అంతర్జాతీయం

Israel -Iran: ఇరాన్, పాక్ కు ముంచుకొస్తున్న ముప్పు

Israel -Iran: ఇరాన్‌లో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయి. ఓవైపు ఇజ్రాయెల్‌ క్షిపణుల మోత మోగిస్తుండగా అమెరికా ఎప్పుడు దాడి చేస్తుందో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఇరాన్‌ మరో సమస్యల వలలో చిక్కుకుంటోంది. ఈ పరిస్థితులు ఇరాన్‌తోపాటు, పాకిస్థాన్‌కు కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంతకీ ఇరాన్, పాక్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సమస్య ఏంటి..? దీనిపై ఆ రెండు దేశాలు ఎలా స్పందించనున్నాయ్.?

ఇరాన్‌లో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయి. ఓవైపు ఇజ్రాయెల్‌ క్షిపణుల మోత మోగిస్తుండగా.. అమెరికా ఎప్పుడు దాడి చేస్తుందో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఇరాన్‌ మరో సమస్యల వలలో చిక్కుకుంటోంది. ఓ వైపు బలోచిస్థాన్‌ వేర్పాటు వాదులు, మరోవైపు ఇరాన్‌ వేర్పాటువాదులు కాచుకొని కూర్చున్నారు.

సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. ఈ పరిస్థితులు ఇరాన్‌తోపాటు, పాకిస్థాన్‌కు కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇరాన్‌ బలహీనపడుతున్న వేళ, తమ ఆశయాన్ని సాధించుకోవడానికి ఇదే సరైన సమయమని ఇరాన్‌, పాకిస్థాన్‌లోని మిలిటెంట్ గ్రూప్‌లు పావులు కదుపుతున్నాయి.

ఇరాన్‌లో ఖమేనీ పాలనను అంతం చేసేందుకు అటు ఇజ్రాయెల్‌, ఇటు అమెరికా సిద్ధపడుతున్న సమయంలో పాకిస్థాన్‌లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇరాన్‌లోని కీలక ఇస్ఫహాన్ అణు కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. టెహ్రాన్‌ సహా ఇరాన్‌లోని ఇతర ప్రాంతాల్లోని పలు లక్ష్యాలపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది.

పశ్చిమ ఇరాన్‌లోని బాలిస్టిక్‌ క్షిపణుల తయారీ కేంద్రాలపైనా 25 యుద్ధ విమానాలతో దాడులు చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. రెండు దేశాలు బాంబుల వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాయి. టెల్‌ అవీవ్, హైఫా, బీర్‌షిబా నగరాలపై బాలిస్టిక్‌ క్షిపణులతో ఇరాన్‌ విరుచుకుపడింది.

ముఖ్యంగా బీర్‌షిబాలోని టెక్నాలజీ పార్కుపై దాడి చేసింది. ఈ ఘటనలో పలు భవనాలకు నష్టం వాటిల్లింది. మైక్రోసాఫ్ట్‌ కార్యాలయం సమీపంలో మంటలు ఎగసిపడ్డాయి. ఇజ్రాయెల్‌ సైన్యానికి చెందిన కీలక కార్యాలయాలు ఆ పార్కులో ఉన్నట్లు తెలుస్తోంది. హైఫా నగరంపై ఇరాన్‌ చేసిన మిసైల్‌ దాడిలో 23 మందికి గాయాలయ్యాయి.

మరోవైపు రాజధాని టెహ్రాన్, ఇరాన్‌లోని ఇతర ప్రాంతాల్లోని పలు లక్ష్యాలపై 60కు పైగా యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. ఇరాన్‌ రక్షణ పరిశోధనా సంస్థ కేంద్ర కార్యాలయానికీ నష్టం కలిగించింది. పశ్చిమ ఇరాన్‌లోని కెర్మన్‌షా, తబ్రీజ్‌ ప్రాంతాలలో ఉన్న బాలిస్టిక్‌ క్షిపణుల తయారీ కేంద్రాలపైనా 25 యుద్ధ విమానాలతో దాడులు చేసింది.

