ISRO: నింగిలోకి GSLV-F15 రాకెట్ ప్రయోగం విజయవంతం

ISRO: ఇస్రో సెంచరీ కొట్టింది. అవును.. ఇస్రో చేపట్టిన చరిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ను ప్రయోగించారు. ఈ రాకెట్.. ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది.
NVS-02 ఉపగ్రహం.. ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2వేల 250కిలోలు. ఇది కొత్తతరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. ఇస్రో ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన వి.నారాయణన్కు ఇది మొదటి ప్రయోగం కావడంతో ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలనూ పర్యవేక్షించారు. ముఖ్యంగా నేవిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లోకేషన్ ఆధారిత సేవలందించనుంది.
ఇస్రో శాస్త్రవేత్తలకు ఛైర్మన్ నారాయణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని చెప్పారు. నావిగేషన్ శాటిలైట్ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఈ వందో ప్రయోగం మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఎన్వీఎస్-02 ఉపగ్రహం పదేళ్ల పాటు సేవలందిస్తుందని వెల్లడించారు.
విక్రమ్ సారాబాయ్ హయాం నుంచి ఇస్రో విజయ పరంపర కొనసాగింది. ఇప్పటి వరకు 6 జనరేషన్ల లాంచ్ వెహికిల్స్ అభివృద్ధి చేశాం. 1979లో అబ్దుల్ కలాం నేతృత్వంలో తొలి లాంచ్ వెహికిల్ ప్రయోగం జరిగింది. ఇప్పటివరకు శ్రీహరికోట వేదికగా 100 ప్రయోగాలు జరిగాయి. 100 ప్రయోగాల్లో 548 శాటిలైట్లను కక్ష్యలోకి పంపాం. 3 చంద్రయాన్, మాస్ ఆర్బిటర్, ఆదిత్య, ఎస్ఆర్ఈ మిషన్లు చేపట్టాం.’’ అని నారాయణన్ తెలిపారు.