ఆంధ్ర ప్రదేశ్

త్వరలో ఏపీలోనూ హైడ్రా మోడల్..? పవన్‌ ప్లాన్ అదేనా..? నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటి..?

ఏపీలో హైడ్రాను తీసుకొస్తారా..? తెలంగాణలోలాగా భూకబ్జాలను అడ్డుకునేందుకు సరికొత్త వ్యవస్థను ప్రారంభిస్తారా..? ఈ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తిగా ఉన్నారా..? అందుకే హైడ్రా కమిషనర్ను పిలిపించుకొని మాట్లాడారా..? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. తెలంగాణలో భూ కబ్జాలను నియంత్రించేందుకు ప్రభుత్వ భూముల పరిరక్షణకు రేవంత్ సర్కార్ హైడ్రా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థకు విశేష అధికారాలు కల్పించి హైదరాబాదులో ఎంట్రీ చేశారు. దీంతో హైడ్రా తర,తమ అన్న భేదం లేకుండా దూకుడు చూపించింది.

ఇటువంటి పరిస్థితుల్లో ఏపీలో హైడ్రా రానుందన్న టాక్ ప్రారంభం అయింది. హైడ్రా లాంటి బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసి కబ్జాల పర్వం పై గట్టిగానే ఉక్కుపాదం మోపాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఆ బాధ్యతలను ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. అందులో భాగంగానే హైడ్రా కమిషనర్ పవన్ కళ్యాణ్ ను కలిసినట్లు తెలుస్తోంది. మరి ఏపీలో త్వరలోనే హైడ్రా బుల్డోజర్లను దించనున్నారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

హైదరాబాద్‌లో హైడ్రా రఫ్పాడించేస్తోంది. ఆక్రమణలను ఖతం చేయడమే పనిగా పెట్టుకుంది. దీంతో హైడ్రా మోడల్‌ టాక్ ఆఫ్‌ ది నేషన్‌గా మారింది. హైడ్రా పనితీరు మీద విమర్శలు ఉన్నా కాలనీలు, బస్తీల్లో కబ్జాలకు చెక్ పెడుతుందన్న టాక్ అయితే బలంగా ఉంది. అయితే తెలంగాణలో ఇంప్లిమెంట్‌ అవుతున్న హైడ్రా మోడల్‌ ఇప్పుడు ఏపీ పాలకులను అట్రాక్ట్‌ చేస్తోందట. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ భేటీ అవడంతో ఇదే చర్చ తెరమీదకు వచ్చింది.

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ప్రత్యేకంగా ఏపీకి వచ్చారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీసులో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఇద్దరూ చాలా అంశాల మీద చర్చించుకున్నారని చెబుతున్నారు. అంతే కాదు హైడ్రా లాంటి వ్యవస్థ ఏపీతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా అవసరం అని ఈ సందర్భంగా పవన్ అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. పాలకుల ముందు చూపు అలాగే నిబద్ధత కలిగిన అధికారుల పనితీరు ఏ వ్యవస్థకు అయినా మంచి పేరు తీసుకొస్తాయని పవన్ తన ఒపీనియన్ వ్యక్తం చేశారట.

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను పవన్ ప్రత్యేకంగా కలిశారంటే సమ్‌థింగ్‌ ఈజ్‌ దేర్ అన్న చర్చ మొదలైంది. పవన్ పిలిపించుకున్నారా లేక ఆయనే పవన్ అపాయింట్‌మెంట్‌ తీసుకుని మరీ కలిశారా అన్నది క్లారిటీ లేదు. కానీ పవన్, రంగనాథ్‌ భేటీ తర్వాత మాత్రం ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా అన్నదే చర్చనీయాంశం అవుతోంది.

పవన్ అయితే అటవీ శాఖతో సహా ఏ శాఖకు చెందిన భూములు కబ్జాకు గురి అయితే సహించేది లేదని స్పష్టంగా చెబుతున్నారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురి అయితే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన ఇప్పటికే హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా మోడల్‌ను ఏపీలోనూ అందుబాటులోకి తీసుకొస్తే ఎలా ఉంటుందనే దానిపై రంగనాథ్‌తో భేటీలో ఆరా తీసినట్లు ఇన్‌సైడ్‌ టాక్.