కాస్పియన్‌ సముద్రం సమీపంలో ఉన్న రాస్త్‌ నగరంపైనా బాంబులు వేసింది. ఇజ్రాయెల్‌ దాడుల్లో అరాక్‌ నగరంలో నిర్మాణంలో ఉన్న అణుకేంద్రానికి భారీగా నష్టం వాటిల్లిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తెలిపింది. కాస్పియన్‌ సముద్రం సమీపంలోని రాస్త్‌ నగరంపైనా టెల్‌అవీవ్‌ బాంబులతో విరుచుకుపడింది.

దాడులు జరిగిన ప్రదేశంలో అణ్వాయుధాల తయారీకి అవసరమయ్యే పరికరాలు, ప్రాజెక్టులు ఉన్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌ ఫైటర్ జెట్‌లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వైమానిక దళం.. డ్రోన్ యూనిట్ కమాండర్‌ను చంపాయని ఐడీఎఫ్‌ ప్రకటించింది. టెల్‌ అవీవ్‌పై ఇరాన్‌ చేసిన వందలాది డ్రోన్‌ దాడులకు అతడు ప్రాతినిథ్యం వహించాడు.

ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టెల్‌అవీవ్‌ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సాయం లేకుండా ఫోర్డ్‌లోని భూగర్భ అణుకేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్‌కు లేదన్నారు. ఇజ్రాయెల్ ఇప్పటివరకు జరిపిన దాడుల్లో గణనీయమైన ప్రయోజనాలు సాధించిందని ట్రంప్‌ తెలిపారు.

అయితే, అమెరికా సాయం లేకుండా ఇరాన్‌కు చెందిన ఫోర్డ్‌ భూగర్భ అణుకేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం టెల్‌అవీవ్‌కు లేదన్నారు. ఒకవేళ వారు దాడులు చేసినా అది పెద్ద ప్రభావం చూపించవన్నారు. వారికి ఆ సామర్థ్యం లేదన్నారు. ఈసందర్భంగా తాను దౌత్యానికి కట్టుబడి ఉన్నానని చెప్పిన ఆయన.. సైనిక కార్యకలాపాలను ఆపేయాలని ఇజ్రాయెల్‌ను ఒప్పించడం ప్రస్తుతానికి అసంభవమన్నారు. ఎవరైనా గెలుస్తుంటే ఇలాంటి అభ్యర్థనలు చేయడం కష్టమని తాను భావిస్తున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో యుద్ధంలో టెల్‌అవీవ్‌ అద్భుతమైన దాడులు చేస్తుండగా టెహ్రాన్‌వి పేలవంగా ఉన్నాయన్నారు. ఇదిలాఉండగా ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి యూరోపియన్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను ట్రంప్‌ తోసిపుచ్చారు. వారు సాయం చేయలేరని వ్యాఖ్యానించారు. ఇరాన్ యూరప్‌తో కాకుండా అమెరికాతో చర్చలు జరపాలనుకుంటున్నారని వెల్లడించారు.

ఒకవేళ ఖమేనీ ప్రభుత్వం కూలిపోతే.. బలోచిస్థాన్‌ ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందని పాక్‌ భావిస్తోంది. ఇదే అంశాన్ని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో జరిగిన సమావేశంలో.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌ ప్రస్తావించారు. ఎక్కువ మంది బలోచ్‌ ప్రజలు పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌, ఇరాన్‌ సరిహద్దులో ఉన్న సిస్థాన్‌, బలూచిస్థాన్‌ ప్రాంతాల్లో ఉన్నారు.

సిస్థాన్‌, బలూచిస్థాన్‌ ప్రాంతాల్లోని బలోచ్‌ ప్రజలను అక్కడి ఇరాన్‌ ప్రభుత్వం అణచివేస్తోంది. తాజా పరిస్థితుల్లో వీరంతా ఏకమై ప్రత్యేక బలోచిస్థాన్‌ కోసం పోరాటం ఉద్ధృతం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో బలోచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ పాకిస్థాన్‌ మిలటరీపై తరచూ దాడులకు పాల్పడుతోంది. అంతేకాకుండా గతంలో జప్ఫార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును హైజాక్‌ చేసింది.

పాకిస్థాన్‌ కేంద్రంగా పని చేస్తున్న జైష్‌ అల్‌ అదిల్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ ఇప్పుడు ఇటు పాకిస్థాన్‌, అటు ఇరాన్‌ గుండెల్లో గుబులు రేపుతోంది. ఇది ఇరానియన్‌ వేర్పాటువాద సంస్థ. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తమకు ఓ గొప్ప అవకాశమని ఈ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఈ సంస్థలోనూ ఎక్కువ మంది బలోచ్ వాళ్లే ఉండటంతో దాని ప్రభావం పాక్‌పైనా ఉండొచ్చని ఆ దేశం కంగారుపడుతోంది.

