India vs South Africa: సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం.. 7 వికెట్ల తేడాతో గెలుపు

India vs South Africa: ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. బౌలర్లు, బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో 7 వికెట్ల తేడాతో సఫారీలపై ఘన విజయం సాధించింది. మొదట బౌలింగ్లో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసి, ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్కు సఫారీ బ్యాటర్లు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ 46 బంతుల్లో 61 ఒక్కడే ఒంటరి పోరాటంతో అర్ధశతకం సాధించాడు. మిగతా బ్యాటర్ల నుంచి అతనికి సహకారం లభించకపోవడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టి సఫారీల పతనాన్ని శాసించారు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే చెరో వికెట్ తీశారు. అనంతరం 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్ అభిషేక్ శర్మ 18 బంతుల్లో 35 పరుగులతో మెరుపు ఆరంభాన్నిచ్చాడు.
శుభ్మన్ గిల్ రాణించాడు. భారత్ 15.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 12 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ విజయంతో టీమిండియా ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ డిసెంబరు 17న లక్నోలో జరగనుంది.



