జాతియం

India-Pakistan: పాక్ ఎయిర్‌బేస్‌లపై విరుచుకుపడ్డ భారత్

India-Pakistan: సాక్ష్యాలు చూపించండి.. దాడులు చేశారని ఒప్పుకుంటామంటూ పాకిస్తాన్ పదేపదే చెబుతోంది. తమపై దాడులు చేయలేదంటుంది. కానీ ఇండియాను శిక్షించాలంటుంది. పాకిస్తాన్ విదేశాంగ విధానమే బ్లఫ్ మోడల్ ఆధారంగా సాగుతుంది. పహల్గామ్ దాడి తర్వాత ఇండియా ఆపరేషన్ సిందూర్ తో విరుచుకుపడగా, పాక్ ఇండియాపై దాడులకు ప్రయత్నించి భంగపడింది. పాక్‌కు కళ్లెం వేసేందుకు ఇండియా ఒక రేంజ్‌లో స్ట్రైక్స్ చేసింది.

గత వారం ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారతదేశం చేసిన దాడులకు సంబంధించిన కొత్త ఉపగ్రహ చిత్రాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పహల్గామ్‌లో ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఇండియా ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. దీంతో వణికిపోయిన పాకిస్తాన్, సరిహద్దుల్లో సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని డ్రోన్, క్షిపణి దాడులు చేయడంతో ఒక్కసారిగా భారత్ కన్నెర్ర చేసింది.

భారత సాయుధ దళాలు వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని విధ్వంసం సృష్టించాయి. ఆ విషయాలు తాజాగా అమెరికా ఏరోస్పేస్ సంస్థ మాక్సర్ టెక్నాలజీస్, విడుదల చేసిన హై రిజల్యూషన్ ఫోటోలతో తేటతెల్లమైంది. రావల్పిండిలోని నూర్ ఖాన్, సింధ్‌లోని సుక్కూర్, పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని రహీమ్ యార్ ఖాన్, పాకిస్తాన్ సైనిక స్థావరాలపై భారత సాయుధ దళాలు జరిపిన దాడుల దృశ్యాల స్పష్టంగా కన్పించాయి. ఈ చిత్రాలు సర్గోధాలోని ముషాఫ్, ఉత్తర సింధ్‌లోని షాబాజ్ జకోబాబాద్, ఉత్తర తట్టాలోని భోలారి పేరుతో ఉన్న పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ PAF స్థావరాలకు నష్టాన్ని కలిగించాయి.

గత వారం ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన విలేకరుల సమావేశంలో, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ భారత సాయుధ దళాలు పాకిస్తాన్ సైనిక లక్ష్యాలపై కచ్చితమైన దాడులు నిర్వహించాయని ధృవీకరించారు. వీటిలో సాంకేతిక మౌలిక సదుపాయాలు, కమాండ్, నియంత్రణ కేంద్రాలు, రాడార్ సైట్‌లు, ఆయుధ నిల్వలున్నాయని ఆమె చెప్పారు.

రఫీకి, మురిద్, చక్లాలా, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్, చునియన్‌లలో ఉన్న పాకిస్తాన్ సైనిక లక్ష్యాలు భారత వైమానిక దళ యుద్ధ విమానాల నుండి టార్గెట్‌ను దెబ్బకొట్టాయని ఆమె చెప్పారు. పస్రూర్, సియాల్‌కోట్ వైమానిక స్థావరంలోని రాడార్ సైట్‌లను కూడా పేల్చివేశాయి. ఈ దాడుల సమయంలో ఇండియాకు స్వల్ప నష్టాలు మాత్రమే ఎదురయ్యాయని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

ఇదే విషయాన్ని ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఎకె భారతి సైతం మొత్తం వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. ఇస్లామాబాద్ నుండి 10 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో భారీ పేలుడు తరువాత మంటల్లో చిక్కుకున్న దేశ సైనిక ప్రధాన కార్యాలయానికి ఆనుకుని ఉన్న కీలకమైన నూర్ ఖాన్ వైమానిక స్థావరాన్ని విలేకరులకు చూపించారు.

విలేకరుల సమావేశంలో, రహీమ్ యార్ ఖాన్ వైమానిక స్థావరం రన్‌వేకు విస్తృతంగా నష్టం వాటిల్లిన వీడియోను కూడా ఆయన చూపించారు. భారత సాయుధ దళాల పోరాటం ఉగ్రవాదులపైనే అని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ సైన్యం మాత్రం ఉగ్రవాదులకు మద్దతిస్తోందని, దీంతో ఘర్షణ పెరుగుతోందని ఆయన అన్నారు.

ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారతదేశం మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. భారత సాయుధ దళాలు లష్కరే తోయిబా, జైషే-ఎ-మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద గ్రూపులకు చెందిన శిబిరాలను ధ్వంసం చేశాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాయి.

భారత సాయుధ దళాల రాత్రిపూట ఆపరేషన్ల తర్వాత, పాకిస్తాన్ సైన్యం భారతదేశంలోని పశ్చిమ ప్రాంతాలలో డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. వాటిని విజయవంతంగా అడ్డుకుంది. ఆ తర్వాత భారతదేశం పాకిస్తాన్ భూభాగంలోని ఎంపిక చేసిన సైనిక లక్ష్యాలను ఢీకొట్టింది. నాలుగు రోజుల పాటు తీవ్రమైన సరిహద్దు డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత తక్షణమే సైనిక చర్యలను నిలిపివేయడానికి రెండు దేశాలు గత శనివారం కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button