జైష్‌ అల్‌ అదిల్‌ ఇరాన్‌ ప్రజలందరి పట్ల సోదర భావాన్ని చాటుతోంది. ముఖ్యంగా బలూచిస్థాన్‌ ప్రజలంతా సాయుధ దళాలపై పోరాటానికి సిద్ధం కావాలి అని జైష్‌ అల్‌ అదిల్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఏదేమైనా ఇరాన్‌-పాకిస్థాన్‌ సరిహద్దుకు ఇరువైపులా ఉన్న మిలిటెంట్లు తమ ప్రభుత్వాలపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

పరిస్థితులు అనుకూలిస్తే వారిద్దరూ కలిసి పోరాటం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బలోచ్‌ ప్రజలు కేవలం పాకిస్థాన్‌లో మాత్రమే కాకుండా, ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌లో జీవిస్తున్నారు. పాకిస్థాన్‌ జనాభాలో 3.6 శాతం వీళ్లే. ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌ జనాభాలో 2 శాతం వరకు ఉంటారు.

అయితే ఖమేనీకి సొంత ఇంటి నుంచే ముప్పు ఎదురవుతోంది. ఆయన పాలనను అంతం చేసేందుకు అక్కడి మైనార్టీ పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఇరాన్‌లో షియా ముస్లింలదే ఆధిపత్యం. ఇక్కడ బలోచ్‌, కుర్దులు మైనార్టీ వర్గాలు. వీరిలో ఎక్కువ మంది సున్నీలు. సుప్రీం లీడర్‌ ఖమేనీ నేతృత్వంలోని షియా ప్రభుత్వ పాలనలో వీరంతా అణచివేతకు గురయ్యారు.

ఇరాన్‌లో సుమారు 10 నుంచి 12 మిలియన్ల మంది ప్రజలు కుర్దులు. ఆ దేశ మొత్తం జనాభాలో ఇది 15 శాతం. ప్రస్తుతం వీరంతా ఖమేనీ ప్రభుత్వం కూలిపోతేనే.. పరిస్థితులు మారుతాయని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

ఇరాక్‌, సిరియా, తుర్కియేలో కుర్దులు మైనార్టీలు. కుర్దిష్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ను ఇటీవల తుర్కియే ప్రభుత్వం అణచివేసింది. అంతేకాకుండా అహ్మద్‌ అల్‌ షారా పాలనలో సిరియాలోని కుర్దులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇరాన్‌లోనూ అదే పరిస్థితి.. ఖమేనీ ప్రభుత్వం వారిని తీవ్ర అణచివేతకు గురిచేస్తోంది.

ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఇరాన్‌లోని కుర్దిష్‌ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఖమేనీ పాలనను అంతం చేయాలని అక్కడి ప్రజలకు పిలుపునిస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్‌లోని భయానక పరిస్థితులు తొలగిపోవాలన్నా ప్రజలు స్వేచ్ఛగా రోడ్ల మీద తిరగాలన్నా కచ్చితంగా ఖమేనీ పాలన అంతం కావాల్సిందేనని కుర్దిస్థాన్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇరాన్ ప్రకటించింది.

ఇలా అన్ని వైపుల నుంచి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని తట్టుకొని ఖమేని నేతృత్వంలోని ఇరాన్‌ ప్రభుత్వం ఎంత మేర మనుగడ సాధించగలదన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు పాకిస్థాన్‌ కేంద్రంగా పని చేస్తున్న జైష్‌ అల్‌ అదిల్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ ఇప్పుడు ఇటు పాకిస్థాన్‌, అటు ఇరాన్‌ గుండెల్లో గుబులు రేపుతోంది. ఇది ఇరానియన్‌ వేర్పాటువాద సంస్థ.

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తమకు ఓ గొప్ప అవకాశమని ఈ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సంస్థలోనూ ఎక్కువ మంది బలోచ్ వాళ్లే ఉండటంతో, దాని ప్రభావం పాక్‌పైనా ఉండొచ్చని ఆ దేశం కంగారుపడుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button