హైదరాబాద్ నగర అభివృద్ధిలో హైడ్రా తీసుకున్న నిర్ణయాత్మక చర్యలు ఒకప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. హైడ్రా ఏర్పాటు అయిన తొలినాళ్లలో ఐపీఎస్ రంగనాథ్ నేతృత్వంలో బడాబాబుల ఫామ్‌హౌస్‌లను కూలగొట్టి, చెరువులను, కుంటలను కాపాడిన విధానానికి మంచి ప్రజాదరణ లభించింది. అయితే ఆ తర్వాత అమీన్‌పూర్‌లో జరిగిన కూల్చివేతల సందర్భంగా పేదల ఇళ్లపైకి వెళ్తున్నారనే ప్రచారం జరగడంతో హైడ్రాకు వచ్చిన సానుకూల ఇమేజ్ కాస్త ప్రతికూలమైంది.

ఈ విమర్శలతో హైడ్రా తన దూకుడును తగ్గించుకుంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వ స్థలాలను కబ్జాదారుల నుంచి కాపాడి.. ఫెన్సింగ్ వేయడం, బతుకమ్మ కుంటకు పూర్వస్థితి తీసుకురావడం వంటి పనులు తిరిగి మంచి పేరు తెచ్చిపెట్టాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా రంగనాథ్‌ను ఆహ్వానించి మరీ ఈ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ నగర పాలనలో సరికొత్త సంస్కరణల ఆవశ్యకతను చెబుతోంది.

అయితే ఏపీలో హైడ్రా మోడల్‌ అమలు చేయడం అంత సింపుల్ కాదు. తెలంగాణలో హైడ్రా హైదరాబాద్‌కే పరిమితమైంది. ట్విన్‌ సిటీస్‌లో నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై బుల్డోజర్లను దించేస్తోంది. అయితే ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, కర్నూలు, కడప, విజయనగరం ఇలా నగరాలు, పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి.

విశాఖలో భూముల ఆక్రమణ అనే ఆరోపణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఉన్న పెద్ద చర్చ. వరదల సందర్భంగా విజయవాడలో కొల్లేరు కబ్జాలు, ఆక్రమణల కథ చర్చనీయాంశం అయింది. కాకినాడలో సముద్ర తీర ప్రాంతంలో కబ్జాలు జనావాసాల్లోకి నీళ్లు..రెగ్యులర్‌ ఎపిసోడ్‌. అలా ఏపీలో పలు పట్టణాల్లో ఈ ఆక్రమణ అంశం పెద్ద చర్చగా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో అనధికార నిర్మాణాలు, ప్రభుత్వ భూముల కబ్జా, ముఖ్యంగా తీర ప్రాంతాల్లోని జల వనరుల ఆక్రమణ వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరించడానికి తెలంగాణ అనుభవం ఏపీకి ఉపయోగపడుతుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీటన్నింటి వివరాలు బయటికి తీసి బుల్డోజర్ల రంగంలోకి దిగితే మాత్రం ఏపీలో అనేక సంచలనాలు నమోదు అయ్యే అవకాశాలు లేకపోలేదు.

అభివృద్ధి చెందిన ప్రాంతాలలో అయితే కబ్జాలు, ఆక్రమణల లొల్లి ఎక్కువే. పవన్ ఓ అడుగు ముందుకేసి హైడ్రా మోడల్‌ తీసుకొస్తే మాత్రం ఏపీలో కబ్జాదారులకు నిద్ర లేని రాత్రులే అని అంటున్నారు. పవన్ ఈ విషయంలో ఆసక్తిగా ఉన్నారని కచ్చితంగా కూటమి ప్రభుత్వం దీనిపై సీరియస్‌గానే అడుగులు వేస్తుందని అంటున్నారు. ఏపీలో హైడ్రా మోడల్‌ వస్తుందో రాదో..చూడాలి మరి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button