జగన్ కాన్వాయ్ లో కారు ఢీకొని వృద్ధుడు మృతి

Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో విషాదం చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్లోని వాహనం ఢీ కొట్టడంతో ఓ వృద్ధుడు మరణించాడు. గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పర్యటించేందుకు వైఎస్ జగన్ భారీ కాన్వాయ్తో తాడేపల్లి నుంచి బయలుదేరారు. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు వాహనాల ర్యాలీ నిర్వహించారు.
ఈ క్రమంలో ఏటుకూరు బైపాస్ వద్ద నడుచుకుంటూ వెళుతున్న ఓ వృద్ధుడిని జగన్ కాన్వాయ్లోని ఓ వాహనం ఢీ కొట్టింది. దీంతో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 కు సమాచారం అందించారు.
అంబులెన్స్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని వృద్ధుడిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మరణించాడని వైద్యులు తెలిపారు. కాగా, వృద్ధుడిని ఢీ కొట్టినా కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోవడంతో వైసీపీ నేతలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.