుక కారణం తెలుసా?

గబ్బా టెస్టు మూడో రోజు ఆట ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు రిపోర్టర్ నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. గబ్బాలో బ్యాటింగ్ పరిస్థితుల గురించి బుమ్రాను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. రిపోర్టర్ అడిగిన ఓ ప్రశ్నకు భారత పేసు గుర్రం తనదైన శైలిలో బదులిచ్చాడు. ‘బుమ్రా బ్యాటింగ్‌పై మీ అంచనా ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే సరైన వ్యక్తి మీరు కాదని తెలుసు. అయినా గబ్బాలోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే జట్టు పరిస్థితి (బ్యాటింగ్) గురించి మీరు ఏమనుకుంటున్నారు?’ అని రిపోర్టర్ బుమ్రాను ప్రశ్నించాడు. దీనికి బుమ్రా బదులిస్తూ.. ‘మీరు ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. నా బ్యాటింగ్ కెపాసిటీని మీరు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం నేను చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్‌ని అడగండి. టెస్టుల్లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసింది ఎవరు? అని సెర్చ్‌ చేయండి. అప్పుడు మీకే ఆన్సర్ దొరుకుతుంది’ అని ఫన్నీగా సమాధానం ఇచ్చాడు.

బుమ్రా.. గూగుల్‌లో చూడు అని చెప్పడానికి ఆసక్తికర కారణం ఉంది. ఎందుకంటే టెస్టుల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు అతడి పేరిటే ఉంది. 2022లో ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో జస్‌ప్రీత్ బుమ్రా ఈ ఫీట్‌ సాధించాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఈ ఓవర్‌లో బుమ్రా ఏకంగా 35 పరుగులు రాబట్టాడు.

ఆ ఓవర్‌లో ఒక సింగిల్‌ సహా రెండు సిక్సర్లు (ఒకటి నోబాల్‌), 4 ఫోర్లు కొట్టాడు బుమ్రా. మరోవైపు ఓ బంతి వైడ్‌గా వెళ్లడంతో బౌండరీగా మారింది. దీంతో టెస్టు క్రికెట్‌లో ఇదే అత్యధిక పరుగులు వచ్చిన ఓవర్‌గా నిలిచింది.

ఇక గబ్బా టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగుల భారీ స్కోరు చేయగా.. బదులుగా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఫాలో ఆన్‌ ముప్పును తప్పించువాలంటే భారత్‌ కనీసం 246 పరుగులు చేయాల్సి ఉంది. ప్రధాన బ్యాటర్లు సహా.. జట్టులోని 11 మంది తలా ఓ చేయి వేస్తేనే ఈ స్కోరు సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. మరోవైపు.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కి వెళ్లాలంటే భారత జట్టు ఓడిపోకూడదు!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button